Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులం చీకటికంటే గాఢమైనది. దాని స్వభావం క్రూరమైనది. అది మనిషితనానికి గంతలు కట్టి అమానుషంగా గొంతులు కోయిస్తుంది. అందుకు మరో ఉదాహరణే మిర్యాలగూడలో ప్రణరు దారుణ హత్య. అతి కిరాతకమైన ఈ కుల దురహంకారానికి ప్రాణంగా ప్రేమించినవాడిని కోల్పోయిన అమృతవర్షిణి గుండెకోతకు ఎలా స్వాంతన చేకూరుద్దాం... ''ఈ కులం మనిషి కంటే గొప్పదా..!?'' అని ప్రశ్నిస్తున్న ఆమె కన్నీటికి ఏమని బదులిద్దాం... కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల కడుపుకోతకు ఎవరిని బాధ్యులను చేద్దాం.. నిన్న అబ్దుల్లాపూర్మెట్లో ఇదే కుల దురహంకారానికి కన్న తల్లిదండ్రుల చేతుల్లోనే బలైపోయిన విజయలక్ష్మి ఉదంతాన్ని మరువకముందే నేడు మరో ప్రేమ కుసుమం నేలరాలడం కడు విషాదం...
ఉత్తరభారతంలోనే ఎక్కువగా కనిపించే ఈ కుల దురహంకారం నేడు దక్షిణాదికీ వ్యాపించి ఉభయ తెలుగు రాష్ట్రాలనూ గడగడలాడిస్తోంది. మన రాష్ట్రంలో మంథని మధుకర్, నిజామాబాద్ రోజా, వరంగల్ (మర్రిపెల్లిగూడెం) రాజేష్, కరీంనగర్ జీవన్, భువనగిరి (పల్లెర్ల) స్వాతి, నరేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విషాద గాధలెన్నో...! వెలుగులోకి రానివి మరెన్నో..!! ఇవన్నీ కులాంతర వివాహాలకు సంబంధించినవే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ కుల దురహంకార హత్యల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత స్థానాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లవే..!
దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించపోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితలలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లూనుకుంటోంది. ప్రేమానురాగాలను దునుమాడుతున్నది. నేడు ప్రపంచంలో జరుగుతున్న ఈ దురహంకార హత్యల్లో ప్రతి ఐదింటిలో ఒకటి భారత్లోనే జరుగుతున్నదంటే ఇది ఎంతటి తీవ్రరూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన సుప్రీంకోర్టు ''అత్యంత హేయమైన, అమానుషమైన, ఘోరమైన ఈ హత్యల వెనుక పరువు ఎక్కడుంది. ఉన్నదల్లా రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వమే.. ఇటువంటి ఘాతుకాలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షలకు అర్హులు'' అంటూ తీర్పునిచ్చింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానమే ఇంత తీవ్రంగా హెచ్చరించినా ఇవి ఆగకపోగా మరింత పెచ్చరిల్లడం దేనిని సూచిస్తోంది..!? ప్రణరు హత్యలో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఈ హత్య చేయించింది తానేనని పోలీసుల ముందు ఒప్పుకోవడమే కాదు అతడిని చంపించినందుకు తానేమీ బాధపడటంలేదనీ, తనకు కూతురుకంటే సొసైటీలో పరువే ముఖ్యమని నిర్భీతిగా ప్రకటించడం దేనిని ప్రతిబింబిస్తోంది..!? అభివృద్ధిక్రమంలో అంతమొందించాల్సిన ఈ మనువాద ఆధిపత్య భావజాలాన్ని తమ అధికారం కోసం పెంచిపోషిస్తున్నాయి పాలకవర్గాలు. ఫలితంగా నేటికీ కుల రక్కసి కోరల్లో విలవిలలాడుతున్నది ప్రజ.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సమస్య మరింత తీవ్రమైనట్టు జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2014లో దేశ వ్యాప్తంగా 28 కుల దురహంకార హత్యలు జరుగగా 2015కి ఆ సంఖ్య 251కి ఎగబాకడం మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే. జరుగుతున్న ఘటనల్లో కేవలం 10శాతం మాత్రమే నమోదవుతున్నాయంటే వెలుగులోకి రాని అకృత్యాలెన్నో అంచనా వేయొచ్చు. కమలనాథుల పరిపాలనలో ఈ కులదురహంకార హత్యలు ఏకంగా 792 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం. కాగా ఇప్పుడీ జాడ్యం తెలంగాణకూ అంటుకోవడం మరింత కలవరపరుస్తోంది. ప్రత్యేకించి గత ఏడాది రెండేండ్లుగా మధుకర్ నుంచి ప్రణరు దాకా వరుస ఘటనలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. వీటిలో అనేక ఘటనలలో నిందితులపై సరైన కేసులు, శిక్షలు ఉండకపోవడం మన ప్రభుత్వాల వైఫల్యాలకు, స్వభావాలకు అద్దం పడుతోంది. తాజా ఘటనలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల ప్రమేయమున్నట్టు వార్తలొస్తుండటం గమనార్హం.
తెలంగాణ సమాజానికీ ఇటువంటి ఘటనలు కొత్త కాకపోయినప్పటికీ అవి హత్యల దాకా వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే తెలంగాణది మొదటి నుంచీ ఉద్యమ సమాజం. దశాబ్దాల క్రితమే భూస్వామ్యానికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం నడిపిన నేల ఇది. ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రమయ్యింది. ఈ ప్రత్యేక తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని కోటి ఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్న వేళ తిరిగి భూస్వామ్య అవశేషాలైన సామాజిక వివక్షలు, ఈ కుల దురహంకార హత్యలూ చోటు చేసుకుంటుండటం విచారకరం.
బిడ్డల ఆశలను, ఆకాంక్షలను అనుమతించని సామాజిక కట్టుబాట్ల కోసం ఆ బిడ్డలనే బలితీసుకునే స్థితిని కల్పిస్తోంది కులం. భావితరాల భవిష్యత్తు మీద చావులను ముద్రిస్తోంది కులం. ఈ దుర్మార్గాలన్నీ చూస్తుంటే నిజంగా మనం ఆధునిక ప్రపంచంలోనే ఉన్నామా..? లేక ఇంకా మధ్యయుగాల్లోనే మగ్గుతున్నామా అనిపిస్తోంది. నిజానికి కుల దురహంకార హత్యలుగా పేర్కొంటున్న ఈ అకృత్యాలకు ఎవరిది బాధ్యత..? కేవలం హత్యలకు పాల్పడుతున్న తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యులదేనా..? పిల్లల అభిప్రాయాలను, ఆలోచనలను, కులాంతర ప్రేమలను, పెండ్లిండ్లను ఆమోదించని మన వ్యవస్థది కాదా..? నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలకవర్గాలది కాదా..? ప్రభుత్వాలది కాదా..?