Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే ప్రధాన లక్ష్యాలుగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న మనదేశంలో ఈ రోజుకి అసమానతలే మానవాభివృద్ధికి ఆటంకం కావడం సిగ్గుచేటు. ప్రపంచదేశాలు అభివృద్ధికి అడుగులేస్తుంటే, 72 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా వాటి గురించే మాట్లాడుకోవడం మన ఏలికల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆకలి, అవిద్య, పేదరికం వంటి మానవాభివృద్ధి సూచికల్లో ప్రపంచంలో మన స్థానమెక్కడ అని చూసుకుంటే ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదిక-2017 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 189 దేశాలకుగాను భారత్ 130వ స్థానంలో నిలిచింది. 2016లో కంటే ఒక్క స్థానంలో మెరుగ్గా ఉన్నా 2015లో వచ్చిన స్థానాన్నే తాజాగా నిలుపుకున్నట్టయింది. కొత్తగా సాధించేదేమీ లేదు. మానవాభివృద్ధిలో ఇండియా ప్రగతి మధ్యస్థమేనని తేలింది. అత్యధిక జనాభా కలిగిన చైనా 86వ స్థానంలో నిలిస్తే, బంగ్లాదేశ్ 136వ స్థానంలో ఉండటం గమనార్హం. పాకిస్థాన్ (150) కంటే మెరుగ్గా ఉన్నామని చెప్పుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వచ్చేఏడాది 7.3శాతం వద్ధిరేటుతో దూసుకుపోయి అద్భుతాలు ఆవిష్కరించబోతున్నట్టు ఊదరగొడుతున్న మోడీ సర్కార్కు ఈ లెక్కలు రుచించవు. వాస్తవం కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నప్పుడు బీజేపీ పాలనలో ఇంతకుమించి గొప్ప అభివృద్ధిని ఊహించలేం. యూరపు దేశమైన నార్వే తిరిగి మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఐస్లాండ్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
మానవాభివృద్ధి సూచికలో సూచించినట్టు 1990తో పోలిస్తే సగటు ఆయుర్దాయం 57.9ఏండ్ల నుంచి 68.8ఏండ్లకు పెరిగినా, పాఠశాల విద్యాభ్యాసం మూడేండ్ల నుంచి 6.4ఏండ్లకు చేరుకున్నా అవి కొందరికే. అసమానతలను తొలగించకుండా, ప్రజల ఆర్థికాభ్యున్నతికి పాటుపడకుండా దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తామనడం ఆకాశానికి నిచ్చెన వేయడమే. విధానాల అమలులో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే. ఒకరి తర్వాత మరొకరు నయా ఆర్థిక విధానాలను పోటీపడి అమలు చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం వదిలేసింది. పాలకుల పుణ్యాన ధనిక, పేదల మధ్య అగాధం పెరిగి 50కోట్లకుపైగా భారతీయులు అవిద్య, అనారోగ్యం, పేదరికాల మధ్య నలుగుతున్నారు. భారత స్థూల దేశీయోత్పత్తి మొదటి లక్ష కోట్ల డాలర్ల స్థాయి చేరడానికి ఆరు దశాబ్దాలు పట్టగా, మరో లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని కేవలం ఏడేండ్లలో దాటడం శుభసూచకమైతే ఎవరి ఆదాయం పెరిగిందన్నది ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ఒకశాతం ప్రజల చేతుల్లో 73శాతం సంపద కేంద్రీకతమైందన్న ఆక్స్ఫామ్ నివేదిక మన అసమానతలకు అద్దం పడుతోంది. 2004లో 9మందిగా వున్న శతకోటీశ్వరుల సంఖ్య 2017 నాటికి 200పైనే చేరడం గమనార్హం. అదే సమయంలో రోజుకు 20 రూపాయలు కూడా సంపాదించలేని వారు 80శాతానికి చేరడం అసమానతల తీవ్రతను తెలియజేస్తోంది. గ్రామాల్లో మూడొంతులమంది నెలకు 5వేల రూపాయల అత్తెసరు ఆదాయంతో నెట్టుకొస్తున్నట్టు సామాజిక కులగణన సర్వే నిగ్గుతేల్చింది. శిశు మరణాలు, పౌష్టికాహారంతో బాధపడే పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ పేదరికం, విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ భారత్ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ల కన్నా వెనుకబడి వున్నట్టు మానవాభివృద్ధి నివేదిక చెపుతోంది. ప్రపంచ జనాభాలో ఆకలితో అలమటించే అభాగ్యుల సంఖ్య 82.1 కోట్ల మంది ఉంటే, భారత్లో పౌష్టికాహార లోపంతో ఉండేవారు 14.8శాతం మంది ఉన్నారు. మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు 51.4 శాతం ఉన్నట్టు ప్రపంచ ఆహార భద్రత పౌష్టికాహార సంస్థ పేర్కొంది. 2020నాటికి దేశాన్ని దారిద్య్రరహితంగా తీర్చిదిద్దుతామన్న ఢిల్లీ పెద్దల మాటలెల ఉన్నా అంతకంటే చైనా అనేక విజయాలను నమోదు చేసుకొని అందనంత ఎత్తులో ఉంది.
మహిళా సాధికారత గురించి మన నేతలు చెబుతున్న మాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్త్రీ, పురుషుల మధ్య అసమానత మానవాభివృద్ధిలో భారత్ ఇంతగా దిగజారడానికి ప్రధాన కారణమని మానవాభివృద్ధి సూచీ తెలిపింది. ఇలా అయితే ఇద్దరూ శ్రామిక శక్తిలో సరిసమానం కావాలంటే 200ఏండ్లు పడుతుందంటూ చేసిన హెచ్చరిక కేంద్రం గుర్తెరగాలి. ఉపాధి, వ్యాపార అవకాశాల్లో మహిళలు ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ముందడుగు వేస్తుంటే, మనదేశంలో మాటలకే పరిమితమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాలకపార్టీల నినాదంగానే మిగిలింది. 144 దేశాల లింగ అసమానతల అధ్యయన సూచీలో భారత్ అడుగువరసన 108వ స్థానంలో ఉందంటేనే మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తున్నామన్నది తెలుస్తోంది. ఇప్పటికైనా మాటలను కట్టిపెట్టి మహిళలు ముందడుగు వేయడానికి అవకాశం కల్పించాలి. యూఎన్డీపీ కంట్రీహెడ్ చెప్పినట్టు జాతీయ ఆరోగ్య మిషన్, సర్వశిక్షా అభియాన్, జాతీయ ఉపాధి హామీ, విద్యాహక్కుచట్టం వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తే మానవాభివృద్ధి పెరుగుదల జరుగుతుంది. లేకపోతే మానవాభివృద్ధి సూచికలో ఆఫ్రికన్ దేశాల సరసన భారత్ చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.