Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్య వామపక్ష విద్యార్థి కూటమికి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాలను విషపూరితం చేసి, భావి తరాలను నిర్వీర్యం చేసే కుట్రను జేఎన్యూ విద్యార్థులు తిప్పికొట్టిన తీరు అభినందనీయం. అత్యున్నత స్థాయి విద్యాసంస్థల ఔన్నత్యాన్ని నీరుగార్చి, పాఠ్యాంశాలను పుక్కిటి పురాణాలతో నింపడానికి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సంఫ్ుపరివార్ శక్తులు ఒక వ్యూహం ప్రకారం చేస్తున్న ప్రయత్నాలకు ఈ తీర్పు చెంపపెట్టు! విద్యా కాషాయీకరణ ప్రయివేటీకరణ దూకుడు పెంచిన ఎన్డీఏ తీరుకు నిరసనగా విద్యార్థుల్లో, యువతలో వస్తున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. విశ్వవిద్యాలయాల స్ఫూర్తిని కాపాడుకోవడానికి విద్యార్థిలోకం ఎంత పట్టుదలతో ఉందో చెప్పడానికి వామపక్ష కూటమి అభ్యర్థులకు వచ్చిన భారీ మెజార్టీలే నిదర్శనం. ప్రస్తుత రాజకీయ సాంఘిక పరిస్థితుల్లో చాలా ప్రాముఖ్యత గల అంశం. మరో మాటలో చెప్పాలంటే హిందూత్వ అజెండాకు అక్కడ చోటు లేదన్న స్పష్టమైన సంకేతాన్ని జేఎన్యూ విద్యార్థులు ఇచ్చారు. ఇంత నిష్కర్షగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని చెప్పారు కాబట్టే ఆర్ఎస్ఎస్ కుదురు నుండి పుట్టిన ఏబీవీపీకి ఈ తీర్పు కంటగింపుగా మారింది. ఇనుప రాడ్లు, కర్రలతో దాడులకు బరితెగించింది. ఎన్నికల్లో గెలిచిన విద్యార్థి నేతలను, వారికి మద్దతిచ్చిన వారిని లక్ష్యంగా ఎంచుకోవడం ద్వారా భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నించింది. ఓటమిని గుణపాఠంగా తీసుకోవడానికి బదులుగా ఏబీవీపీ విద్యార్థులు అనుసరించిన ఈ తీరును ప్రజాస్వామ్య సమాజంలో ఊహించలేం. విషబీజాలు వెదజల్లిన చోట అమృతఫలాలు ఆశించలేం కదా! సంఫ్ుపరివార్ విధ్వంస ఆలోచనలను మస్తిష్కాల నిండా నింపుకున్న వారు ఇంతకు మించి ఎలా స్పందిచగలరు?
అభ్యుదయ, వామపక్ష శక్తులకు మారుపేరుగా నిలిచిన జేఎన్యూను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సంఫ్ుపరివార్ శక్తులు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తరహా చర్యలు మరింత ఉధృతమయ్యాయి. కొన్నేండ్లుగా జేఎన్యూ నిరంతరం వార్తల్లో ఉండటానికి ఆర్ఎస్ఎస్ పరివారం చేస్తున్న ఈ కుట్రలే కారణం. విద్యార్థి నేతలు, విద్యార్థులు, వారికి అండగా నిలిచే అధ్యాపకులపై తప్పుడు కేసులు బనాయించడం నుంచి, భౌతిక దాడులు చేయడం వరకు అనేక రకాల విన్యాసాలను ఈ శక్తులు చేశాయి. తమ చెప్పుచేతల్లోని అధికార యంత్రాంగం చేత చేయించాయి. జేఎన్యూ ఉపకులపతే ఈ విష ప్రచారంలో భాగం కావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఆ విశ్వవిద్యాలయానికున్న ప్రతిష్ట, పురోగామి స్వభావాన్ని దెబ్బ తీయడానికి కాషాయ శక్తులు సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీజేపీ ముఖ్యమంత్రులందరూ జేఎన్యూకు బారులు తీరింది అందుకే! విద్యార్థులను చీల్చడానికి, వారి మెదళ్లలో విషాన్ని చిమ్మడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొదటి నుండి ఈ కుత్సిత యత్నాలను తిరస్కరిస్తూ వస్తున్న జేఎన్యూ విద్యార్థులు తాజా ఎన్నికల్లోనూ అదే చైతన్యాన్ని మరింత దృఢంగా ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మోడీకి ఘనస్వాగతం పలికిన విశ్వవిద్యాలయ ప్రాంగణాలు నేడు నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నాయి.
ఒక్క జేఎన్యూలోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోనూ కాషాయ జెండా అనుబంధ విద్యార్థి సంఘానిది ఇదే తీరు! ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇవీఎంల మాయాజాలం ద్వారా మాత్రమే గెలుచుకోగలిగారన్న వార్తలు వచ్చాయి. ఇంతా చేసీ, గెలిచిన అ సంఘ అధ్యక్షుడు నకిలీ డిగ్రీ ధృవీకరణ పత్రాలతో విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడన్నది తాజా అభియోగం. అత్యున్నత నేతనే నకిలీ మకిలి వెంటాడుతుంటే, విద్యార్థి నేతలదేముందని సర్దుకుంటే అది వేరే సంగతి! పంజాబ్ విశ్వవిద్యాలయంలో నానాగడ్డి కరిచినప్పటికీ ఓటమి తప్పలేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లోనూ ఇదే స్థితి! ఒక దాని తరువాత మరొక విశ్వవిద్యాలయ విద్యార్థులు పదేపదే స్పష్టంగా చెబుతున్నా అర్ధం చేసుకోలేకపోతున్నారంటే వారిదేమి జ్ఞానం.. అజ్ఞానం! వంద భావాలు సంఘర్షించి, వేయి అలోచనలు వికసించి భవిష్యత్కు బాటలకు వేయాల్సిన చోట మేధస్సుకు ఆంక్షలు పెడుతూ, విద్యార్థినుల కదలికలను కూడా సహించలేని స్థితిలో ఉన్నారంటే వారిదే శీలం.. దుశ్శీలం! దేశం నలుమూలల నుంచి చేరిన విద్యార్థులు ఒక్కటై, ఉమ్మడిగా కష్టసుఖాలు పంచుకుంటూ, జ్ఞానాన్వేషణలో ఉంటే వారిలో కుల, మత, ప్రాంతీయ, లింగ భావాలను, విద్వేషాలను రెచ్చగొట్టాలని చూడటం ఏమి ఐక్యత... ఉత్త అనైక్యత! వారిలో ఇన్ని అవలక్షణాలున్నాయి కాబట్టే విద్యార్థిలోకం ఛీకొడుతోంది. జేఎన్యూ మరింత స్పష్టంగా చీదరించి చూపింది! మతోన్మాద శక్తులను తిప్పికొట్టడం, వారి దాడులను ప్రతిఘటించడం ద్వారా జేఎన్యూ అసలైన భారతీయతకు ప్రతీకగా నిలిచింది. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక, సమానత్వ, భావస్వేచ్ఛ విలువలను సమున్నతంగా నిలబెట్టింది.