Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కమలనాథులకు కర్నాటక ఉపఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగే షాక్! ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. మూడు లోక్సభ స్థానాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, వీటిలో కేవలం ఒకే ఒక్క లోక్సభ స్థానంలో మాత్రమే బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎమ్ కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్, జేడీయూ చెరో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అసెంబ్లీ స్థానాలు ఎలా ఉన్నా లోక్సభ స్థానాలపై కమలం పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఒక్క శివమొగ్గ లోక్సభ స్థానంలో మాత్రం చావు తప్పి కన్నులొట్టబోయినట్టు స్వల్ప మెజారిటీతో బయటపడింది. 14 ఏండ్లుగా ఏకఛత్రాధిపత్యం సాగించిన బళ్లారి స్థానంలో బీజేపీ చిత్తుగా ఓడిపోవడంతో గాలి హవాకు ఇక నూకలు చెల్లినట్టే. నోట్ల ప్రవాహం పారించినా ఏ మాత్రం కలసిరాలేదు. మరోవైపు సీఎం కుమారస్వామి సతీమణి అనితా రామనగర నుంచి లక్షపైగా మెజారిటీతో జయభేరీ మోగించి సంచలనం సృష్టించారు. బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ పోలింగ్కు రెండురోజుల ముందుగానే జేడీయూలో చేరడంతో ఆ పార్టీ బొక్క బోర్లా పడింది. కమలం గుర్తుకు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఒక రాష్ట్రంలోని ఈ ఐదు స్థానాల ఉపఎన్నికల జయాపజయాల్లో స్థానిక అంశాలే పని చేసుండొచ్చు! కానీ, సార్వత్రిక ఎన్నికలకు ఇది సూచిక కాదనీ, మోడీ చరిష్మా పడిపోలేదని కాషాయనేతలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. జనానికి బీజేపీ ఎంత దూరమైందో ఈ ఎన్నికలే స్పష్టమైన సంకేతం. ఇప్పటికే గుజరాత్, కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలను నిరుత్సాహ పరిచాయి. ఆ తరువాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, అంతకంటే ముందు మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాషాయ దళం కంగుతిన్న తరువాత వచ్చిన కన్నడ రాష్ట్ర ఉపఎన్నికల ఫలితాలు రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతం. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపడం ఖాయం. మొత్తమ్మీద ఈ ఫలితాలు బీజేపీ వ్యతిరేక శక్తులకూ, పార్టీలకూ కొత్త ఊపునిస్తాయనడంలో సందేహం లేదు.
2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పర్చుకోగల స్థాయిలో 282 స్థానాలు గెల్చుకుంది. అప్పట్నుంచీ తనను తాను అజేయశక్తిగా చెప్పుకుంటూ విజయగర్వంతో మిత్రులను కూడా లెక్కచేయలేదు. ఆ దూకుడుతోనే ఈ నాలుగున్నరేండ్లలో పదకొండు స్థానాలను చేజార్చుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ బలం 271కి చేరింది. అంటే సాధారణ మెజారిటీ కన్నా ఒక్క స్థానం తక్కువే. మోడీపై ఉన్న భ్రమలు రోజురోజుకు తొలగిపోతున్నాయనడానికి తాజాగా వెలువడిన ఉప ఫలితాలే తార్కాణం.
బీజేపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం ప్రజా వ్యతిరేక విధానాలే. ఏ వర్గం ప్రజలూ మోడీ సర్కార్ పట్ల సంతోషంగా లేరు. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ పెట్టుకున్న పొత్తులు, విచ్చిన్న, వేర్పాటు శక్తులతో సర్దుబాట్ల వల్ల గట్టెక్కినా మిగతా రాష్ట్రాల ఉపపోరులో ప్రజల తిరస్కారం చవిచూడక తప్పలేదు. గత సాధారణ ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గం చూపిన మోడీ ఆ తరువాత ప్రజలను కష్టాల పాల్జేశారనడానికి చెప్పలేనన్ని ఉదాహరణలున్నాయి. మంచిరోజులు రాకపోగా, ముంచే రోజులు వచ్చేశాయన్న సంగతి తెలుసుకుని తమ అభిప్రాయాన్ని ప్రజలు అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాలెట్ రూపంలో తెలియజేస్తున్నా మోడీ కండ్లు తెరుచుకోలేదు. స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ కొత్త పథకాలతో ఊదరగొట్టినా కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న కొద్దిపాటి ఉపాధి పోవడం, నిత్యావసర వస్తువుల ధరలు అందుకోలేనంతగా పెరగడాన్ని ప్రజానీకం చవిచూసింది. వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కార్పొరేట్లు దర్జాగా విదేశాలకు ఉడాయిస్తుంటే, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి తనువు చాలించిన సంఘటనలెన్నో. అవినీతి లేకుండా చేస్తానని చెప్పి పెద్దనోట్ల రద్దు విధానాన్ని చేపట్టి పేద, సామాన్యుల జీవితాలను ఛిద్రం చేశారు. జీఎస్టీతో చిన్న తరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఇవేమీ దరిచేరకుండా ప్రజలను మత ప్రాతిపదికన చీల్చి రోజులు గడిపారు. ఇవే మోడీ సర్కార్ పట్ల ప్రజల వ్యతిరేకతకు కారణమయ్యాయి. మత ప్రాతిపదికన ప్రజలను చీల్చి లబ్ధి పొందాలనుకున్నా ఆ ఎత్తుగడ యూపీ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. జనం ఎందుకు ఓట్లేశారో మరిచి, ఇతరేతర అజెండాలతో ఊరేగినా, దూకుడుతో, దబాయింపుతో నెట్టు కొద్దామనుకున్నా ప్రజాస్వామ్యంలో చెల్లదన్నది కమలనాథులు గ్రహించాలి. ఇప్పుడు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు బీజేపీకి బై..బై చెప్పడానికే మానసికంగా సిద్దమయ్యారన్నది యదార్థం. రేప్పొద్దున అధికారంలో ఎవరున్నా ప్రజలు బీజేపీని ఎందుకు తిరస్కరిస్తున్నారో తెలుసుకుని ముందుకెళ్లాలి తప్ప అవే విధానాలను అమలు చేస్తామంటే కుదరదని గుర్తెగితే మంచిది.