Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల గొంతును, నిరసనలను అణచివేయాలని ఏ ప్రభుత్వం ప్రయత్నించినా అలాంటి వాటికి ప్రజాస్వామ్యంలో స్థానముండదు. ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే అవి అంతకు రెండింతలు ఉవ్వెత్తున ఎగసిపడుతాయని పాలకులు తెలుసుకుంటే మంచింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా పరిపాలిస్తామంటే కుదరదని ధర్నాచౌక్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికో హెచ్చరిక.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ను యథావిధిగా కొనసాగించాలంటూ ఉమ్మడి హైకోర్టు ఆదేశించడం టీఆర్ఎస్ సర్కారుకు చెంపపెట్టు. ధర్నాచౌక్పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు వేసిన పిటీషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసుల అనుమతితో ప్రస్తుతం ధర్నాలు చేసుకోవచ్చని ఆరువారాల పాటు ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తర్వాత పరిశీలించి పూర్తిస్థాయిలో స్పందిస్తామని న్యాయస్థానం తెలిపింది. కొద్దిరోజుల్లో ఎన్నికలకు వెళుతున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు ఒకరకంగా ఈ తీర్పు చుక్కెదురే. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది. భవిష్యత్తు పోరాటాలకు, ప్రజాస్వామిక హక్కులకు హైకోర్టు నిర్ణయం మరింత ఊపిరిపోసింది.
శాంతిభద్రతల పేరుతో ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ను తొలగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కావాలంటే, నగరం శివార్లలో ధర్నాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తామంది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిని వామపక్ష, ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, స్వచ్చంధసంస్థలు ఖండించాయి. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్ సంరక్షణకు కమిటీ ఏర్పడి రోజుల తరబడి ఆందోళనలు నిర్వహించింది. చాలామంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై సుమారు ఏడాదిగా సరైన వివరణ ఇవ్వకపోవడంతో గత సెప్టెంబర్లో హైకోర్టు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. జనసమూహం ఉన్నచోటే ధర్నాలు నిర్వహించి నిరసన తెలియజేస్తారు. ఊరి చివర ధర్నాలు చేస్తే ఎవరు వింటారు? ఇది ప్రజాస్వామ్య దేశం. నిరసన గళాలను అణచివేస్తామంటే చూస్తూ ఊరుకోం. అడవిలో ఎవరైనా సెల్ టవర్లు వేస్తారా? మీరు చెబుతున్నది కూడా ఇలాగే ఉంది.' అంటూ మండిపడింది. దీనికి సంబంధించిన విచారణపై తాజాగా స్పందిస్తూ ధర్నాచౌక్ ఎక్కడ ఉందో అక్కడే ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తున్నారనీ, ఉద్యమాలు చేసుకోనివ్వడం లేదని గొంతు చించుకున్న టీఆర్ఎస్... ప్రభుత్వంలోకొచ్చిన మరుక్షణం నుంచే ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కుతూ వచ్చింది. తమతోపాటు నడిచిన ఉద్యమకారులపై నిర్భందాలకు దిగింది. 'ప్రభుత్వంపై గొంతెత్తితే మీ గతి ఇంతేనని'' బెదిరింపులకు దిగింది. స్థానికులు, ట్రాఫిక్, శాంతిభద్రతల పేరుతో శివార్లలో ధర్నాలు, నిరసనలు చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సలహాలు ఇచ్చారు. పైగా ఈ ఆంక్షలు పోలీసులు ఇచ్చిన ఆదేశాలంటూ దాటవేత ప్రయత్నం చేశారు. సేవ్ ధర్నాచౌక్ అంటూ ఆందోళన చేసిన వారిని స్థానికుల పేరుతో పోలీసుల చేత కుళ్లబొడిపించారు. స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీని పేర్కొంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలపై ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసింది. ప్రజలను తమ రాతలతో చైతన్యవంతం చేసే పత్రికల ఆదాయంపై దెబ్బ కొట్టాలని చూసింది. ప్రజా సమస్యలపై ఉద్యమించిన సీపీఐ(ఎం) వంటి వామపక్ష, ప్రతిపక్షాలపై నిరంకుశ అణచివేతకు దిగింది. ప్రతిపక్షాలు ఎక్కడా ధర్నాలకు దిగకుండా వారిని గహ నిర్బంధం చేయడం, రోడ్డుపైకొచ్చిందే తడవుగా అరెస్టుల పర్వాన్ని నిరాటంకంగా కొనసాగించింది. ధర్నాచౌక్ ఎత్తివేసిన తర్వాత ధర్నా లేని రోజు లేదు. అహంకారంతో తనకు ఎదురే లేదన్నట్టు పాలన సాగించాలనుకుంటే అది ఎక్కువ కాలం మనజాలదు. సభలూ, సమావేశాల వల్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప అసలు నిరసనలకే చోటీయరాదనుకోవటం అప్రజాస్వామికమని ఏలికలు ఇకనైనా గుర్తించాలి.
వివిధ సంస్థలు, పార్టీలు ఏదో ఒక సమస్యపై ధర్నాలు, నిరసనలు చేపడతాయి. వాటిల్లో పాలుపంచుకోవటానికి వేర్వేరు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజానీకం అక్కడికొస్తుంది. అంతమంది జనం ఒకచోట గుమిగూడినప్పుడు ట్రాఫిక్ సమస్య మొదలుకొని ఎన్నో సమస్యలు వస్తాయి. నిరసన తెలపడానికి వచ్చిన వారిని అందుకు నిందించి ప్రయోజనం లేదు. వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తాము సుభిక్షంగా పాలిస్తున్నామని, సమాజంలో ఏ వర్గానికీ అన్యాయం జరిగే అవకాశం లేదని తమకు తాముగా నిర్ణయించుకుంటే చెల్లదు. ఏం జరిగినా తమకు విన్నపాలు చేసుకుని నోర్మూసుకోవాలని, వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకోవాలని భావిస్తే కుదరదు. తీర్పు వెనకున్న స్ఫూర్తిని గ్రహించి అయినా భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలూ ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలి.