Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత బ్యాంకింగ్ వ్యవస్థ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని దురవస్థను నేడు ఎదుర్కొంటున్నది. ఒకవైపు రోజు రోజుకు బ్యాంకుల్లో డిపాజిట్లు కనీస స్థాయికి పడిపోతుండగా మరోవైపు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు) కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగిపోతున్నాయి. ఏకంగా ఈ నిరర్ధక ఆస్తులు 11.6 లక్షల కోట్లకు చేరుకోవడంతో సంక్షోభంలో చిక్కుకు పోయింది. నిన్నటిదాకా భారత ఆర్థికరంగానికే వెన్నుదన్నుగా, మకుటాయమానంగా నిలిచిన మన బ్యాంకింగ్ వ్యవస్థకు నేడు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? భారతీయ బ్యాంకులన్నీ దివాళా తీయడానికి ప్రధాన కారణమైన ఈ మొండి బాకీదారులు ఎవరు? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేనంటున్నది మన రిజర్వుబ్యాంకు. సమాచార హక్కు చట్టం కింద సామాన్య పౌరులు అడిగినా, సాక్షాత్తూ కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలు జారీ చేసినా ఆర్బీఐ మాత్రం సమాధానం చెప్పడానికి ముందుకు రావడం లేదు. లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలే ఈ పతనానికి ప్రధాన కారణంగా కండ్లముందు కనపడుతున్నా.. పతనం అంచున నిలిచుండి కూడా పతనానికి కారుకులైనవారి వివరాలు వెల్లడించలేని ఆర్బీఐ స్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా మనం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లతో పాటు అనేక పబ్లిక్ ప్లేస్లలో కొన్ని ఫొటోలను చూస్తుంటాం. ఆ ఫొటోల కింద ''దొంగలున్నారు జాగ్రత్త'' అనే హెచ్చరిక కూడా మనకు కనిపిస్తుంది. అటువంటి చోట్ల దొంగల బారిన పడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయడానికి వారి ఫొటోలను బహిరంగంగా ప్రదర్శిస్తోంది మన పోలీసుశాఖ. పొట్టకూటి కోసం మరోదారిలేక తప్పనిసరి స్థితిలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారి వివరాలను బహిర్గతం చేయడానికి లేని అభ్యంతరం.. వేలు, లక్షల కోట్లలో ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకు తింటున్న బడా బాబుల వివరాలను వెల్లడించడానికెందుకు? అన్నది సామాన్యుల ప్రశ్న..! దీనికి ఆర్బీఐ చెబుతున్న సమాధానాలేమిటి? ఒకటి, ఈ పేర్లు వెల్లడించడం వలన బ్యాంకుకు ఖాతా దారులకు మధ్య ఉన్న అనుబంధానికి భంగం కలుగుతుంది అని.. రెండు, ఈ దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం వాటిల్లుతుందీ అని. ఈ సమాధానాలు మరీ విడ్డూరంగా ఉన్నాయి..!
అంటే వీరికి.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన తమ కష్టార్జితాన్ని చిన్న చిన్న మొత్తాలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ బ్యాంకులను పోషిస్తున్న కోట్లాది మంది ప్రజలతో అనుబంధం ముఖ్యమా లేక ఆ కోట్లాది మంది ప్రజల డిపాజిట్లను కొల్లగొడుతూ బ్యాంకులను దివాళా తీయిస్తున్న కొంతమంది ఎగవేతదారులతో అనుబంధం ముఖ్యమా..!? ఇక రెండవది ఈ దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లు తుందంటున్నారు. బ్యాంకులను బురిడీ కొట్టించి వేలు లక్షల కోట్ల ప్రజల సొమ్మును దొడ్డిదారిన దోచుకుంటున్న దొంగలంతా ఇటు సమాజంలో అటు పార్లమెంట్లో, అసెంబ్లీల్లో పెద్దమనుషులుగా చలామణి అవుతుంటే దేశ ప్రయోజనాలకు అంతకంటే పెద్ద విఘాతమేముంటుంది. ఇదెలా ఉందంటే.. ఒక పామరుడు ఓ జ్ఞానిని అడిగాడట.
''స్వామి కడుపాత్రం కోసం చిన్న చిన్న నేరాలు చేసేవారంతా ఏమవుతారు'' అని.. అప్పుడుజ్ఞాని
''ఏమవుతారు నాయనా.. వారంతా జైలుకు పోతారు'' అన్నాడట.
''మరి తమ స్వార్థం కోసం దేశాన్నే దోచే ఘరానా దొంగల గతేంటీ స్వామీ'' అని అడిగితే..
''వారంతా పార్లమెంటుకు, అసెంబ్లీకి పోతారు కుదరకపోతే విదేశాలకు పోతారు నాయనా'' అన్నాడట. సరిగ్గా ఇలాగే ఉంది మన పరిస్థితి. ఇటువంటి వారంతా ఏలికలై పాలిస్తున్నారు కాబట్టే రిజర్వు బ్యాంకుకు ఈ స్థితి దాపురించింది. లేదంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదు. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వు బ్యాంకు సొమ్మును ప్రభుత్వ ఖజానాకు మల్లించేందుకు సెక్షన్ 7 ద్వారా తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్న ప్రభుత్వం అదే అధికారాన్ని ఇందుకు ఎందుకు ఉపయోగించడం లేదు? ఎందుకంటే ఈ అప్పుల ఎగవేతదారులే వారి మహారాజు పోషకులు..! కనుక వారి సేవలో తరించడమే వీరి ప్రథమ కర్తవ్యం. మోడీ ప్రభుత్వం ఏర్పడే నాటికి 2 లక్షల కోట్లుగా ఉన్న ఈ మొండి బకాయిలు ఈ నాలుగున్న రేండ్లలో 11 లక్షల కోట్లను దాటిపోవడం గమనార్హం..!
ఈ తీరున ప్రజలు బ్యాంకుల్ని నమ్మి దాచుకున్న సొమ్మునంతా ఈ ఘరానా మోసగాల్లు దోచుకుతింటుంటే నియంత్రించే ప్రయత్నాలేమి చేయకపోగా కనీసం వారి వివరాలైనా వెల్లడించండి అంటే చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? తెలుసుకోవడం ఈ దేశ పౌరుల హక్కు. అయినా చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఎవరెంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. చివరికి ప్రజల తరుపున కేంద్ర సమాచార కమిషన్ స్వయంగా అడుగుతోంది... బాకీలు పడ్డవారు ఎవరు? వీరిలో వడ్డీ కూడా చెల్లించకుండా ఉన్నవారెవరు? కనీసం వెయ్యి కోట్లకు పైగా ఎగవేసినవారి పేర్లయిన చెప్పండి అని ఆదేశించింది. ఆ ఆదేశానికి సమాధానం చెప్పడం మాని సవాలుచేస్తూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఆర్బీఐ ఉద్దేశ్యం ఏమిటి? ఆఖరికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా మీ అర్థంలేని వాదనలు, అభ్యంతరాలతో ప్రధాన ఎగవేతదారుల సమాచారాన్ని దాచడం సబబు కాదని స్పష్టం చేసింది. అయినా లెక్కచేయడం లేదంటే ఈ దేశంలో పాలన చట్టబద్ధంగానే సాగుతున్నట్టా..? సాగితే ఎవరి ప్రయోజనాల కోసం? పౌర సమాజం ఆలోచించాలి.