Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 8,9 రెండు రోజుల సార్వత్రిక సమ్మె, 9న గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేసిన భారత శ్రామిక జనావళికి జేజేలు. సార్వత్రిక సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భవన నిర్మాణం, ప్రయివేటు రవాణా, కొండలు, గుట్టలు మొదలు శిఖరాల వరకూ పని చేసే ప్లాంటేషన్ వర్కర్లూ... ఇలా అన్ని విభా గాలు, తరగతుల కార్మికులు పెద్దఎత్తున పాల్గొనడం హర్షణీయం. బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, టెలికమ్యూనికేషన్లు, పోర్టు లు, షిప్యార్డులతోసహా అనేక భారీ పరిశ్రమల్లో పని స్తంభించిపోయింది. భారత కార్మికోద్యమ చరిత్రలో ఇది ఓ ముఖ్య ఘట్టంగా నిలిచిపోతుంది. కేంద్ర ట్రేడ్ యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వగా అఖిలభారత కిసాన్సభ, వివిధ రైతు, వ్యవసాయ కార్మిక, సామాజిక సంఘాలతో కూడిన భూమి అధికార్ ఆందోళన్ జనవరి 9న గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించడం కార్మిక కర్షక మైత్రీ బంధాన్ని బలోపేతం చేసింది. బీజేపీ సర్కారుపై యావద్భారత శ్రామిక లోకం ఎత్తిన తిరుగుబాటు బావుటా ఉవ్వెత్తున ఎగసింది. సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ విజయం కష్ట జీవుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపి, భవిష్యత్ పోరాటాలకు గొప్ప బలాన్ని చేకూర్చుతుంది.
సార్వత్రిక సమ్మెతో కేరళ, అసోం, ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. సమ్మె ఈ రాష్ట్రాల్లో గరిష్ట ప్రభావాన్ని చూపింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు కార్మిక సమ్మె, మండల కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రదర్శనలు జరగ్గా రెండో రోజున వివిధ పట్టణాల్లో, నగరాల్లో సమ్మెలో పాల్గొన్న శ్రామికులు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర బైటాయించారు. కష్టజీవుల ఐక్యత చాటి చెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు జాతీయ రహదారితో సహా అనేక రోడ్లపై ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు నిలిపివేసి రవాణా స్తంభింపజేశారు. బెంగాల్లో తృణమూల్ శ్రేణులు, పోలీసుల దాడులు, తీవ్ర నిర్బంధం విధించినా అనేక రంగాలకు చెందిన శ్రమజీవులు వాటిని అధిగమించి సమ్మెను విజయవంతం చేయడం శ్లాఘనీయం. త్రిపురలో కాషాయ మూకలు, రక్షక భటుల నిర్బంధాన్ని తిప్పికొట్టి శ్రామికులు బంద్ నిర్వహించడం అభినంద నీయం. మహారాష్ట్ర, కర్ణాట కల్లో అనేక బహుళ జాతి సంస్థలు సైతం మూత పడినాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో ఇంత విస్తృతంగా కార్మిక సమ్మె జరగడం కొన్ని దశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి అని మీడియా పేర్కొనడం గమనార్హం.
వినాశకర నయా ఉదారవాద విధానాలను అనసరిస్తున్న మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను అడ్డగోలుగా యజమానులకు అనుకూలంగా సవరిస్తోంది. కార్మిక సంఘాలతో కనీసం చర్చించకుండానే చట్టాల్లో పెను మార్పులు చేసేస్తోంది. దేశానికి కీలకమైన రక్షణ రంగ ఉత్పత్తులతో సహా ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు పూనుకుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 2016 సెప్టెంబర్ 2న జరిగిన సమ్మె తరువాత సాగిన ఈ విస్తృత కార్యాచరణ కార్మికవర్గ ఆగ్రహానికి అద్దం పట్టింది. వివిధ కార్మిక సంఘాలూ శ్రమజీవులూ సాగించిన అనేక పోరాటాలు నిరసనలకు కొనసాగింపుగానే ఈ సమ్మె జరిగింది. గత ఆగస్టు తొమ్మిదిన జరిగిన జైల్భరో, సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగిన కిసాన్-మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీ, ఆ తరువాత నవంబర్ 29,30 తేదీల్లో హస్తినలో కదం తొక్కిన కిసాన్ ముక్తి మార్చ్ వంటివన్నీ కార్మికుల్లో పోరాటస్ఫూర్తిని మరింతగా పెంచాయి. మహారాష్ట్ర రైతుల పోరాటం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నిలకడగానూ విస్తృతంగానూ సాగిన గ్రామీణ ప్రజల పోరాటాలు, ఉద్యమాలూ ఇందులో భాగమే!
ఆసేతు హిమాచలం శ్రామికులు కన్నెర్ర చేస్తున్నా మోడీ సర్కారు తన రూటు మార్చుకోవడంలేదు సరికదా కష్టజీవులపై దాడిని మరింత పెంచడం గర్హనీయం. కార్పొరేట్ల సేవలో తరించిపోతున్నది. సమ్మె మొదటి రోజైన జనవరి ఎనిమిదవ తేదీనే కేంద్ర కార్మిక మంత్రి ట్రేడ్ యూనియన్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ఇందుకు తార్కాణం. పైపెచ్చు ఈ సమ్మెవల్ల ఎలాంటి ప్రభావమూ ఉండదని సభలో మంత్రి వ్యాఖ్యానించడం అహంకారానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ శ్రామిక వ్యతిరేక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, రాదనీ స్పష్టమవుతోంది. బీజేపీని, మోడీ ప్రభుత్వాన్నీ ఓడించడానికి రానున్న లోక్సభ ఎన్నికల రాజకీయ పోరాటంలో కార్మికవర్గం భాగస్వామి అవుతుందని ఈ రెండు రోజుల సమ్మె సంకేతాలిచ్చింది. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు నయా ఉదారవాద విధానాలనే మొత్తంగా విడనాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఈ విధానాలెక్కడా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చలేదు సరికదా కడగండ్లనే మిగిల్చాయి. అయినప్పటికీ మొండిగా ఆ విధానాలనే అమలు చేయబూనుకుంటే పాలకవర్గాలకు శృంగభంగం తప్పదు. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని ఐక్య పోరాట స్ఫూర్తి ప్రదర్శించిన శ్రామికలోకానికి అభినందనలు.