Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీచ రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు ప్రధాని మోడీ. అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయడంలో ఆరితేరిపోయారు. సభ్యతా సంస్కారాలను గాలికొదిలి దిగజారుడు రాజకీయాలకు దిక్సూ చిగా నిలుస్తున్నారు. తన పచ్చి నియంత ప్రవర్తనతో చట్టాలనే సవాల్ చేస్తు న్నారు. భారత ప్రధానిగా రాజ్యాం గంపై ప్రమాణం చేసిన మోడీ ఆచరణలో మనుస్మృతిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం కేరళలోని కొల్లంలో ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. అయ్యప్ప ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల వయస్సు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తున్న సీపీఎం సారథ్యóంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించిన తీరు హిందూత్వవాదుల వికృత రూపాన్ని కళ్లకుకడుతోంది. '' కమ్యూనిస్టులు భారతీయ చరిత్రను, సంస్కృతిని, ఆధ్యాత్మికతను గౌరవించరని మనందరికీ తెలుసు. కానీ, శబరిమల విషయంలో మరీ ఇంత ద్వేషం ఉందని ఎవరూ ఊహించలేదు. భారతదేశంలో మరే పార్టీ, ప్రభుత్వామూ ఇంత సిగ్గులేని విధంగా వ్యవహరించలేదు. శబరిమల విషయంలో ఎల్డీఎఫ్ సర్కారు ప్రవర్తన అత్యంత సిగ్గుమాలినదిగా చరిత్రలో మిగిలిపోతుంది'' అని మోడీ నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం అత్యంత సిగ్గుమాలిన చర్యగా తోస్తున్నది మన ప్రధానికి! అందుకు గాను కమ్యూనిస్టులపై ఆయన కోపం కట్టలు తెంచుకుంటున్నది.మనువాద భావజాలం మనసంతా నిండిన మోడీకి కమ్యూనిస్టులపై కోపముండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే, కమ్యూనిస్టులపై తనకున్న కోపాలన్నీ ప్రభుత్వంపైకి మళ్లించడం మాత్రం తీవ్ర అభ్యంతరకరం. స్వయంగా దేశ ప్రధానే బహిరంగంగా కోర్టు ధిక్కరణకు పాల్పడడం ఆందోళనకరం. తమ రాజకీయ అధికారం కోసం మతాన్ని ఒక సోపానంలా వాడు కోవడం చట్టం, రాజ్యాంగం పరిధిలో సాధ్యం కాదు. కాబట్టి కోర్టులు, రాజ్యాంగం అంటే కమలనాధులకు పడదు. కాబట్టి సంఫ్పరివార్ శక్తులు ఏనాడూ కోర్టులపై గౌరవాన్ని, రాజ్యంగంపై నమ్మకాన్నీ చూపలేదు. చరిత్రలో ఈ విషయం అనేకసార్లు రుజువయ్యింది. అందుకు కొనసాగింపుగానే మోడీ మాటలను, ఆయన ప్రవర్తననూ చూడాలి.
శబరిమలను దక్షణాది రామజన్మభూమిగా మార్చుకుని రాజకీయ అధికారం కోసం వాడుకోవాలని పకడ్బందీ ప్లాన్తో రంగంలోకి దిగిన సంఫ్పరివార్ శక్తుల కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఆ శక్తులు రగిలిపోతున్నాయి. నిజానికి కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వమే గనుక ఉండిఉంటే మరిస్థితి మరోలా ఉండేది. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ మెడలువంచి కేరళలో పాగా వేసే అవకాశం ఉండేది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో వారి పన్నాగం విచ్ఛిన్నమైంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ విచ్ఛిన్న రాజకీయాలను ఆ గడ్డపై సాగించడం అసాధ్యమన్న నైరాశ్యం మోడీ మాటల్లో వ్యక్తమవుతూ ఉంది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును చట్టాన్ని, రాజ్యాంగాన్నీ నమ్మేవారెవరూ వ్యతిరేకించరు. కమ్యూనిస్టులకు చట్టం, రాజ్యాంగంపై పూర్తి గౌరవం, నమ్మకం ఉంది కాబట్టే వారి సారధ్యంలోని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా సుప్రీం తీర్పును అమలు పరిచేందుకు కట్టుబడింది. ఆలయ ప్రవేశానికి సిద్ధపడిన కనకదుర్గ, బిందు అనే 40 ఏండ్ల ఇద్దరు మహిళలకు పూర్తి రక్షణ కల్పించి అయ్యప్ప దర్శనం చేయించింది. సుప్రీం తీర్పు అనంతరం ఇప్పటి వరకూ 51మంది మహిళలు స్వామి దర్శనం చేసుకున్నట్టు గురువారం సుప్రీం కోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సాటి భక్తుల సహకారం లేకుండా ఇంత ప్రశాంతంగా ఇది సాధ్యం కాదు. నిజమైన భక్తులెవరూ ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేదు.
భక్తికి లింగ బేధం లేదని వారు చాటి చెప్పారు. అయితే, మతాచారాలను తమ ఆధిపత్య చిహ్నాలుగా ప్రదర్శించే పూజారి వర్గాలు, సంఫ్ అనుయాయులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
మహిళా హక్కులతో ముడిపడి ఉన్న ఈ విషయాన్ని మతాచారాలతో కట్టడి చేయాలని కలలుగంటున్నారు. కుట్రలు పన్నుతున్నారు. అయితే ఈ కుట్రలను చైతన్యవంతమైన కేరళ సమాజం కలసికట్టుగా ఎదుర్కొంది. 50లక్షలమంది మహిళలు 600 కిలోమీటర్ల మహౌన్నతమైన మానవ కుడ్యాన్ని నిర్మించడమే ఇందుకు నిదర్శనం. అరకోటి మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి కేరళ రోడ్లపై కదం తొక్కిన దృశ్యం ఈ దేశం మనువాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం లేదన్న హామీ ఇచ్చింది. మనువాదులకు గట్టి హెచ్చరిక పంపింది. తమ మత విద్వేష, చట్ట, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలకు మనువాదులు స్వస్తి చెప్పకుంటే కేరళలో ఎదురైన పరాభవమే దేశమంతటా పునరావృతమవుతుంది.