Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సకల మానవ సంబంధాలకు ఆర్థికాంశాలే ప్రాతిపదిక అంటారు కారల్ మార్క్స్. అయినప్పటికీ మానవ సంబంధాల విశ్లేషణలో మగవారినీ, ఆడవారినీ వేరుగా చూస్తున్నారు. మానవ మనస్తత్వం గురించి మాట్లాడేటపుడు ప్రత్యేకించి జెండర్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ మహిళ స్వభావంపైన ప్రతికూల సూత్రీకరణలు చేస్తున్నారు. మహిళల ఆలోచనలకు వక్రభాష్యాలు చెబుతు న్నారు. మహిళలు ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో పురుషాధిక్య ప్రపంచం నిర్ణయిస్తున్నది.
మహిళల జీవితాల్ని నిర్దేశించే పితృస్వామిక భావజాలం సమసి పోనందునే 'ఆడమనసు' అనే భావన పాతుకుపోయింది. జెండర్ రీత్యా ఆడ, మగ వేరు కావచ్చు. అంతమాత్రాన ఆడమనసు, మగమనసు అని వేరేగా ఉంటాయా? కవులు, కళాకారులు, తత్వవేత్తలు మాత్రమే 'ఆడమనసు' అనే మాటని విభిన్న సందర్భాల్లో వాడుతున్నారు. ఇదేమి గౌరవప్రదమైన బ్రాండ్ ఇమేజ్ కాదు. 'ఆడమనసు' అన్నట్టుగా 'మగమనసు' అనే మాట ఎక్కడా వినిపించదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఆధిక్యతా స్థానంలో లేరు. మాతృస్వామిక వ్యవస్థలోనూ పెత్తనం చేసిన దాఖలాలు కనిపించవు. అందుకే ఏ సమాజంలోనూ, ఏ భాషలోనూ, ఏ సంస్కృతిలోనూ 'మగమనసు' అనే భావన కనిపించదు. ఆడవాళ్ళ మనస్తత్వం, బుద్ధి, ప్రవర్తనల మీదనే మగవారి తీర్పులు కనిపిస్తాయి చరిత్ర నిండా. పురాణాల దగ్గర్నించి ఆధునిక రచనల దాకా మహిళల మనస్తత్వం మీద అపసవ్య విశ్లేషణలే చూస్తుంటాం.
'స్త్రీ బుద్ధి ప్రళయాంతక:' అన్నది మహాభారతం. మహిళల వల్లనే మహాభారత యుద్ధం జరిగిందని సూత్రీకరించారు. కురువంశమే కలకాలం పాలిం చాలన్న నాటి రాజుల దుర్మార్గ తాపత్రయ ఫలితమే మహాభారత యుద్ధం. కానీ నెపం మాత్రం ఆడవాళ్ళ మీద మోపారు. రాజులనీ, ఆడవాళ్ళనీ నమ్మరాదని చెప్పింది పంచతంత్రం. పంచతంత్ర కథలు నీతివంతమైనవని పిల్లలకు చెబుతుంటారు.అంటే ఆడవాళ్ళను నమ్మరాదని చిన్ననాటి నుంచి నేర్పడమే కదా. ఇది ఎంత అన్యాయం! స్త్రీలు చపలచిత్తులని, వారి నోట ఆవగింజయినా దాగదని సినిమాల్లో, సీరియళ్ళల్లో చూపిస్తూనే ఉన్నారు. ఇది ఎంత అసంబద్ధం! మగవాళ్ళు స్థిరమనస్కులా? ఆడవాళ్ళు చపలచిత్తులా? ఈ సూత్రీకరణల శాస్త్రీయతని ప్రశ్నించకపోతే వివక్షాపూరితమైన భావజాలం సమసిపోదు.
స్త్రీలయినా, మగవారయినా నిరంతరం ఒకేతీరుగా ఆలోచిస్తారా? వారి భావాలు, అభిప్రాయాలు మారకుండా ఉంటాయా? నలుగురు ఆడవాళ్ళ మధ్యనే కాదు నలుగురు మగవాళ్ళ మధ్యన సైతం ఒక మాట దాగదు. వాటిని చిలువలుపలువలుగా ప్రచారం చేయడం వల్లనే గాసిప్స్కు అంతులేకుండా పోయింది. యూట్యూబ్ చానల్స్లో కుసంస్కారంతో కూడిన శీర్షికలు పెట్టి ఆడవాళ్ళ లైంగికత మీద జుగప్సాకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నది మగమహానుభావులే. వారిలోని పురుషదురహం కారం పచ్చిగా సోషల్మీడియాలో యధేచ్ఛగా కనిపిస్తున్నది. ఈ వాస్తవం లోకానికి తెలిసినా ఆడవాళ్ళ నోట మాట దాగదనే ప్రచారం కొనసాగు తూనే వుంది. పూటకో మాట మాట్లాడే రాజకీయ నాయకుల్ని చూస్తే ఎవరు చపలచిత్తులో అర్థమవుతుంది. అయినప్పటికీ చపలచిత్తులనే నిందని స్త్రీలు మోస్తున్నారు.
ఏ సందర్భంలో 'స్త్రీ మనసు అగాథం' అని షేక్స్పియర్ రాశాడో గానీ అప్పట్నించి మహిళ మనసు మీద విపరీత వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సమాజంలో ఇంత పారదర్శకత పెరిగాక కూడా ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే, ఆడవాళ్ళ మనసు ఎప్పటికీ అంతుబట్టదనే వక్ర భాష్యాలు ఆగలేదు. 'ఆడమనసు' అనే పేరిట స్త్రీలని కించపరిచే వాదనలు సమసిపోలేదు. మానవ మనస్త్తత్వాన్ని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని ప్రతిపాదనలు చేశాడు. స్త్రీల నైజం మీద కొన్ని మాటలు రాశాడు. ఫ్రాయిడ్ చెప్పినా అశాస్త్రీయమైన భావనలని శిరోధార్యం అనుకోనక్కర్లేదు.
స్త్రీల మనసు సున్నితమూ, లాలిత్యమూ, కుసుమ కోమ లమూ అనే కవితాత్మక ప్రవచనాలు కోకొల్లలు. ఆయా సంద ర్భాల్ని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుంది. అంతే తప్ప స్త్రీలం దరూ సున్నిత మనస్కులు, మగవారంతా పాషాణ హృదయులు కాదు. సున్నితత్వమనేది ఇద్దరికీ అవసరమే. అది సుగుణమే కానీ దోషం కాదు. అయితే అనివార్య పరిస్థితుల్లో సమాజం ఒప్పని నిర్ణయాలు తీసుకున్న మహిళలని తప్పు పడతారు. ఆడదయినప్పటికీ అస్సలు సున్నితమే లేదంటారు. ఈరకంగా కూడా స్త్రీల ప్రవర్తనని నియంత్రించడం, కోపతాపాలని వ్యక్తీకరించే హక్కు వారికి లేదన్నట్టుగా తీర్మానించడం. ఇది స్త్రీల భావోద్వేగాల్ని సైతం నియంత్రించే చెరలాట. ఈ తప్పుడు భావ జాల ఫలితమే 'ఆడదయి ఉండి కూడా...', 'కఠినాత్మురాలు' వంటి పదాలని రోజూ వింటున్నాం. కఠినంగా ఉండే హక్కు మగవారికి ధారా దత్తం చేసినట్టుగా, తీవ్రమైన నిర్ణయాలు స్త్రీలు తీసుకోరాదని చెప్పినట్టుగా ఉందీ ధోరణి. ఎవరో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది జెండర్ని బట్టి ఉండదు. సమాజంలోని నిర్దిష్ట సన్నివేశాలు, సందర్భాలలో ఆడయినా, మగయినా ఒకేవిధంగా ప్రవర్తిస్తారు. సామాజిక చలనసూత్రాలని అనుసరించే వ్యవహరిస్తారు. కనుక 'ఆడమనసు' పేరుతో మహిళల పట్ల ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ధోరణిని సమాజమూ, ముఖ్యంగా మీడియా మార్చుకోవాలి.