Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడికెళ్లినా ఎదురుపడే నో వెకెన్సీ బోర్డులు... కాళ్లరిగేలా తిరిగినా కాల్ లెటర్కు నోచని అనుభవాలు.. ఎన్ని కంపెనీలు తిరిగినా, ఎన్ని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఒక్కటే. ఎక్కే గడప దిగే గడప ఒకటా రెండా.. ఏండ్లు గడిచినా ఒంట్లో ఓపిక నశించడం, వయస్సు దాటిపోవడం మినహా ఉద్యోగం మాత్రం రావడం లేదు. ఇదీ 130 కోట్ల భారతావనిలో సగటు నిరుద్యోగి వేదన!
సరిగ్గా ఐదేండ్ల క్రితం 2014 ఎన్నికలకు ముందు ''మేం అధికారంలోకొస్తే ఏటా రెండు కోట్ల ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం'' అని మోడీ ప్రకటించినప్పుడు... ఈ దేశంలోని అసంఖ్యాకులైన నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎన్నికల్లో గెలిచి, మోడీ అధికారంలోకొచ్చి ఐదేండ్లు గడిచిపోతున్నాయి. కానీ ఆయన చెప్పిన కొత్త ఉద్యోగాల మాట అటుంచితే భర్తీకాని ఖాళీల సంఖ్యే కనీవినీ ఎరుగని రీతిలో పేరుకుపోవడం కనిపిస్తున్న విషాదం! దేశంలో సుమారు 60లక్షలకు పైగా సర్కారీ కొలువులు ఖాళీగా ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇది ప్రతిపక్షాల ఆరోపణో, ప్రభుత్వ వ్యతిరేకుల ఆక్షేపణో అయితే ఇప్పుడీ చర్చ అవసరమయ్యేది కాదు. ఇది ప్రభుత్వమే పార్లమెంటుకిచ్చిన సమాచారం! వివిధ సందర్భాలలో పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుల ప్రశ్నలకిచ్చిన సమాధానం! మన ప్రభుత్వ నిర్లక్ష్యమూ, నిధుల్లో కోత మూలంగా సంభవించిన పరిణామం! విద్యా, వైద్య, న్యాయ, పోలీసుశాఖల్లోనే 60లక్షల ఉద్యోగాల భర్తీ నిలిచిపోయిందన్నది ఈ సమాచారం రుజువు చేస్తున్న నిజం! ఇది ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండికొట్టడమే కాదు, ఆయా రంగాల్లో.. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో ప్రమాణాలను కూడా దెబ్బతీస్తుండటం గమనార్హం!
రూపాయి పతనం, అమిత వ్యయం, అంచనాలకందని వృద్ధిరేటు, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ... మోడీ పాలనలో ఈ దేశం గురించి చెప్పమంటే ఈ నాలుగు ముక్కలు చాలు. ఇది మిగిలిన వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది పక్కనబెడితే ఉద్యోగాల కల్పనపై మాత్రం పెను ప్రభావం చూపిస్తోంది. కొత్త ఉద్యోగాల కల్పన ఉత్త మాటగానే మిగిలిపోగా, ఉన్న ఉద్యోగాలకూ భద్రత కరువైందని ఈ ఐదేండ్ల అనుభవం చెబుతున్న పాఠం. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఉద్యోగావకాశాలకు నోచని కోట్లాదిమంది యువత నేడు నిరాశా నిస్పృహల్లో కొట్టు మిట్టాడుతున్నది. నగరాలు, పట్టణాల్లోనే కాదు, దేశ ప్రగతికి పట్టుగొమ్మలని చెప్పే గ్రామాల్లోని యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చదువులకు తగిన ఉపాధి దొరకకపోయినా జీవించేందుకు అవసరమైన కనీస ఉపాధి దొరకక ఆందోళన చెందుతోంది ఈ దేశ యువతరం.
ఆధునిక మానవుడు అపూర్వ మేధోసంపత్తిని సంతరించుకుని విశ్వాంతరాలను జయిస్తున్న కాలంలో కూడా ఉపాధి కోసం యువత పడిగాపులు పడటం ఎంతటి విషాదం..! నవభారత నిర్మాణంలో భాగస్వాములై ఈ దేశ కీర్తి ప్రతిష్టలూ అభివృద్ధీ ఇనుమడింపచేయాల్సిన యువతను ఆ కర్తవ్యానికి దూరంగా, అచేతనులుగా మిగల్చడమేనా ఈ సర్కారు సాధించే ప్రగతి? సమాజాన్ని ముందుకు నడిపే కొత్త మార్పులకు, జాతి వికాసానికీ దోహదపడాల్సిన యువత జీవితకాలం ఉద్యోగం కోసమో, ఉపాధికోసమో ఎదురు చూస్తూనే గడిపేయడం ఎంతటి దౌర్భాగ్యం?
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యలో నిరుద్యోగం ఒకటి. ఈ సమస్యను ప్రపంచంలోకెల్లా తీవ్రంగా ఎదుర్కొంటున్నది భారతదేశం. దీనిని అధిగమించకుండా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంది. దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాల్ని ప్రభావితం చేసే సమస్యల్లో అత్యంత ప్రధానమైనది నిరుద్యోగం. ఇది తీవ్రరూపం దాలిస్తే ఈ ఒక్క సమస్యే అనేక సమస్యలకు దారితీస్తుంది. అందుకే ''నిరుద్యోగం అనేది సమస్యల సమస్య'' అంటారు సామాజిక నిపుణులు. ఏ ఆర్థిక వ్యవస్థయినా బాగా అభివృద్ధి చెందాలంటే అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. వనరులన్నింటిలోకి మానవ వనరులు అత్యంత కీలకమైనవి. కీలకమైన ఈ వనరును నిరుద్యోగులుగా మిగిల్చి, నిర్వీర్యం చేసి సాధించేదేమిటి?
సగానికి పైగా యువజనమే... మన దేశం నిండా యువతరమే. భారతదేశం ప్రపంచంలో మరేదేశానికీ లేనంత యువసంపత్తి కలిగిన దేశం. ఇది అత్యంత ఆనందం కలిగించే అంశం కాగా.. ఏటేటా ప్రపంచంలో ఎక్కడా లేనంత నిరుద్యోగిత నమోదవుతున్న దేశం కూడా ఇదే కావడం ఆందోళన కలిగించే అంశం! ఈ వైరుధ్యాన్ని పరిష్కరించకుండా ఈ దేశ అభివృద్ధి సాధ్యమా? నిత్యం దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ప్రగల్బాలు పలికే ప్రభుత్వాధీశులు దీనికేం సమాధానం చెబుతారు? ఈ దేశానికి అపార మానవ వనరు ఈ యువ సంపత్తిని భాగ్యస్వాముల్ని చేయకుండా సాధించేది ఏ అభివృద్ధీ, ఎవరి అభివృద్ధీ? ''ప్రపంచీకరణ అనే వ్యవస్థలో ప్రభావితమవుతున్న ఏ దేశానికైనా ఉపాధి రహిత అభివృద్ధి అనేది ఆనందరహిత అభివృద్ధే'' అంటారు ఎం.ఎస్.స్వామినాథన్. నేడు జరుగుతుందదే! ఉత్పత్తికి కీలకమైన మానవవనరుల్ని ఉపయోగించుకోలేకపోయినంత కాలం.. అంటే నిరుద్యోగం ఉన్నంత కాలం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోనే కాదు, సాంఘిక-రాజకీయ వ్యవస్థల్లో కూడా అనేక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అందుకే ప్రజా శ్రేయస్సుకోరే ఏ రాజ్యంలోనైనా నిరుద్యోగ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా, తక్షణ కర్తవ్యంగా ఉంటుంది. మరి మోడీ ప్రాధాన్యతల్లో ఇది లేదంటే ఈ ప్రభుత్వం ఎవరి శ్రేయస్సు కోరుతున్నట్టు?