Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారత విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం. విద్యార్థి వీసా ముసుగులో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అక్రమంగా ఉండేందుకు ప్రయత్నించినందునే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. వాస్తవాలు తెలుసుకోకుండా మధ్యవర్తులు చెప్పింది నమ్మి నష్టపోయిన వారిలో ఎక్కువమంది భారత విద్యార్థులు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉండటం బాధాకరం. ఈ ఘటనలో అమెరికా ప్రభుత్వమే మొదటి ముద్దాయి అని చెప్పాలి. వేరేదారిలో విద్యార్థులు అక్రమంగా అమెరికాలో చొరబడితే వారిది తప్పు. ప్రభుత్వమే తమ పోలీసులచేత నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయించి అందులో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులను ఆ తర్వాత అరెస్టు చేయడం ముమ్మాటికీ అన్యాయమూ, అవమానించడమే. పైగా అక్రమ వలసదారులను పట్టుకోవడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఇలా వక్రమార్గంలో స్ట్రింగ్ ఆపరేషన్ చేశామని ఘనంగా చెప్పుకోవడం ఆశ్చర్యకరం! ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఆ దేశప్రజలను తన మాటలతో మోసపుచ్చుతూనే ఉన్నారు. యువతకు ఉపాధి చూపక పోవడానికి అక్రమ వలసదారులే కారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటున్న మోడీ భారత విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల స్పందించరా? అరెస్టయి ఐదురోజులైనా ఇప్పటివరకు మోడీ నోరెత్తలేదంటే దేశ విద్యార్థుల కంటే ట్రంప్ మీద ఈగ వాలకుండా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది.
అక్రమ వలసదారుల సంఖ్యకు అడ్డుకట్టవేయాలన్న ట్రంప్ ఆదేశాలను అమలు చేసే క్రమంలో అధికారులు కొత్త ఆపరేషన్కు తెరలేపారు. ఇందులో భాగంగా మిషిగన్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ను ప్రారంభిస్తున్నట్టు 2017ఫిబ్రవరిలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటు(ఐసీఈ) ప్రకటనలు ఇచ్చింది. న్యూజెర్సీలో 2015లో మూతపడి ఫార్మింగ్టన్ వర్సిటీ పేరిట కోర్సులు ఆఫర్ చేసింది. సిబ్బందిని, అధ్యాపకులను నియమించినట్టు ప్రత్యేక ఏజెంట్లుగా నియమించబడిన ఐసీఈలోనే అంతర్గత భద్రత దర్యాప్తు సిబ్బంది వెబ్సైట్ రూపొందించారు. విద్యార్థులను చేర్పించిన మధ్యవర్తులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ క్రమంలో మధ్యవర్తులు విద్యార్థులను ఆకర్షించి అడ్మిషన్లు ఇప్పించారు. లక్షల రూపాయలు వసూలు చేసారు. తాము అనుకున్న రీతిలో అంతా జరిగిపోవడంతో దాదాపు 600మంది విద్యార్థుల్నీ అధికారులు అరెస్టు చేశారు. ఇందులో కోర్సు గడువు ముగుస్తున్న వారూ, హెచ్1బీ వీసాకు ప్రయత్నిస్తున్న వారూ ఉన్నారు. అక్రమ వలసదారులను పట్టుకునేందుకే ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు యిప్పుడు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం. అందులో అత్యధికమంది భారతీయులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 129మంది ఉన్నట్టు పత్రికల ద్వారా తెలుస్తోంది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఎనిమిదిమంది మధ్యవర్తులపై కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల కృషితో కొంతమంది విద్యార్థులు విడుదలైనా, మరికొంతమంది పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలోనూ ఇలాంటి ఆపరేషన్ చేపట్టిన అమెరికా ప్రభుత్వం 11మంది విద్యార్థులను అరెస్టు చేసి వెనక్కి పంపారు. విద్యార్థులందర్నీ వెనక్కి పంపిన తర్వాత వారి భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకం. వారంతా పేద పిల్లలు. అప్పు చేసి చెల్లించిన లక్షల రూపాయలు ఎలా తీరుస్తారు.
యూనివర్సిటీ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నాకే అడ్మిషన్లు ఇప్పించామని, నగదు కూడా చెల్లించామని మధ్యవర్తులు చెప్పడం గమనార్హం. దీనికి అమెరికా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? తిరిగి ఆ డబ్బు విద్యార్థులకు చెల్లిస్తుందా? అక్రమ వలసదారులను గుర్తించడం కోసం యూనివర్సిటీని సృష్టించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మూర్ఖత్వంతో కూడుకున్న పని. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా పేరు తెచ్చుకున్న అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎవరు ఊహిస్తారు. నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు న్యాయస్థానానికి వివరణ ఇచ్చుకోవడం తెలివైన పనా? తన కనుసైగలతో ప్రపంచదేశాలను గడగడలాడించే అమెరికాకు అక్రమ వలసదారులను గుర్తించి పట్టుకునే వ్యవస్థ లేదనుకోవాలా? ఇతరులకు సుద్దులు చెప్పే అమెరికా పాలకులు విద్యార్థులను మోసం చేయడం సరైందేనా?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు పూర్తి విషయాలు తెలుసు కోకుండా మధ్యవర్తుల చెప్పిన మాటలు నమ్మి వెళితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. జీఆర్ఈ, టోఫెల్ ప్రవేశపరీక్షల్లో నెగ్గుకు రాలేని వారు అమెరికాకు వెళ్లాలనుకుంటే మంచిదారులే ఉన్నాయి. చదువుకుంటూ ఉద్యోగం చేసుకునేందుకు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పేందుకు విజ్ఞులయిన నిర్వాహకులను సంప్రదించాలి. ప్రభుత్వాలు కూడా విదేశా లకు వెళ్లాలనుకునే విద్యార్థులకు, వ్యక్తులకు అవసరమైన పూర్తి సమాచారం అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.