Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంగళవారంనాడు అమెరికా అధ్యక్షుడు తన స్టేట్ ఆఫ్ ద యూనియన్ ఉపన్యాసంలో ఇలా పేర్కొన్నాడు: 'మన దేశంలో సోషలిజాన్ని అనుసరించాలనే విజ్ఞప్తులతో మనం ఆందోళన చెందుతున్నాం. అమెరికాను ఎన్నటికీ సోషలిస్టు దేశం కానీయబోమని ఈ రాత్రి శపథ చేద్దాం.' సోషలిజానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన ప్రేలాపన తరువాత మూడు రోజులకు విడుదలైన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక అమెరికా అధ్యక్షుడికి సోషలిజం భయం ఎందుకు ఏర్పడిందో తెలియజేసింది. అమెరికాలో వర్గ పోరాటం తీవ్రమౌతోందని ఆ నివేదిక తెలియజేసింది.
గతేడాది అమెరికాలో సమ్మెకు దిగిన కార్మికుల సంఖ్య 1986 సంవత్సరం తరువాత అత్యంత అధికంగా నమోదయిందని ఈ నివేదిక తెలియజేసింది. 2018లో ఐదు లక్షలమందికంటే ఎక్కువగా కార్మికులు సమ్మెకు దిగారు. ఇది 2017 సంవత్సరం కంటే 20రెట్లు ఎక్కువ. ఏప్రిల్లో జరిగిన సమ్మెలో ఎక్కువగా 81,000మంది అరిజోనా టీచర్లు సమ్మెకు దిగటంవల్ల 4,86,000 పనిదినాలను కోల్పోయింది. అదే నెలలో ఒక్లహామాలో టీచర్లు చేసిన సమ్మెలో 20,000మంది పాల్గొన్నారు. ఆ సమ్మె కారణంగా 405000 పనిదినాలను కోల్పోవటం జరిగింది. పశ్చిమ వర్జీనియా, కెన్టక్కీ, కొలరాడో, ఉత్తర కరోలినాలలో విద్యా సంస్థలలో సమ్మెలు జరిగాయి.
అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ నూతన సంవత్సరంలో సమ్మెలు తీవ్రమయ్యాయి. గత నెలలో లాస్ ఏంజలెస్లో ఉపాధ్యాయులు వేలాదిగా సమ్మెకు దిగారు. అమెరికాలోని మెటామొరోస్లో 70వేలమంది కార్మికులు ఆటో పరిశ్రమలో చేస్తున్న సమ్మె ఇతర రంగాలకు కూడా వ్యాపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. 1981లో జరిగిన ప్యాట్కో సమ్మె తరువాత అమెరికా పాలక వర్గాలు అనేక దశాబ్దాలపాటు నిర్పారిశ్రామికీకరణకు పాల్పడ్డాయి. లక్షలాది మంది కార్మికులను పనిలో నుంచి తొలగించారు. వివిధ రూపాలలో కార్మికులకు చెల్లించవలసిన సొమ్మును ఎగ్గొట్టాయి. ఈ చర్యలను అమలు చేయటంలో కార్మిక సంఘాలు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యాయి. ప్రతి పోరాటాన్నీ ముందుకు పోకుండా చేశాయి. ప్రతి పరిశ్రమ మూతను సమర్థించాయి. ప్రతి ఓటమినీ విజయంగా చిత్రీకరించాయి.
వీటన్నింటి ఫలితంగా అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంపద కింది నుంచి పైకి పునఃపంపిణీ జరిగింది. అమెరికాలో కేవలం ముగ్గురు వ్యక్తులకు సమాజంలోని కింది సగం మందికి ఉన్నంత సంపద ఉంది. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత ఈ పదేండ్లలో అమెరికాలో శత కోటీశ్వరుల సంఖ్య దాదాపు రెండింతలైంది. ప్రతి రెండు రోజులకు ఒక కొత్త శతకోటీశ్వరుడు పుడుతున్నాడు. గతేడాదిలో ప్రపంచంలోని శత కోటీశ్వరుల సంపద రోజుకు రూ.20,000కోట్లు పెరుగుతుండగా మానవాళిలో సగంగా వున్న నిరుపేదల సంపద పెద్దఎత్తున 11శాతం తగ్గింది. కోట్లాది ప్రజల సామాజిక, రాజకీయ ప్రయోజనాలను రాజకీయ వ్యవస్థ ఏమాత్రం ప్రతిబింబించటం లేదు.
ట్రంప్ మితవాదం ఫాసిస్టు స్వభావాన్ని సంతరించుకుంది. ఈ స్వభావం లక్షణం సోషలిజంపట్ల బహిరంగ ద్వేషభావం కలిగి వుండటం. డెమోక్రటిక్ పార్టీ కార్మికవర్గాన్ని వర్గంగా కాకుండా వర్ణం, జెండర్ అస్థిత్వాల సముదాయంగా భావించి వాటిచుట్టూ పాపులిస్టు రాజకీయాలను నడుపుతుంది. ఆ విధంగా ఉన్నత మధ్యతరగతి రాజకీయాలను ద్రవ్య పెట్టుబడిదారీ వర్గంతోను, మిలిటరీ గూఢచార యంత్రాంగంతోను అనుసంధానించి నడుపుతుంది. ఒక మితవాద పార్టీకి వామపక్ష రంగు రావటానికి సెనేటర్ బెర్నీ శాండర్స్, కాంగ్రెసు మహిళ అలెగ్జాండ్రియా అకాషియో-కోర్టెజ్ లాంటి కొందరిని ముందుకు తెస్తుంది.
170ఏండ్ల క్రితం తమ కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంథంలో కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఎంగేల్స్లు పేర్కొన్న 'కమ్యూనిస్టు భూతం' ఇప్పటికీ పాలక వర్గాలకు నిద్రలేకుండా చేస్తోంది. తాము దేనికోసం నిలబడుతున్నామో సోషలిస్టులు స్పష్టంగా పేర్కొంటారు. ఏవో కొన్ని సంస్కరణలతో సమస్య పరిష్కారం కాదని సోషలిస్టులకు తెలుసు. పాలక వర్గాల సంపదను జాతీయంచేసి, యావత్ సమాజాన్ని పునఃవ్యవస్థీకరించటమే సోషలిస్టుల ధ్యేయంగా ఉంటుంది. ప్రధాన పరిశ్రమలన్నీ కార్మికవర్గ నియంత్రణలోకి వస్తేనే ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి, వృద్ధాప్య జీవితంలో భద్రత అందరికీ అందుబాటులోకి తేగలమని వారికి తెలుసు. అంతిమంగా ట్రంప్, మొత్తం పాలక వర్గం భయపడుతున్నట్టుగా రాజ్యాధికారం ప్రాధాన్యతను కార్మికవర్గం గుర్తించి విప్లవం వైపు అడుగులు వేస్తుంది. ఆ తర్వాత ప్రయివేటు లాభాల కోసం కాకుండా సామాజిక అవసరాలకు అనుగుణంగా సమాజం పునఃవ్యవస్థీకృతమవుతుంది.
ఇదంతా లెనినిజం ఆధారంగా ఏర్పడిన రాజకీయ పార్టీ ఒక విప్లవ కార్యక్రమం ప్రాతిపదికన కార్మికవర్గ పోరాటాలను నిర్వహించినప్పుడే జరుగుతుంది. అంతేకాకుండా ఆంటోనియో గ్రాంషి ప్రవచించిన విధంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించటానికి కూడా విశేష ప్రాధాన్యత ఉన్నది. వీటన్నింటి గురించి అర్థంచేసుకునే దిశగా అమెరికాలోని యువతరం అడుగులు వేస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా పాలకవర్గాలు మరింత తీవ్రమవుతున్న వర్గ పోరాటాలను, కార్మిక వర్గ ప్రతిఘటనను చవిచూడటం అనివార్యం కానున్నది.