Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భారతదేశంలో పెద్ద ఎత్తున మత హింస చెలరేగే అవకాశం ఉన్నదని అమెరికా నిఘా విభాగం ఆ దేశ కాంగ్రెస్కు సమర్పించిన నివేదిక భయాందోళనలు రేకెత్తిస్తోంది. మెజారిటీ ప్రజల మనోభావాల పేరుతో తమ మద్దుతుదారులను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో మత హింసను సృష్టించి, హిందువులను సమీకరించి ఎన్నికల విజయం సాధించాలని కమలనాధులు చేస్తున్న ప్రయత్నాలు పసిగట్టిన అమెరికా నిఘా విభాగం ఈ మేరకు హెచ్చరించింది. ఫిబ్రవరి 21న రామాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని ప్రయాగ్రాజ్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోన్న ధర్మ సంసద్లో తీర్మానించడం అమెరికా నిఘా విభాగం హెచ్ఛరికలు ఆషామాషీ కాదని తెలియజేస్తోంది. మనది లౌకిక దేశమయినప్పటికీ ఇటీవలి కాలంలో హిందూత్వ శక్తులు సమాజం, సంస్క ృతులతోపాటు అధికార పీఠంపైన కూడా బలమైన పట్టు సాధించాయనడం కాదనలేని వాస్తవం. అధికార అండ తోడైన హిందూత్వ శక్తులు జాతీయగీతం, బీఫ్, గోరక్షణ, రామమందిరం, శబరిమల... తదితర భావోద్వేగ అంశాలపై దూకుడు పెంచాయి. పాలక పార్టీలన్నిటికీ తాము మైనారిటీలను బుజ్జగించే విధానాలు చేపట్టడం లేదని, మెజారిటీ హిందువుల మనోభావాలను అగౌరవ పరచడం లేదనీ చాటుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను తాను హిందువుగా చాటుకునేందుకు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం. శబరిమల విషయంలో సుప్రీం కోర్టు హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ బగవత్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లాంటివే రాహుల్ కూడా చేయటం గమనార్హం. గోవులను గౌరవించేలా, వాటిని అన్ని విధాలా రక్షించేలా త్వరలో దేశంలో 'కామధేను యోజన' పథకాన్ని ప్రవేశ పెడుతామని తన బడ్జెట్ ప్రసంగంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం కూడా ఈ కోవలోనిదే. దేశాన్ని ఇలాంటి వాతావరణంలోకి నెట్టిన హిందూత్వ శక్తులు... 2019 ఎన్నికల విజయం ద్వారా ఆర్ఎస్ఎస్ భావజాలం ఇప్పుడు దేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచానికి చాటాలని ఉవ్వీళ్లూరుతున్నారు. భారతదేశమంతటా హిందూ సంస్క ృతి ఆదర్శ జీవన నియమావళిగా కలిగిన హిందూ రాజ్యస్థాపన అన్న తన లక్ష్యం తమకింకా ఎక్కువ దూరంలో లేదనీ, తొందరలోనే తాము తమ కలను సాకారం చేసుకుంటామని చాటిచెప్పాలనుకుంటున్నారు. ఇది సాధ్యం కావాలంటే ఎన్నికల వేళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, హింసకు పాల్పడటం అనివార్యం. ఆ దిశగానే సంఫ్ుపరివార్ చర్యలు సాగుతున్నాయి.ఇటీవల చికాగోలో జరిగిన వీహెచ్పీ సమావేశంలో 'కుక్కలు సింహాన్ని చూసి అరుస్తాయి' అని ఇతరులను రెచ్చగొట్టేందుకే అన్నారు. ఇక ప్రతి రోజూ బీజేపీ నేతలు, సంఫ్ు పరివార్ నాయకులు చేస్తున్న వందల కొలది రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అడ్డూ ఆపే లేదు.
దేశ భవిషత్కు, ప్రజాస్వామ్య మనుగడకూ 2019 పార్లమెంటు ఎన్నికలు కీలకం కానున్నాయి. మళ్లీ లౌకిక విలువలు మంటగలపడం, హిందూత్వ శక్తులే కనుక అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ కావడం ఖాయం. ఎందుకంటే అంబేద్కర్ పేర్కొన్నట్టు 'హిందూత్వ, ప్రజాస్వామ్యం రెండూ పరస్పర విరుద్ధ శక్తులు' కాబట్టి. హిందూత్వం పాలక భావజాలం అయిన చోట ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం. కుల అసమానత్వం, పరమత ద్వేషం, అప్రజాస్వామ్యాల కలయికే మతోన్మాదం. దానిని అడ్డుకునేందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ కృషి చేయాల్సిన సమయమిది. హిందూత్వ ప్రమాదాన్ని 1940లోనే గుర్తించారు అంబేద్కర్. ''ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టయితే అది దేశానికి పెను ప్రమాదం అవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. హిందువులు చెప్పేది ఏమైనా కావచ్చుకానీ, హిందూత్వ అనేది స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనలకు ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి'' అని స్పష్టంగా పేర్కొన్నారు. ఒక్క అంబేద్కర్ మాత్రమే కాదు, అసలైన దేశ భక్తులు, ప్రజాస్వామికవాదులు, ముఖ్యంగా కమ్యూనిస్టులూ అనేక త్యాగాలకోర్చి ఈ దేశంలో హిందుత్వ శక్తుల ఆగడాలను అడ్డుకున్నారు. ఇప్పటికీ అడ్డుకుంటున్నారు. ఇందుకు తాజా నిదర్శనం కేరళ. శబరిమలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలని విశ్వ ప్రయత్నం చేసిన హిందూత్వ శక్తులను కేరళ ప్రజలు కమ్యూనిస్టుల సారధ్యంలో వీరోచితంగా ఎదుర్కొన్నారు. రక్తపుటేరుల మీదుగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవాలని హిందూత్వ వాదులు పన్నిన పన్నాగాలకు, 50లక్షల మంది మహిళలు వీధుల్లోకొచ్చి శాంతి వారధి నిర్మించడం ద్వారా అడ్డుకట్ట వేశారు. కేరళ ప్రజల హిందూత్వ వ్యతిరేక ప్రజాస్వామిక చైతన్యం దేశ ప్రజలందరికీ ఆదర్శం కావాలి. ఈ దేశాన్ని హిందూత్వ శక్తుల నుంచి రక్షించుకోవాలి.