Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విషాదంలోనూ విద్వేషం పడగ విప్పుతోంది. ఉగ్రవాదుల ఘాతుకాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ జాతిమొత్తం అమరజవాన్లకు అంజలి ఘటిస్తున్న క్షణాల్లోనే జాతి వైషమ్యాలు రెచ్చగొడుతూ హిందూత్వ శక్తులు విరుచుకుపడుతున్నాయి. దశాబ్దాలుగా రావణకాష్టమై రగులుతున్న కశ్మీరుకు ఓ రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాల్సిన సమయంలో... నెత్తుటిధారను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోజూసే ప్రయత్నాలు శోచనీయం. వీరసైనికులు 43మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడిని తీవ్రమైనదిగా పరిగణించాల్సిందే. ఉగ్రవాద మూకలకు తగిన రీతిలో బుద్ధిచెప్పి తీరాల్సిందే. దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చి అండనిస్తున్న శక్తులెంతటివైనా కఠినంగా వ్యవహరించాల్సిందే. మరో అభిప్రాయానికి తావేలేదు. కానీ ఈ వంకతో అమాయక కశ్మీరీలపై కత్తులు దూయడం ఏం న్యాయం?
సరిహద్దుల్లో మందుపాతరలు పేలుతూనే ఉన్నాయి. ముష్కరులు ఇంకా మన భద్రతా బలగాలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఈ దాడుల్లో మరో ఐదుగురు వీరసైనికులను కోల్పోయిన విషాదం వెంటాడుతున్నా వెనుకాడని భద్రతా బలగాలు మొక్కవోని దీక్షతో పోరాడుతూ, ఘాతుకానికి కీలక సూత్రధారైన అబ్దుల్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్ను కూడా మట్టుబెట్టి ఒరిగిన తమ సహచరులకు ఘన నివాళులర్పిస్తుంటే.. దేశమంతా ఒక్కటిగా నిలిచి భారత సైన్యాలకు బాసటగా నిలవాల్సిన వేళ దేశ ఐక్యతకు చిచ్చుబెట్టజూడటం దేశభక్తి కాజాలదు.
పుల్వామా ఘటన తరువాత కశ్మీరీలను లక్ష్యంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. జమ్మూతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బీహార్, హిమాచల్ప్రదేశ్, హర్యానాల్లో సంఫ్ు పరివార్ శక్తులు ఈ అరాచకాలకు ఒడిగడుతున్నాయి. ఈ దాడులకు గురవుతున్నవారిలో దశాబ్దాల క్రితమే కాశ్మీరులోయ నుంచి పొట్ట చేతబట్టుకుని వలసలొచ్చిన వారు కొందరైతే, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు మరికొందరు. జరిగిన ఘటనతో ఏ సంబంధమూ లేని అమాయక ప్రజలు. ఈ దాడులన్నిటా ఒకే సామాజిక తరగతిని లక్ష్యంగా చేసుకోవడం, దేశం వదలి కాశ్మీరుకు పారిపోవాలని హెచ్చరిస్తుండటం చూస్తుంటే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతున్నదా అని సందేహం కలుగుతున్నది. ఈ దుర్ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్దార్ కాశ్మీరీ కావడం చేత కాశ్మీరీలందరినీ దోషులుగా చూడటం, వారిని దేశం విడిచి పారిపోవాలనడం వేర్పాటు వాదానికే మరింత అవకాశమిస్తుంది తప్ప ఎలా అంతమొందిస్తుంది?
భారత భద్రతా బలగాల మీద జరిగిన ఈ భయంకర దాడి పట్ల ప్రజల్లో భావోద్వేగాలు అత్యంత సహజం. అయితే సమస్యను పరిష్కరించే కృషి ద్వారా ఆ భావోద్వేగాలను చల్లార్చాలేగానీ వాటిని రెచ్చగొట్టి ప్రయోజనాలు పొందాలనుకోవడం స్వార్థ రాజకీయమే అవుతుంది. ప్రజల దేశభక్తియుతమైన ఉగ్రవాద వ్యతిరేక ప్రదర్శనలను, నిరసనలను ఒక వ్యూహం ప్రకారం ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు సంఫ్ుపరివార్ శక్తులు వాడుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా జమ్మూలో దాడులు, గృహ దహనాలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతోంది. కాశ్మీర్కు వెలుపలా ఈ దాడులు అంతకంటే తీవ్రంగా పెచ్చుమీరుతున్నాయి. పాట్నా, ఢిల్లీ, డెహ్రాడూన్ ఒకటేమిటి బీజేపీ పాలిత ఉత్తర భారతమంతా కాశ్మీరీల పరిస్థితి దయనీయం. ఇది లోయ వెలుపలి భారత భూభాగంలో కశ్మీరీలకు స్థానం లేదని చెప్పడమే అవుతుంది. కాశ్మీరుకూ మిగతా దేశానికీ మధ్య విభజన సృష్టిస్తున్న శత్రు ప్రయత్నాలకు చేయూతనివ్వడమే అవుతుంది.
ఇదిలా ఉండగా సైనికుల అంతిమయాత్రల్లో ముకుళిత హస్తాలతో చిరునవ్వులు చిందిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ, రోడ్డు షోల్లో మాదిరి ఫొటోలకు ఫోజులిస్తూ, శవపేటికలతో సెల్ఫీలు దిగుతూ బీజేపీ నేతలు దేశభక్తిని చాటుకుంటున్నారు. ''రక్తం మరిగిపోతోంది. ఇందుకు కారణమైన ఉగ్రవాద సంస్థలు, వాటి సంరక్షకులు ఎంతటివారైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు'' అంటూ భారీ డైలాగులు వల్లించిన ప్రధాని సైతం ఈ దాడిపై జరిగిన అఖిలపక్షానికి డుమ్మాకొట్టి ప్రారంభోత్సవాల్లో మునిగితేలారు. ఇవన్నీ దేనికి సంకేతాలు!?
దాడిపట్ల ప్రజల స్పందన ఉద్వేగ భరితంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కావాల్సింది సమస్యకు పరిష్కారాన్నిచ్చే రాజకీయ విధానం. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూనే ప్రభుత్వం దక్షతతో వ్యవహరించాలి. తన దౌత్య చతురతకు పదును పెట్టాలి. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టి శత్రువును ఒంటరి చేయాలి. అదే సందర్భంలో కశ్మీరీల మద్దతు పొందకుండా ప్రపంచమంతటినీ కూడగట్టినా ప్రయోజన ముండదని గుర్తించాలి. కశ్మీరీ సమాజం నుంచి ఉగ్రవాదులను దూరం చేయాలి. అంటే ప్రభుత్వం ఆ ప్రజలకు దగ్గర కావాలి. లోయ ప్రజల న్యాయబద్ధ ఆందోళనలను, ఆకాంక్షలను గుర్తించకుండా అది సాధ్యం కాదు. కాబట్టి అందుకవసరమైన చర్చలు, చర్యలు చిత్తశుద్ధితో చేపట్టకుండా, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకుండా.. సైనికుల త్యాగాలను, కశ్మీరీల కన్నీళ్లను తమ రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు..!