Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నదే అయింది. దేశం ఏమైపోతే నాకేంటీ.. నా అధికారం నిలబడితే చాలు.. ఇదీ మోడీ సర్కారు స్వార్థపూరిత ఆలోచన. ఆర్థిక సంవత్సరం ముగింపులో తనకు కావాల్సిన నిధుల్ని ఆర్బీఐ నుంచి బలవంతంగా గుంజుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆర్థిక అవసరాల పేరుతో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) నుంచి రూ.28వేల కోట్లు వాడుకోడానికి ఆమోదముద్ర వేయించుకున్నది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన బోర్డుమీటింగ్లో ఆర్బీఐ ఇందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంది. డివిడెండ్ రూపంలో సొమ్మును కేంద్రానికి బదిలీ చేసినట్టు గవర్నర్ శక్తికాంత్దాస్ చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తొలి విడత చెల్లింపులకు ఈ నిధుల్ని వాడుకోనుంది. మొత్తానికి ఆర్బీఐని దారిలోకి తెచ్చుకునేందుకు అందులో తనక్కావాల్సిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టి చివరికి ఎలాగోలా డబ్బులు రాబట్టుకుంది.
కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తన మంత్రదండంతో మార్చేస్తానని 2014ఎన్నికల సభల్లో మోడీ ఊదరగొట్టారు. ఇండియా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధిచెందే దేశంగా మారుతుందని, రూపాయి మారకం మెరుగుపడుతుందని, ఎగుమతులు పెరుగుతాయని, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు దేశానికి ఎగిరి వస్తారని, దేశం ఒక పారిశ్రామిక హబ్గా మారిపోతుందనే ప్రచారం హౌరెత్తించారు. అవన్నీ గాలిమాటలేనని కొద్దిరోజులకే తేలిపోయింది. మోడీ పగ్గాలందుకున్న తర్వాత పరిస్థితులు మరింత హీనంగా మారాయన్నది పచ్చి నిజం. కాంగ్రెస్ హయాంలో కోల్పోయిన ఆదాయాన్ని సాధించామని మొదట్లో కాషాయ నేతలు మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించినా వారి ఆటలు ఎంతోకాలం సాగలేదు. మేకిన్ ఇండియా అంటూ గొప్పలు పోయినా పారిశ్రామికరంగం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. ఎగుమతులు 2014కు ముందున్న స్థాయికన్నా మరింత దిగజారాయి. కార్పొరేట్ల లక్షలకోట్ల రుణ బకాయిలు రద్దు చేయడంతో బ్యాంకులు దివాళా తీశాయి. పకోడీ పొట్లాలు కట్టుకోవడం, ఆవులు కాయడం కూడా ఉపాధేనన్న స్థాయికి కేంద్రపెద్దలు దిగజారారంటే ఆర్థికపరిస్థితి ఎంత హీనస్థితికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ చక్కబడేందుకు నోట్లరద్దు ఒక్కటే మార్గమంటూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఫలితాన్ని దేశం ఇంకా అనుభవిస్తూనే ఉన్నది. పన్ను ఎగవేతదారులకు జీఎస్టీ ఒక్కటే ముకుతాడు అంటూ మరో మాయాజాలాన్ని సృష్టించినా ఖజానా నిండలేదు. పన్నుల వసూళ్లూ పెరగలేదు. వస్తుందనుకున్న డబ్బు రాలేదు కాబట్టి ఆర్బీఐ మిగులు నిధులపై మోడీ సర్కార్ కన్నేసింది. ఇందుకు ససేమిరా అంగీకరించక పోవడంతో తనకు తాను ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. కేంద్రం వ్యవహారాన్ని డిప్యూటీ డైరెక్టర్ విరాల్ ఆచార్య కూడా మౌనం దాల్చారంటే ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వరాలు కురిపించి వాటి అమలుకు ఆర్బీఐలో సవరణలు చేపట్టి ఓట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నది తెలియంది కాదు. రూ.9.59లక్షల కోట్ల ఆర్బీఐ నిల్వల్లో కనీసం రూ.3.5లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించి తీరాలని ఒత్తిడి చేయడం వెనుక ఉన్న అసలు కారణమిదే. ముందుగా తొలివిడత రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున వేయాలంటే 20వేల కోట్లు అవసరం. త్వరలో మరికొన్ని నిధులు బదలాయించడం ఖాయం. ఇప్పటి వరకు తన పరిధిలోని ఏ అంశాన్నయినా స్వతంత్రంగా నిర్ణయించుకునే ఆర్బీఐలో మొదటిసారి కొన్ని కీలక అంశాలపై ప్రత్యేక కమిటీలు వేసి అమలు చేయించుకున్నారంటే మోడీసర్కార్ ఆర్బీఐ అధికారాలను ఏ మేరకు కబళించిందో అర్థమవుతున్నది.
ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత్దాస్ బీజేపీకి నమ్మినబంటు. ఆర్ఎస్ఎస్ అనుకూలురు. ఆర్థికమంత్రిత్వశాఖలో పనిచేసిన వారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ రూపకల్పనలో ముఖ్యులు. పెద్దలకు కావల్సిన పనులు చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. అలాంటి వ్యక్తికి గవర్నర్గిరీ యిచ్చింది తన పని కేంద్రం సులువు చేసుకునేందుకేనని తేలిపోయింది. డివిడెండ్ రూపంలో కేంద్రానికి ఆర్బీఐ నిధులివ్వడంలో కొత్తేమీ లేదు. గతంలోనూ చెల్లించిన సందర్భాలున్నాయి. అయితే లాభాలకు మించి చెల్లించాలని పట్టుబట్టడం తప్పు. అలా చెల్లించకూడదన్నది మాలేగావ్ కమిటీ నివేదిక. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి బాధ్యత వహించి లెంపలేసుకోవాల్సిన మోడీ సర్కార్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వుబ్యాంకు నిధులపై కన్నేసి, కాజేయడం దుర్మార్గం. దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్న మోడీ మోసాలను ఎదుర్కోవాలి.