Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదారేండ్లుగా రాష్ట్రంలో ప్రజలచేత నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఫిరాయింఫుల ప్రహసనం యథేచ్ఛగా కొనసాగుతున్నది. వైఎస్ హయాంలో మొదలైన ఈ రాజకీయక్రీడ, తెలంగాణ వచ్చాక పతాకస్థాయికి చేరుకున్నది. అధికారంలో, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు, అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడు తున్నాయి. ప్రజాప్రతినిధులు ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా తమ వైపునకు తిప్పుకుని రాజకీయాలు ప్రజల కోసం కాదని చెప్పకనే చెబుతున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరథి నినాదంతో ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసిన నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఇప్పుడు 'నా తెలంగాణం ఫిరాయింపులమయం' అన్నచందంగా మార్చేశారు. నీళ్లూ నిధులూ నియామకాలే ట్యాగ్లైన్గా పోరాటాన్నీ నడిపిన నాయకుడు కేసీఆర్. అయితే ఇప్పుడు ఆ తెలంగాణ ఎటువైపు పోతున్నదన్నదే రాష్ట్ర ప్రజల హృదయాలలో ఉదయిస్తున్న ప్రశ్న.రెండోసారీ, ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించిన మాట వాస్తవమైతే, అధికారాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించాలి. ముఖ్యమంత్రీ ఆయన మంత్రివర్గం శ్రమించాలి. అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అటువైపుగా పరుగులు తీయించాలి. దురదృష్టవశాత్తు అలా జరగడం లేదని రాజకీయ విశ్లేషకుల మనోగతం. ప్రభుతాన్ని ప్రజల కోసం కాకుండా, పార్టీ కోసం, స్వప్రయోజనాల కోసం వాడుకుంటుండటం ప్రశ్నించదగినదే. ఆనాడు కాళోజీ అన్న మాటలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి. ''అభ్యర్థి ఏపార్టీ వాడని కాదు.. ఏ పాటివాడో చూడు.. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు.. ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు.. పెట్టుకునే టోపీ కాదు.. పెట్టిన టోపీ చూడు'' అని ఆ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సదృశ్యమే. ఆ మాటలు నేటి రాజకీయ పరిస్థితులకు సరిగ్గా అద్దం పడుతున్నాయి. ఇప్పుడు పార్టీలూ విధానాలన్న ప్రశ్న విలువలేకుండా పోయింది. ఏ పార్టీ నుంచి గెలుస్తారో? ఏ పార్టీలోకి దూకుతారో? ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రజలకు మాత్రం తెలియదు. అది ఓటయినా, ఎమ్మెల్యే సీటయినా, రాజ్యాంగం వాటిని అత్యంత విలువైన ప్రజాయుధాలుగా గుర్తించింది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియను చూస్తున్న మేధావులు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తొలిదఫా పాలనలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల పేర టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థ అయిన చట్టసభకు మకిలం అంటించారు. క్రమంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థానం విలువను కోల్పోతున్నది. అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడే సాధనంగా అది ఉపయోగపడుతున్నది. గతంలో 'వైఎస్ రాజశేఖర్రెడ్డి చేశాడుగా, మేము చేస్తే తప్పేంటీ!?' అని గులాబీ పార్టీ నేతల నుంచి అప్పుడప్పుడు పొలిటికల్ సెటైర్లు బయటకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వారు చెబుతున్నది నిజమే కావచ్చు. వారెవరో, ఏదో తప్పు చేశారని, మనమూ చేయాలా? అని అంటున్నవారూ ఉన్నారు. మొత్తం పరిస్థితి చూస్తే, 'అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది. గతంలో ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కప్పదాట్లకు పాల్పడేవారు. ఇప్పుడా రూపం, స్వరూపం పూర్తిగా మారింది. ఏకంగా పార్టీలకు పార్టీలనే విలీనం పేరుతో చట్టవిరుద్ధంగా సామూహిక ఫిరాయింపులను ప్రొత్సహించే సంస్కృతి ప్రవేశపెట్టారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కండ్లముందుండగానే. ఇటీవల చోటుచేసుకుంటున్న ఫిరాయింపులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్ టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి సైతం అదేబాట పట్టారు. ఇక్కడ అందరూ అంటున్నదీ చెబుతున్నదీ 'నియోజకవర్గ అభివృద్ధి' అనీ..! అలాగే తమ కార్యకర్తల అభిప్రాయం మేరకే అని... నిజమే కావచ్చు. ఇక్కడ చట్టసభల్లో ప్రవేశించి చేసుకున్న చట్టాలను చట్టుబండలు చేసి సాగిస్తున్న క్రీడలో ప్రజాప్రయోజ నాలు ఖూనీ అవుతున్నాయి. తద్వారా రాజ్యాంగబద్ధమైన వ్వవస్థలను అవమానిస్తున్నారు. విలువల తెర తొలగిస్తున్నారు.
1951లో వచ్చిన ప్రజాప్రాతినిధ్య చట్టం, అలాగే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న సవరణ నిబంధన రాజకీయ నాయకులు పార్టీలు మారటాన్ని నిరోధిస్తున్నది. తప్పని స్పష్టం చేస్తున్నది. అలాగే 1985, జనవరి 31న పార్లమెంటు ఆమోదించిన చట్టం, ప్రజాప్రతినిధులు గోడమీద పిల్లి వ్యవహారాలకు అడ్డు చెబుతున్నది. అయినా 'నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు..' అన్న తరహాలో వ్యవహరిస్తున్నది ఇటు సర్కారు. అటు ప్రజా ప్రతినిధులూ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నీతిమాలిన క్రీడకు తెగబడుతున్నారు. అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. విలువలను కాపాడాల్సిందీ ప్రజలే!