Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అగ్రనేతలు అడుగులేస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓట్లు అడుగుతూ మాటల మంత్రాలు ప్రజలకు వల్లే వేస్తున్నారు. 16సీట్లు గెలిపిస్తే కేంద్రాన్ని గల్లాపట్టి అడిగే దమ్ము వస్తుందని చెబుతున్నారు. అయితే, ఇక్కడే ఆ పార్టీ లేక ఆ పార్టీ నాయకత్వం పొరపడుతున్నదా? ఏండ్ల తరబడి చడీచప్పుడూ లేకుండా ఊరుకున్న టీఆర్ఎస్, ఇప్పుడు తాజాగా ఎన్నికల లబ్దికోసమే గట్టి మాటలు మాట్లాడుతున్నది. అనేక అంశాల్లో పార్లమెంటు బయటా, లోపలా మద్దతు ఇవ్వడంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందే ఆయా సందర్భాల్లో కేంద్రానికి వంతపాడింది. తద్వారా పేదల జీవన ప్రమాణాలు పడిపోవడానికి, చిధ్రం కావడానికి కారణమైంది. ఒక్కటేమిటీ చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు కండ్లముందు కదులాడుతాయి. గల్లా పట్టి అడిగే సందర్భాలు గతంలో అనేకం వచ్చినా, టీఆర్ఎస్ నాయకత్వం ఏనాడూ ఆ దిశగా ఆలోచించలేదు. అడుగులేయలేదు. పట్టించుకోలేదు. సరికదా, దేశ ప్రజలపై అనవసర భారాలు మోపే పలు బిల్లుల విషయంలో కాషాయ సర్కారుకు ఓటేసింది. తద్వారా సమస్యల ఉత్పన్నం కావడానికి తోడ్పడింది. అన్ని విషయాల్లోనూ ఇతర ప్రాంతీయ పార్టీలకంటే వేగంగా, భిన్నంగా ఎన్డీయే ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తింది తెలంగాణ సర్కార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అప్పట్లో ఆ పార్టీనేతలే చెప్పుకొచ్చారు. నిజమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరం. ఇది రాజ్యాంగబద్దమైన పరస్ఫర అవసరం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే, ఐదేండ్లుగా అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్లో అలరు బలరులు చేసుకున్నాయి. పదే పదే తమ ఎంపీలు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న బాధలను, వ్యథలను చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఇటు కేసీఆర్, అటు ఆయన తనయుడు కేటీఆర్ తాజా లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాటల మూటలను గుమ్మరిస్తున్నారు. అంతేగాక సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కారు అంటూ మరో కొత్త నినాదానికి ఊపిరులూదారు. బీజేపీతో దోస్తాన్ చేసి విభజన సమస్యలతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఏ ఇతర సమస్యలను పరిష్కరించలేకపోయారు సారు, కారు ప్రభుత్వం కూడా. ఢిల్లీ పోయినప్పుడల్లా ధగధగమెరిసే శాలువాలు కప్పడం, కట్టల కొద్ది వినతిపత్రాలు ఇవ్వడం చేశామని, మళ్లీ వాళ్లే చెప్పడం ఒక వింత. కాగా, రాష్ట్రంలో సమస్యలు కొలిక్కిరాలేదు. ప్రజలకు వాతలు పెట్టిన నోట్లరద్దు నుంచి జీఎస్టీ వరకు అన్నీ విషయాల్లో మద్దతు ఇవ్వడంలో అందరికంటే ముందు లైన్లో ఉండటం ఎవరికి తెలియనిది. నిరుపేదలకు ఏడారిలో ఓయాసిస్సుగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టం అమలులో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, బడ్జెట్ తగ్గించడాన్ని నిరసిస్తూ త్రిపుర పూర్వ ముఖ్యమంత్రి మాణిక్సర్కార్ దేశరాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగితే, తొలుత అందులో పాల్గొంటానని ప్రకటించిన అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, తర్వాత ముఖం చాటేశారు. 16సీట్లు ఇస్తే ఢిల్లీలో సర్కారు వస్తుందని, పనుల కోసం గల్లా పట్టి అడగొచ్చని ఇటీవల తరచుగా సభల్లో సెలవిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్కు 12ఎంపీ సీట్లు రానేవచ్చాయి. అవి సరిపోవంటూ ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లోని మంత్రి, అప్పటి టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి, వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్, అప్పటి నల్లగొండ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిని నయానో భయానో కారెక్కించుకున్నారు. అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎలాగూ ఆ తానులోని ముక్కేనాయే. అంటే 16ఎంపీ సీట్లు అప్పుడు ఉన్నాయన్నమాట. గతంలో కావాల్సినన్నీ సీట్లు ఉండగానే ఏమీ చేయలేకపోయిన గులాబీ నేతలు, ఇప్పుడు మళ్లీ 16సీట్లు కావాలని అడుగుతున్నారు. ఇటీవల సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఒకానొక సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశానికి కావాల్సింది నాయకుడు, నినాదాలు కాదు సరైన విధానాలు కావాలి. అవి సరిగ్గా ఉంటే, ఏ నాయకుడు ఉన్నా దేశం సుఖసంపదలతో పరిఢవిల్లుతుంది అని. రెండు సీట్లతో తెలంగాణ తెచ్చిన అని ఒక్క పక్క రోజూ ప్రసంగాల్లో ఊదరగొడుతూనే, మరోపక్క మెడలు వంచడానికి గల్లాపట్టి నిలదీయడానికి 16సీట్లు కావాలా? వాస్తవానికి కావాల్సింది చిత్తశుద్ధి. ప్రజల పట్ల జవాబుదారి తనం. అంకితభావం. ఆనాడు తెలంగాణే ఏకైక లక్ష్యంగా ప్రజల అండతో ముందుకు సాగారు కాబట్టే రాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడు ఆ ప్రజలను నమ్ముకోకపోవడం, రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాసమస్యలను పెండింగ్లో పెట్టి ఆటమొదలు పెట్టారు. నీకింత-నాకింత (క్విడ్ ప్రొకో) విధానాలు, నేను తిట్టినట్టు జేస్త.. నువ్వు కొట్టినట్టు చేయి అనే పాత చింతకాయపచ్చడి తరహా బూజుపట్టిన పద్ధతులతో సమయాన్ని వృథా చేశారు. అందుకుభిన్నంగా ఉద్యమకాలంలో ప్రజలనే నమ్ముకున్నట్టు, ఇప్పుడు కూడా ప్రజలే నమ్ముకుని ఉండిఉంటే, అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద ఒత్తిడితెచ్చి ఉంటే పరిస్థితి ఇంత దిగజారేది కాదు.