Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామపక్షాల చొరవతో యూపీఏ-1 ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ చట్టం ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా నిర్వీర్యమవుతున్నది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో చోటుచేసుకున్న ఉపాధి హామీ కూలీల మరణం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. పేదల ప్రాణాలు మట్టిలో కలిసిపోతుంటే చోద్యం చూస్తున్న దుస్థితి కనిపిస్తున్నది. చట్టం మూలాలు, సౌకర్యాల ఊసే మరిచి ఇష్టారాజ్యంగా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. తద్వారా నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చట్టాన్ని పక్కాగా అమలుచేయకుండా ఒకవైపు నోటికాడి ముద్దను ఇప్పటికే లాగేసుకుంటున్న ప్రభుత్వాలు కాస్తా, ఉపాధి హామీ కూలీల ప్రాణాలను గాల్లో దీపాలుగా మారుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఉపాధి హామీ చట్టం పట్ల తన అలసత్వం, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మరుసటి ఏడాదే ఉపాధి హామీ పనుల బడ్జెట్ను రూ.40 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు తగ్గించింది. ఇకపోతే ఉపాధి హామీ నిధులకు ఇవ్వాల్సిన 10శాతం మ్యాచింగ్ గ్రాంట్ను ఏనాడూ విదల్చని చరిత్ర తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానిది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కింద పల్లెలకు వచ్చే నిధులను సైతం దారి మళ్లించింది. ప్రభుత్వ నిర్వహణ ఒక సంసారం లాంటిది అంటూ అసెంబ్లీలో ముచ్చట్లు చెప్పిన మన ముఖ్యమంత్రి, తన ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్న ఉపాధి నిధులను తిరిగి సర్దుబాటు చేయడంలో విఫలమై, పల్లె ప్రజల కడుపు మాడ్చిన విషయమూ తెలియనిదా ? దాదాపు ఆరు నెలల ఆలస్యంగా బిల్లులు ఇచ్చిన మాట వాస్తవం కాదా ?. కనీస సౌకర్యాలు కల్పించడంలో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు పోటాపోటీగా వెనుకబడుతున్నాయి. వామపక్షాల ఒత్తిడి నేపథ్యంలో యూపీఏ-1 పరిపాలనా కాలంలో పకడ్బందీగా చట్టం అమలైంది. ఆ తర్వాత మోడీ ప్రధాని అయ్యాక, క్రమంగా నిధులకు కోత విధించారు. ఉపాధి హామీ చట్టాన్నీ నీరుగార్చారు. టీఆర్ఎస్ పాలకులు కూడా ఇందుకు తక్కువేమీ కాదు. తీలేరు ఘటన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం గమనార్హం. ఎర్రటిఎండల్లో పనిచేస్తూ 10మంది కూలీలు అసువులు బాస్తే, ఇప్పటిదాకా ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. సాయం అందలేదు. సానుభూతి ప్రకటన ఒకటి మీడియాకు పడేసి, చడీచప్పుడులేకుండా ఉండిపోయారు. పనిప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు, సురక్షిత తాగునీరు, కూలీల పిల్లల కోసం ఆయాల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతోకూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతున్నది. ఆ సదుపాయాలేవీ నేడు కూలీలకు పూర్తిస్థాయిలో అందడంలేదు. తట్ట, పార, గడ్డపార, గొడ్డలి, కొడవలి తదితర పనిముట్లను భార్యాభర్తలైన కూలీలకు ప్రతియేటా సరఫరా చేయాలని ఉపాధి చట్టం. నిబంధనలు చెబుతున్నాయి. అయినా ఇప్పటిదాకా వాటిని ఇచ్చిన దాఖలాలే లేవు. నిరుద్యోగ భృతి జాడే లేదు. జాబ్ కార్డున్న ప్రతికుటుంబానికీ వందరోజుల పని చూపించాలన్న మార్గదర్శకాలు కాస్తా, మరుగునపడ్డాయి. యాభైశాతం కూడా అవి అమలుకావడం లేదు. పనుల కోసం కిలోమీటర్ల తరబడి నడవాల్సిరావటం, తీసుకెళ్లిన నీళ్లు కాస్తా, గంటలోపే అయిపోవడం ఉపాధి కూలీల చావు మీదకు తెస్తున్నది. రేట్లను ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా సవరించి సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తాజా పరిస్థితులు అందుకు డిమాండ్ చేస్తున్నాయి కూడా. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీల బతుకులు నేడు ఎండమావిగా మారుతున్నాయి. ఉపాధి పనుల్లేక ఇతర దేశాలు, నగరాలకు తరలిపోతున్న నేపథ్యంలో నేడు పల్లెలు కళతప్పుతున్నాయి. తద్వారా వృద్దులు, పిల్లల ఆలనాపాలనా ప్రశ్నార్థకమవుతున్నది కూడా. జాతీయ ఉపాధి హామీ చట్టం-2006 ప్రకారం నిర్ణయించిన వేతనాలను అమలు చేయాల్సి ఉంది. వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతున్నది. ఏనాడూ రోజూ కూలి గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. తాజా లెక్కల ప్రకారం ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం రూ.211 ఇవ్వాల్సి ఉంది. కానీ, నేడు రాష్ట్రంలోనిగానీ ఏ ఒక్క కూలీకి సదరు వేతనం అందడం లేదన్నది నగసత్యం. ఉపాధి కూలీల సంక్షేమం కోసం ఇటీవల హైదరాబాద్లో దాదాపు 10ప్రజాసంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అసలు ఎర్రటిఎండల్లో కూలీలు పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదనే దానికి మూలకారణాలను శోధించాల్సిన అవసరమున్నది. ఇదిలావుంటే రాష్ట్ర వ్యాప్తంగా 280మండలాల్లో తీవ్రమైన కరువు నెలకొంది. అయినా నీరో చక్రవర్తిని తలపిస్తోంది రాష్ట్ర సర్కారు. 2016లో మినహా కొత్త రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధనిక రాష్ట్రమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప, వాస్తవ స్థితిగతులను అంచనావేయడంలో తెలంగాణ ప్రభుత్వం, దాని అధినేత పూర్తిస్థాయిలో విఫలమయ్యారనే అరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కరువు మండలాలను ప్రకటించకపోవడం మూలంగా కేంద్రం నుంచి రావాల్సిన అదనపు నిధులను ఆగిపోగా, ఉపాధి హామీ చట్టం కింద కరువు ప్రాంతాల్లోని కూలీల కుటుంబాలకు అదనంగా రావాల్సిన 50పనిదినాలనూ నష్టపోవాల్సిన దుర్గతి ఏర్పడింది.