Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీటికి చలనం ఉంటేనే ఏటికి వరదొస్తుందిరా నిప్పున జ్వలనం ఉంటేనే గుప్పున మంటొస్తుందిరా..'' అంటారు సినారె. నీటికి చైతన్యం చలనం. నిప్పుకు చైతన్యం జ్వలనం. ప్రకృతికైనా సమాజానికైనా ఈ చైతన్యమే పురోగమన సాధనం. చైతన్యం ఒక ప్రవాహం. అది కొన్ని సందర్భాల్లో నెమ్మదిగానూ, మరి కొన్ని సందర్భాల్లో ఉధృతంగానూ సాగవచ్చు. కానీ దాని ప్రవాహం మాత్రం నిరంతరం. అందుకే 'చైతన్యం లేకపోతే జగతికి వెలుగే లేదురా'' అని తేల్చి చెపుతారాయన. ఆ చైతన్యం... ఒకానొక అద్భుత రూపం ''కళ''. కళ అంటే మనిషి అవ్యక్త భావాలను వ్యక్తీకరించే ఓ సువిశాల మాధ్యమం. అక్కడ విజ్ఞానం, వికాసం, వినోదం, విషాదం, సంతోషం, సుఖం, దుఃఖం, సాహసం, సౌందర్యం వంటి అనేక చైతన్యాలను దర్శిస్తాడు మనిషి. ఆ దర్శనం ఎంత విస్తృతమైతే, ఎంత ఉధృతమైతే చైతన్యం అంతటి ప్రవాహ వేగం అందుకుంటుంది. అది నేటి అతిముఖ్య సామాజిక అవసరం.
మన దశాబ్దాల స్వాతంత్య్రం ఇక్కడి శతాబ్దాల సంకుచితత్వాన్ని జయించలేక పోయింది. అందుకే ఈ దేశంలో డబ్బుతో పాటు కులం, మతం, ప్రాంతం, లింగం ఇంకా రాజకీయాధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటి నుంచి ''కళ'' కూడా బయటపడలేకపోవడం మన చైతన్యానికో అవరోధం. ఇక్కడ చైతన్యమంటే మనిషిని అభ్యుదయానికి నడిపించేది. ఇప్పుడు కళ బందీగా మారి తన చైతన్యాన్ని కోల్పోతోంది. పెట్టుబడి కనుసన్నలలో దాని వికార భావాలను ప్రజలపై రుద్దుతోంది. అశ్లీలాన్నీ, హింసనీ, అవాంఛనీయ ఉద్రేకాల్నీ ప్రభోదిస్తోంది. సరుకుగా మారి మార్కెట్లో వినియోగవస్తువుగా విజృంభిస్తోంది. సరుకు మారకానికే ఉపయోగపడుతుంది తప్ప మార్పుకు దోహదపడదు. ఇక్కడ మార్పంటే అసంఖ్యాకులైన శ్రామిక ప్రజల జీవితాన్ని ఉన్నతీకరించేది. స్వేచ్ఛగా ప్రజాపక్షం వహించే కళ మాత్రమే ఆ సహజమైన సజీవ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అది మాత్రమే ప్రవాహమై జన హృదయాలను పరవశింపజేస్తుంది. చైతన్యమై పరవళ్లు తొక్కుతుంది.
ఆ చైతన్యంపై ఓ వర్గం ద్వేషం ఎప్పుడూ బుసలు కొడుతూనే ఉంటుంది. కాటేయాలనీ, కబళించాలనీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరమవుతుంది!? ఆగితే అది ప్రవాహమెందుకవుతుంది? ప్రవాహమెప్పుడూ ముందుకే సాగుతుంది. అందుకే అది నిరంతర చైతన్య ధారగా వెలుగుతుంది. ఇది ప్రపంచమంతటా రుజువైన చారిత్రక సత్యం.
''నేను హత్యగావించబడ్డాను..
వాళ్లు నా కోసం దుకాణాలు, స్మశానాలు, దేవాలయాలు వెతికారు.
కానీ నన్ను కనుక్కోలేకపోయారు.
ఎన్నటికీ కనుగొనలేరు.
అసలెప్పటికీ కనిపెట్టలేరు'' అంటాడు ఫెడ్రికో గార్షియా లోర్కా. ఆయనొక స్పానిష్ కవి, నాటక రచయిత, దర్శకుడు, ప్రయోక్త. జనరేషన్ ఆఫ్ 27 ఉద్యమ సంఘంలో క్రియాశీల మేధావి. కళ ప్రజల కోసమని భావించి గ్రామ గ్రామానికీ థియేటర్ తీసుకెళ్లి ప్రజల ముందు సాంస్కృతిక చైతన్యానికి తెరకట్టినందుకు... 38ఏండ్ల్ల ప్రాయంలోనే ముష్కర మూకల చేత హత్యకు గురయ్యాడు. చనిపోవడానికి ఏడేండ్ల ముందే పై కవితలో జోస్యం చెప్పాడు. అన్నట్టుగానే ఆయన దేహం ఎవరికీ, ఎక్కడా లభ్యం కాకున్నా, ఆయన కలలు కన్న చైతన్యం మాత్రం కళగా అనంతమై ప్రకాశిస్తూనే ఉంది.
ఆయన మరణించి అర్ధశతాబ్దకి పైగా గడిచిపోయింది. ఈ మధ్యలో ఎన్నో ఆగమనాలు, మరెన్నో నిష్క్రమణలు. అందులో ఈ దేశ రాజధాని నొసట నెత్తుటి తిలకం దిద్దిన సఫ్దర్ హష్మీ ఆగమన నిష్క్రమణాలు మన కాలపు చైతన్య సంతకాలు. కళ ప్రజల కోసమని నమ్మి, ఆ కర్తవ్య దీక్షతో సాగినందుకే ఆ 34ఏండ్ల కళాసైనికుడిపైకి కసాయి కత్తులు కవాతు చేసాయి. అవేమి సాధించాయి? హష్మీ దేహాన్ని రూపుమాపగలిగాయి తప్ప ధ్యేయాన్ని తాకగలిగాయా? కళా చైతన్యధారను ఆపగలిగాయా? ఇప్పుడు హష్మీ ప్రపంచ వ్యాపితమై మండుతున్న భాస్వరం.
30ఏండ్ల తరువాత... ఇప్పటికీ నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, కల్బుర్గీ, గౌరీలంకేశ్ల దాకా ఈ ద్వేషం బుసలు కొడుతూనే ఉన్నది. అయినా చైతన్యం సాగుతున్నదే కానీ ఆగ లేదు కదా..! ప్రక్రియ ఏదైనా ప్రజా కళా, సాహిత్యాల లక్ష్యం ప్రజల తరఫున నిలబడటం, పోరాడటమేననే స్పృహను కొనసాగించే ప్రయత్నాలు ప్రతీ తరంలోనూ ప్రపంచమంతటా చైతన్య ధారలై ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రతీ ప్రయత్నమూ ఒక నవీన ప్రత్యామ్నాయ పోరాట చరిత్రే. నూతన సాంస్కృతిక పునర్వికాసపు అభివ్యక్తే. కానీ ఈ చైతన్యం మన దేశపు 136కోట్ల జనాభాలో అత్యల్ప సంఖ్యాక సమూహానికి మాత్రమే చేరుతోంది. మన సగం జనాభా నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అక్షరాస్యులనబడే వారిలోనూ అత్యధికులు వార్తా పత్రికలు కూడా చదవరు. టీవీలే వారి విజ్ఞాన సర్వస్వం. వీటిలో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అవి ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయో, ప్రజాభ్యుదయానికి ఎంత హానికరంగా ఉన్నాయో చెప్పనవసరం లేదు. ఇక స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు ఓ సరికొత్త విప్లవం. ఇవి భావవ్యాప్తికి అద్భుత సాధనాలు. ఈ సాంకేతిక ప్రగతి సమాజ ప్రగతికి సాధనం కావాలి. కానీ వీటిద్వారా ఈ ముప్పయేండ్లుగా సామ్రాజ్యవాద అమానవీయ సంస్కృతి, వస్తు వినియోగ ఆరాటాలు కూడా పెచ్చరిల్లి మన మెదళ్లలోని విమర్శనాత్మక వైఖరులను, మానవీయ స్పందనలను మోడు బార్చుతున్నాయి. వాటిని చిగురింపజేసే చైతన్యం ఈ అన్ని రంగాలలో నేటి అవసరం. అదే కళా, సాహిత్య రంగాల కర్తవ్యం..