Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అన్యాయమే చట్టమైనప్పుడు దానిని ఎదిరించడమే మన ధ్యేయం కావాలి'' అంటాడు చేగువేరా. నేడు అదే స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. గుజరాత్లో ఆలుగడ్డ రైతులకు జరుగుతున్న అన్యాయం పట్ల సామాజిక మాధ్యమాలలో నిరసన వెల్లువెత్తుతున్నది. ఈ నిరసనలు, ఈ సంఘీభావం ప్రజాక్షేత్రంలోనూ ఉద్యమాల నిర్మాణానికి ఊపిరిలూ దాలి. ఎందుకంటే ఈ సమస్య నేడు గుజరాత్ ఆలు రైతులదే కావొచ్చు. కానీ రేపు మొత్తం భారత రైతులందరిదీ.
బహుళజాతి సంస్థ పెప్సీకో ఎఫ్సీ-5 రకం ఆలుగడ్డను మన దేశంలో ప్రవేశపెట్టి ఈ దుంపలను తాము ''లేస్'' పేరుతో ఉత్పత్తి చేసే చిప్స్ తయారీలో వినియోగిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఈ రకం దుంపలను పండించారని కొందరు రైతులపై కోర్టులో కేసు వేసింది. ఒక్కో రైతు ఎకరాకు రూ.కోటీ ఐదు లక్షలు తమకు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. రైతులంతా రెండూ మూడెకరాల పేదలు. ఈ పేదలు ఒక పెద్ద మల్టీనేషన్ కంపెనీతో తలపడగలరా? కోర్టు లిటిగేషన్లు, విచారణలు, లాయర్ల ఫీజులు తట్టుకోగలరా? ఆ కంపెనీ కోరుతున్నట్టు ఎకరానికి కోటీ ఐదులక్షల పరిహారాన్ని చెల్లించగలరా? అసలు వారి జీవిత కాలనికైనా ఓ ఎకరా భూమిలో అన్ని కోట్ల పంట పండించగలరా? ఎందుకంటే తాము పుట్టిన నేల మీద తాము తరతరాలుగా సాగు చేస్తున్న పంటను పండించడం నేరమెలా అవుతుందో, ఒక విదేశీ కంపెనీ తమ మీద కేసు ఎందుకు పెట్టిందో, దానికి స్వదేశీ కోర్టులూ ప్రభుత్వాలూ ఎందుకు వంతపాడుతు న్నాయో అర్థం కాని ఈ దేశ అన్నదాతలు వాళ్లు.
ఏ దేశానికైనా ఆహార స్వయం సమృద్ధి అనేది తప్పనిసరి. ఈ ఆహార స్వయం సమృద్ధికి విత్తనమే కీలకం. 35 కోట్ల ఎకరాల సువిశాల భూభాగాన్ని సాగు చేస్తున్న ఈ దేశానికి ఆ స్వయం సమృద్ధిని ఎప్పుడో సాధించిపెట్టింది భారత రైతాంగం. ఇందుకు మూలమైన విత్తనాన్ని 2000 సంవత్సరం వరకు మన రైతులే ఉత్పత్తి చేసి వినియోగించి ఈ నేలమీద హరిత విప్లవాన్ని సృష్టించారు. అలాంటి మన విత్తన రంగంలోకి డబ్ల్యూటీవో ఒప్పందం ద్వారా ప్రవేశించా యి ఈ బహుళజాతి కంపెనీలు. ఆ తర్వాత విత్తనోత్పత్తిలో మన శాస్త్రీయ పరిశోధనలను నిలిపేసింది మన ఘనమైన సర్కారు. అప్పటి నుంచీ ఈ బహుళజాతి కంపెనీలది ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది.
పెప్సీ, మోన్శాంటో, బేయర్, కార్గిల్, సింజెట్టావంటి ఈ బడా కంపెనీలు మన విత్తనరంగంలోకి రాకపూర్వం.. మన రైతులు తయారు చేసుకోవడానికీ, పండించడానికీ, నిల్వ చేసుకుని అమ్ముకోవడానికీ ఏ అడ్డంకులూ లేవు. కానీ ఈ విత్తన కంపెనీలు ప్రవేశించి, బలోపేతమై, ప్రభుత్వాలనే శాసించేస్థాయికి ఎగబాకి, వాటి ద్వారా తమకు అనుకూలమైన చట్టాలను చేయించుకుని రైతుల కడుపు కొట్టి కోటానుకోట్లు కొల్లగొట్టుకుపోతున్నాయి. నిజానికి భారతదేశంలో ఏ విత్తనంపై ఎవరికీ ఏ పేటెంటూ లేదు. అయినా మేధోసంపత్తి హక్కుల పేరుతో పెప్సీకో ఈ దుర్మార్గానికి తెగబడుతోంది. జన్యు శాస్త్రాన్ని ఉపయోగిం చి ఏ కంపెనీ ఏ రకం వంగడాన్ని సృష్టించినా దానికి మూలమైన వంగడాన్ని సృష్టించింది మాత్రం రైతులే కదా! మరి వారికుండవా హక్కులు? ఏ రాయల్టీలు చెల్లించి వారి నుంచి మూలాలను సేకరించారు? కేవలం వారు ప్రవేశపెట్టిన రకాన్ని పండించినందుకే ఎకరాకు కోటీ ఐదులక్షల పరిహారమడుగుతున్నారే.. మరి ఈ దేశ సహజ వనరుల్ని పీల్చి పిప్పి చేస్తూ, ఈ నేలను, నీటిని నిర్వీర్యం చేస్తూ వ్యాపారం సాగిస్తున్న ఈ కంపెనీలు ఈ రైతులకు, రాబోయే తరాలకు ఎంత పరిహారమివ్వాలి?
అయినా ఆ టెక్నాలజీ ఆ కంపెనీ సొంతం అనుకుంటే దానిని భద్రంగా దాచుకోవాలి. దాన్ని ఒక్కసారి బహిరంగంగా ప్రకృతిలోకి ప్రవేశపెట్టిన తరువాత ఎవరి ప్రమేయం లేకుండానే, అత్యంత సహజంగానే అది విస్తరిస్తుంది. క్రిమికీటకాలు ఈ చేను మీదివి ఆ చేను మీద, ఆ చేను మీదివి ఈ చేను మీద వాలినప్పుడు అక్కడి పుప్పొడి ఇక్కడ, ఇక్కడి పుప్పొడి అక్కడ రాలి సహజంగానే జన్యు మార్పిడి జరిగిపోతుంది. దానికి రైతుల్ని నిందించడం ఏం న్యాయం? పంట చేతికొచ్చేవరకు ''మేం పండించింది వారి ఆలుగడ్డలని మాకు తెలియదు'' అని రైతులు పేర్కొనడం గమనార్హం.
చట్ట ప్రకారమే బ్రాండెడ్ విత్తనాలుగా అమ్మనంతకాలం ఏ విత్తనాలనైనా సాగు చేసుకోవడానికీ, ఇతరులతో పంచుకోవడానికీ, అమ్ముకోవడానికి కూడా రైతులకు హక్కులున్న సంగతి సదరు కంపెనీ విస్మరిస్తున్నది. '' మీ అనుమతి లేకుండా మీ ఎఫ్సీ-5 రకాన్ని పండించడమే మా నేరమైనప్పుడు.. మా అనుమతి లేకుండా మీ టెక్నాలజీ మా భూమిలోకి రావడం నేరం కాదా?'' అని ప్రశ్నిస్తున్న రైతులకు ఈ కంపెనీలు, ప్రభుత్వాలు ఏం సమాధానమిస్తాయి? వారి భూములకూ, వారి దేశాల ప్రజల ప్రాణాలకూ హానికరమని నిషేధించిన విత్తనాలను ఈ దేశంలో వినియోగిస్తున్నారే.. దీనికి ఏ శిక్ష విధించాలి? వారి దేశాల ప్రభుత్వాలు తమ ప్రజల ప్రాణాలకు ముప్పని గుర్తించి వీటిని నిషేధించినప్పుడు మన ప్రభుత్వాలెలా అనుమతించాయి? మన ప్రజలవి ప్రాణాలు కావా? ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సిగ్గుచేటు.
''గత సంవత్సర కాలంగా వెలుగుచూస్తున్న ఈ అన్యాయాల్ని ఆపండి'' అన్న రైతులు, రైతు సంఘాల అభ్యర్థనలను పట్టించుకోని ప్రభుత్వం, కోర్టులు.. సదరు కంపెనీ అభ్యర్థన మేరకు ఈ కేసులో ఒక ప్రత్యేక కమిషనర్ను ఏర్పాటు చేశాయి. ఈ ఉదాహరణ చాలు మన ఏలికలు ప్రజలవైపో పరాయి కంపెనీలవైపో తేల్చుకోవడానికి. అన్యాయమే చట్టమైనప్పుడు దానిని ఎదిరించడమే కదా న్యాయం..?