Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనెజులా ప్రతిపక్ష నాయకుడు జువాన్ గువాయిడో తన అనుచరులతో కలిసి ప్రజలచేత ఎన్నుకోబడిన నికొలస్ ప్రభుత్వాన్ని మంగళవారంనాడు అమెరికా దన్నుతో కూలదోయాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో 50మంది గాయపడ్డారు. 11మంది అరెస్టు అయ్యారు. అయితే తిరుగుబాటుకు సైన్యం నుంచిగానీ, ప్రజల నుంచిగానీ ఎటువంటి స్పందనా రాలేదు. అలా తిరుగుబాటు విఫలం కావటంతో దానిలో భాగమైన వెనెజులా మరో ప్రతిపక్ష నాయకుడు లియోపోల్డో లోపెజ్ రాజధాని కారకాస్లోని చిలీ రాయబార కార్యాలయంలో తన కుటుంబంతోపాటు తలదాచు కుంటున్నాడు. ఈ తిరుగుబాటులో పాలుపంచుకున్న 25మంది గువాయిడో అనుకూల సైనికులు బ్రెజిల్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. దీనితో అమెరికా మద్దతుతో చేయతలపెట్టిన తిరుగుబాటు విఫలమైందని తెలుస్తోంది.
జనవరి నెలలో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గువాయిడో తనకు తాను ప్రకటించుకున్నాడు. ఆ తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మదురో ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు చేస్తూ వచ్చాడు. అంతిమంగా అమెరికా ప్రోద్బలంతో మంగళవారంనాడు తిరుగుబాటుకు విఫలయత్నం చేసాడు. వెనెజులా సైన్యంగానీ, పోలీసులుగానీ, ప్రజలుగానీ తిరుగుబాటుకు అనుకూలంగా స్పందించలేదు. వాలంటాడ్ పాపులర్ పార్టీని లోపెజ్ స్థాపించాడు. జాతీయ శాసనసభలో ఈ పార్టీకి గువాయిడో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ శాసనసభకు 2015లో ఎన్నికలు జరిగాయి. 2017లో రాజ్యాంగ శాసన సభకు ఎన్నికలు జరగటంతో ఈ శాసనసభ రద్దయినట్టేనని మడురో ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికా ప్రభుత్వ ప్రోద్బలంతో వెనెజులాలో గత మంగళవారంనాడు జరిగిన ఘటన 1954లో గువాతెమాలాలో, 1964లో బ్రెజిల్లో, 1973లో చిలీలో, 1979-1990 సంవత్సరాల మధ్య కాలంలో నికరాగ్వాలో, 1979-1992 సంవత్సరాల మధ్యకాలంలో ఎల్ సాల్వెడార్ 1983లో గ్రెనడాలో, 1994లో హైతీలో జరిగిన సంఘటనలను తలపిస్తున్నాయి. వేరేమాటల్లో చెప్పాలంటే 2019లో అమెరికా ప్రభుత్వం లాటిన్, దక్షిణ అమెరికా దేశాలపట్ల వ్యవహరించే విధానం గతంలో తాను అవలంబించిన హింసాత్మక సామ్రాజ్యవాద పంథాను తలపిస్తోంది. అమెరికా ఈ దేశాలను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఆయా దేశాలలో తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పెత్తనం సాగిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ వెనెజులా ప్రతిపక్ష నాయకుడు జువాన్ గువాయిడోతో తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ దేశంలోని అపార చమురు వనరులపై పట్టును సాధించాలనేది అమెరికా వ్యూహంగా ఉన్నది.
ఇప్పుడు సమస్య వెనెజులా ప్రజల ముందు, సైన్యం ముందు ఉంది. వెనెజులా ప్రజలు, సైన్యం విడదీయరాని బంధంలో ఉన్నారు. మదురో ప్రభుత్వం కొనసాగటం వెనెజులాకే కాకుండా ఆ ప్రాంతం మొత్తానికి కూడా అవసరం. అయితే అమెరికా ప్రేరేపిత సైనిక తిరుగుబాట్లను ప్రజలు, సైన్యం ఎంతవరకు ఎదిరించి నిలబడగలుగుతారు, ఎంతవరకు ప్రతిఘటించగలుతారు అనేదాని పైనే వెనెజులా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ దేశంలో జరుగుతున్న ఘటనలకు ప్రజా సంక్షేమానికి సంబంధం లేదని చెప్పేవాళ్ళకు ఆ దేశంలో పుట్టిన ప్రముఖ విప్లవకారుడు సైమన్ డిబోయర్ మాటలను గుర్తుచేయాలి. ఆయన ఇలా అన్నాడు: 'ప్రజల వినాశనానికి వారి అజ్ఞానమే ప్రమాదకరమైన ఆయుధమౌతుంది.'
వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఆ దేశంలోని సహజవనరైన చమురే కారణం. ఆ దేశంలో గల అపార చమురు నిల్వలపై తిరిగి ఆధిపత్యం సాధించటానికి దేశీయ దళారీ పాలక వర్గాలతో కుమ్మక్కయి అమెరికా, దాని ఐరోపా మిత్ర దేశాల చమురు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే ఈ సంక్షోభం. 1999లో భూసంస్కరణ, సంపద పునఃపంపిణీ, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాదంపై పోరువంటి ప్రజారంజక కార్యక్రమం ఆధారంగా హుగో చావెజ్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూలదోయటానికి అమెరికా చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. ప్రపంచంలో ఉన్న సైనిక శక్తినంతా ఉపయోగించినా ఒక సామ్రాజ్యాన్ని అధికారంలో కొనసాగించటం సాధ్యంకాదనే చరిత్ర చెబుతున్న పాఠాలను ఇంకా అమెరికా పాలక వర్గాలు నేర్వలేదు. పర్షియన్, గ్రీక్, రోమన్, ఫ్రెంచ్, బ్రిటిష్ సామ్రాజ్యాలు అలానే కాలగర్భంలో కలిసిపోయాయి. దీనికి గల మౌలిక కారణమేమంటే అణచివేత ప్రతిఘటనకు ప్రాణం పోస్తుంది. అణచివేతపై ప్రతిఘటన అనేక యుద్ధ విమాన వాహక నౌకలకంటే శక్తివంతమైన సత్యాన్ని మోసుకు వస్తుంది.
హుగో చావెజ్ చెప్పినట్టుగా అమెరికా సామ్రాజ్యవాదంతో భూగోళానికే పెనుప్రమాదం ఏర్పడింది. ఈ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటించటానికి యావత్ ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు పూనుకోవాలి. అటువంటి ప్రతిఘటనకు నేడు వెనెజులా మొదటి వరుసలో ఉంది. అన్యాయం ఎక్కడ జరిగినా అది న్యాయానికి విఘాతంగా మారుతుందనే స్పృహతో వెనెజులా ప్రజలకు సంఘీబావం తెలుపడమే నేడు ప్రజాస్వామికవాదులందరి ముందున్న కర్తవ్యం.