Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో అనేక ఉగ్రవాద మారణకాండలకు కారకుడైన జైష్- ఏ- మహ్మద్ నేత మసూద్ అజర్ను బుధవారం ఐక్యరాజ్య సమతి భద్రతామండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పదేండ్ల పాటు భారత్ పట్టువిడవక సాగించిన దౌత్య ప్రయత్నాల ఫలితమిది. భారత్ నుంచి కాశ్మీర్ను వేరు చేయాలనే లక్ష్యంతో పాకిస్థాన్ కేంద్రంగా యువకులను మానవ బాంబులుగా మార్చి మరణహౌమం సృష్టిస్తున్న మసూద్ మన దేశానికి ఒక పీడలా దాపురించాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండతో చెలరేగిపోతున్న మసూద్ను పాక్ ప్రోత్సహిస్తూ వస్తున్నది. పాక్ గడ్డపై యథేచ్ఛగా సంచరిస్తూ భారత్లో సునాయాసంగా ఉగ్రవాద చర్యలకు అజర్ పాల్పడుతున్నాడు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే.. 1) ఆ వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన సంస్థ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంట్లు ప్రపంచం మొత్తం మీద స్తబించబడతాయి. 2) ఆయుధాల సరఫరా నిలిచిపోతుంది 3) ఏ దేశమూ అతడిని తన భూభాగంపై అడుగుపెట్టనీయదు.. ఆమేరకు ఉపయోగం ఉంటుంది. అంతమాత్రాన ఉగ్రవాదం సమసిపోతుందా? పోదుగాక పోదు. ఇందుకు ఒసామా బిన్ లాడెన్ అంతమే పెద్ద ఉదాహరణ. లాడెన్ అంతకోసం వేల కోట్లు ఖర్చుచేసిన అమెరికా అతన్ని వేటాడివేటాడి చంపింది. ఆ తరువాత ఏమయ్యింది? లాడెన్కు మించిన నరహంతక ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చారు. యావత్ ప్రపంచాన్ని నేడు నెత్తుటేరుల్లో ముంచేందుకు బరితెగిస్తున్నారు.
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినంత మాత్రాన కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదు. అక్కడ ఉగ్రవాదం సమసిపోదు. పాలకుల నిర్ణయాల ద్వారా ప్రజల్లో చెలరేగిన అసంతృప్తే ఇలాంటి మూకల మనుగడకు అవకాశం ఇస్తోంది. ప్రజలనుంచి సహకారం లేకుంటే మసూద్ లాంటి ఉగ్రవాద మూక నీళ్లలోంచి బయటపడ్డ చేపలా నిర్రనీల్గి చస్తుంది. కాశ్మీర్ ప్రజలల్లో అశాంతి ఉన్నదన్నది నిజం. పాలకులపై అనుమానం, అపనమ్మకం ఉందన్నది నిజం. తాము గౌరవప్రదమెన, స్వేచ్ఛాయుతమైన బతుకు బతకలేకపోతున్నామని, భవిష్యత్కు భద్రత కోల్పోతున్నామనీ భావిస్తున్నది నిజం. ఈ భావనలోంచే యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితమవుతున్నది. ఈ నేపథ్యంలో గాయపడిన ప్రజలను అక్కున చేర్చుకుని, భరోసా కల్పించి వారి విశ్వాసం పొందాల్సిన పాలకులు ఆ పని చేయకపోగా పుండుమీద కారం చల్లుతున్నారు. పరమత విద్వేషాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలచుకుని రాజ్యమేలుతున్న సంఫ్ు పరివార్ శక్తులు కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని రంకెలేస్తున్నారు. కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజలను అభద్రతాభావంలో ముంచారు. కాశ్మీర్లో ఎలాంటి ఆర్థిక పురోభివృద్ధి, ఉద్యోగ కల్పన లేకుండా చేసి యువతను దిక్కుతోచని స్థితికి నెట్టారు. మసూద్లాంటి ఉగ్రవాదుల మనుగడకు మూలం ఇక్కడుంది.
కాగా, పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా మోడీని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే అమెరికా ఈ ఎన్నికల సమయంలో మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు పావులు కదిపిందన్న అభిప్రాయమూ ఉంది. ప్రకటన అనంతరం మోడీ ప్రగల్బాలు కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూర్చుతున్నాయి. ఐరాస ప్రకటన వెలువడిన తక్షణం మోడీ జైపూర్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ 'మా అభీష్టం మేరకు సిద్ధించిన విజయమిది' అని ప్రకటించారు. అలాగే 'దేశానికి ఎవరి నుంచి ఎటువంటి ప్రమాదం ఏర్పడినా ఇళ్లలోకి చొరబడి వారిని ఏరిపారేస్తాం' అని ఘీంకరించారు. నిజానికి, ఐరాస తీర్మానంలో భారత్ పట్టుబట్టిన పుల్వామా దాడి ప్రస్తావనే లేదు. పాక్ 'పుల్వామా ఉగ్రదాడితో ముడిపెట్టే అంశాలన్నిటినీ ప్రతిపాదన నుంచి తొలగించాకే ఆంక్షలను మేం అంగీకరించాం' అని ప్రకటించింది.
అమెరికా మసూద్ విషయంలో భారత్కు అనుకూలంగా అంత పట్టుపట్టేందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. చవకగా పెట్రోలియం సరఫరా చేస్తున్న ఇరాన్ నుంచి దిగుమతులు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. మన దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా ఆంక్షలకు తలొగ్గింది. ఈ ఆంక్షల కారణంగా డీజిల్, పెట్రోల్ రేట్లు త్వరలో అమాంతం పెరిగి దేశ ప్రజల నడ్డి విరచనున్నాయి. పెట్టుబడిదారీ పెద్దన్న అమెరికా తనకు అర్థిక ప్రయోజనం లేకుండా మనలాంటి దేశానికి ఊరకే సాయం చేస్తుందా!?
గోరంతలు కొండంతలుగా ప్రచారంచేసి ప్రజలను వంచించడంలో మోడీకి మించినవారు లేరు. ఇప్పుడు మసూద్ విషయమూ అంతే. ఐరాస ప్రకటన తన ఘనతేననీ, ఆ ప్రకటనతో దేశంలో ఉగ్రవాదం నిర్రనీల్గి చస్తుందనీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మరీ ఊదరగొడుతున్నారు మోడీ. మోడీ ఉల్లంఘనలకు ఎన్నికల సంఘం వంతపాడుతూ ఉంది. ప్రజల విచక్షణ మాత్రమే ఈ దేశాన్ని సకల సుడిగుండాలనుంచి దరికి చేర్చగలుగుతుంది.