Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రచారం ముగింపునకు చేరేకొద్దీ ప్రధాని స్థాయిని దిగజార్చుతూ మాట్లాడటం మోడీకి పరిపాటిగా మారింది. పరిస్థితులు కలవరపెడుతున్నాయో, గెలుపు సులువు కాదన్న వాస్తవం నైరాశ్యానికి గురిచేస్తుందో తెలియదుగానీ... పూటకో మాట చెపుతూ పచ్చి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రధాని. ''దేశాన్ని ముక్కలు చేయాలన్న దురాలోచన ఉన్నవారే ఆంధ్రప్రదేశ్ను విడదీశారు'' అన్న ఆయన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ పూర్తయి, ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన తరువాత... ఆయన బీహార్ ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం!
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో బీజేపీ కూడా ప్రధాన భాగస్వామి అన్న విషయం ఆయన మరిచారా? లేక తెలిసీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా? నిన్నటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల శాసనసభ, లోక్సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న మోడీ... ఎక్కడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు సరికదా కనీస ప్రస్తావన కూడా తేలేదు. పైగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే రాష్ట్ర విభజనకు తాము మద్దతిచ్చామనీ, తమ పట్టుదలవల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమయిందనీ బల్లగుద్ది చెప్పారు. అంతకు ముందే ''ఒక ఓటు రెండు రాష్ట్రాలు'' అన్న బీజేపీ కాకినాడ తీర్మానం ఉండనే ఉన్నది. ''రాష్ట్ర ఏర్పాటులో పెద్దమ్మనే (సోనియాగాంధీ) కాదు, ఈ చిన్నమ్మనూ గుర్తుపెట్టుకోండి'' అన్న బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ మాటలూ మనమింకా మరువనేలేదు. ఇప్పుడేమో ఇది దుర్మార్గం, దురాలోచన అంటున్నారు మోడీ..! ఇంతలోనే ఆయన అంత హటాత్తుగా ఎందుకు మాట మారుస్తున్నట్టు?
ఇప్పుడిక మోడీ సమాధానం చెప్పాల్సన ప్రశ్నలనేకం తలెత్తడం అత్యంత సహజం. ప్రధాని చెపుతున్నట్టు ఇది నిజంగా దురాలోచనాపరుల చర్యే అయితే... మరి బీజేపీ ఎందుకు సమర్థించినట్టు? ఆనాడు పార్లమెంటు ఉభయ సభల్లోని బలాబలాల రీత్యా బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్కు సాధ్యమే కాదు. అయినా దేశాన్ని ముక్కలు చేయాలన్న ఈ దురాలోచనకు వీరు ఏ ఆలోచనతో మద్దతిచ్చినట్టు? పోనీ విభజన ప్రక్రియలో అన్యాయం జరిగిందని భావిస్తే.. అప్పుడు వీరు ప్రశ్నించిదేమిటీ? సూచించిన పరిష్కారాలేమిటీ? కాంగ్రెస్ కాదన్నదేమిటి? కేవలం రాజకీయాల కోసం ఇరు పార్టీలు పోటీపడి బిల్లును ఆమోదించాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు.. ఈ విభజనలోని మంచిచెడ్డలలో ఇరుపార్టీలదీ సమాన భాగస్వామ్యం. అంతెందుకు.. నిన్నటిదాకా తెలంగాణ సాకారం ఘనత మాదంటే మాదేనంటూ కాంగ్రెస్ను మించి ఢంకా బజాయించిన మోడీ, తీరా తెలుగురాష్ట్రాల పోలింగ్ ముగిసిన తరువాత దురాలోచనతోనే ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేశారనడం అవకాశవాదం కాదా? పనిలో పనిగా తాము మాత్రమే వాజ్పేయి హయాంలో చక్కగా మూడు రాష్ట్రాలను ముక్కలు చేశాం అని గొప్పలు పోయారు. యూపీ, ఎంపీ, బీహార్ల నుంచి ఉత్తరాంచల్, చత్తీస్గడ్, జార్ఖండ్లను ఏ సమస్యా లేకుండా విడదీసామని తనకు తానే జబ్బులు చరుచుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసేటప్పుడు ఆ అనుభవం ఏమయ్యింది? కండ్లు మూసుకుపోయాయా? లేక కావాలనే చోద్యం చూశారా? జరగాల్సిందంతా జరిగిపోయిన తరువాత తగుదునమ్మా అంటూ కొత్తగా ఈ సన్నాయి నొక్కులు దేనికి?
అంతేకాదు.. ఇప్పుడు తెలుగు ప్రజలు ఒకరి కండ్లల్లోకి మరొకరు చూసుకోలేని పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు ప్రధాని..! ఇది నిజమా..! నిజానికి విభజనకు ముందయినా, తరువాతయినా తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలూ ఎప్పుడూ లేవు. అప్పుడయినా, ఇప్పుడయినా అవి ఉన్నది కేవలం రాజకీయ నాయకుల మధ్యే..! కాబట్టి, రాజకీయ పార్టీల మధ్య ఉన్న ఆ విభేదాలనూ వివాదాలనూ ప్రధానమంత్రి నేడు ప్రాంతాలకూ, ప్రజలకూ ఆపాదించడమంటే అది ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే. ఒక ప్రధాని స్థాయి వ్యక్తికి ఇది తగునా..?
అయితే రెండు రాష్ట్రాల మధ్య పాలనాపరమైన సమస్యలున్న మాట నిజం. నదీజలాల పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో, ఇంకా విభజన నేపథ్యంలో ఏర్పడిన అపరిష్కృత అంశాలకు సంబంధించిన విభేదాలనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన, అందుకవసరమైన విభజన చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్రానిదే. మరి ఈ విభజనానంతర కాలంలో ఐదేండ్లూ అధికారంలో ఉన్న మోడీ ఆ పని చేశారా? కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య పలు అపరిష్కృత సమస్యలుంటే, అవి అనేక విభేదాలకూ, వివాదాలకూ దారి తీస్తుంటే... వాటి పరిష్కారానికి కనీస ప్రయత్నం చేయకపోగా, వాటిని ప్రజల మధ్య వైషమ్యాలుగా మార్చ చూడటం ఏ ఆలోచన? దురాలోచన కాదా..?! అయినా మోడీకి ఉన్నట్టుండి ఇప్పుడీ ఆలోచన ఎందుకొచ్చినట్టు? ఎన్నికల తంతుకు అంతిమ ఘడియలు సమీపించేకొద్దీ... తన మిత్రపక్షాలతో కలుపుకున్నా మోడీకి సాధారణ మెజారిటీ కష్టమేనన్న అంచనాలు వెలువడుతున్న సమయంలో... ఆయన తెలుగు రాష్ట్రాలలో కొత్త పొత్తులకు ఎత్తుగడలేస్తున్నారా..? అయితే మాత్రం అన్నదమ్ములవంటి తెలుగు ప్రజల మధ్య లేని వైషమ్యాలు చిత్రించాలా? తను కుర్చీ ఎక్కడం కోసం రెండు రాష్ట్రాల ప్రజలను ఏమార్చాలా? అధికారం కోసం మరీ ఇంత అవకాశవాదమా..? భారతదేశ చరిత్రలో ప్రధాని స్థానం గౌరవాన్ని అధమస్థాయికి దిగజార్చిన ఘనత మోడీకే దక్కుతుంది.