Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో దళితుల బతుకు రోజురోజుకూ దినదిన గండంగా మారుతోంది. రెచ్చిపోతున్న కుల దురహంకారులు హత్యలు, లైంగిక దాడులు, గ్రామ బహిష్కరణలు, సజీవ దహనాలకు తెగిస్తున్నారు. నచ్చిన వాడిని మనువాడినందుకు, నచ్చిన బట్టలు తొడిగినందుకు, పెండ్లి ఊరేగింపు జరుపుకున్నందుకు దళితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో మెహుల్ అనే దళితుడు పెండ్లి బట్టలు వేసుకుని గుర్రంపై ఊరేగినందుకు అతని కులాన్నంతటినీ గ్రామ బహిష్కరణకు గురిచేశారు కుల దురహంకారులు. గుజరాత్లోని మహేసాణా జిల్లా కాది తాలూకా హ్లౌర్ గ్రామంలో మే 7న ఈ దారుణం జరిగింది. ఆ కులం వారితో ఎవరు మాట్లాడినా 5వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు. అలాగే, గ్రామానికి చెందిన బావిలోనుంచి నీరు తీసుకువెళ్లకూడదంటూ దళితులపై నిషేధం విధించారు.
మహారాష్ట్ర ఆహ్మద్నగర్ జిల్లా నిఘోజ్ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్నందుకుగాను భార్యాభర్తలైన రుక్మిణి, మంగేశ్లను యువతి బంధువులు సజీవ దహనం చేశారు. మే 5న చికిత్స పొందుతూ రుక్మిణి మరణించింది. తీవ్ర గాయాలతో మంగేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమను తన తండ్రీ అతని బంధువులే తగులబెట్టారని రుక్మిణి మరణ వాగ్మూలంలో స్పష్టం చేసింది. రాజస్థాన్లోని అల్వార్లో గత నెలలో ఓ దళిత మహిళను ఆమె భర్త ఎదుటే ఐదుగురు కామాంధులు లైంగిక దాడి చేసిన సంఘటన ఆలశ్యంగా వెలుగు చూసింది. అనంతరం ఆ భార్యాభర్తల వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును తీసుకుని, భర్తను తీవ్రంగా కొట్టి ఉడాయించారు దుండగులు. అంతటితో ఆగకుండా ఈ ఘోర ఉదంతాన్ని వీడియో తీసి, ఆ వీడియో బయటకు రాకుండా ఉండాలంటే తమకు డబ్బు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ దారుణంపై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్కు వెళ్లగా తాము ఎన్నికల డ్యూటీలో బిజీగా ఉన్నామని, కేసును దర్యాప్తు చేసేందుకు తమవద్ద తగినంతమంది సిబ్బంది లేరని పోలీసులు శెలవిచ్చారు. తమిళనాడు తిరువారూర్ జిల్లా మన్నార్గుడిలోని తిరువందుతులై గ్రామంలో కొల్లామలై (45) అనే దళితుడిపై ముగ్గురు అగ్రకుల దురహంకారులు అమానుషానికి వొడిగట్టారు. తమ మాట వినడం లేదన్న అగ్రహంతో కొల్లామలై చేత మానవ వ్యర్థాలను తినిపించేందుకు వొత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా అతని ముఖంపై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. దేశ వ్యాప్తంగా ఒక్క నెలరోజుల వ్యవధిలో జరిగిన ఈ దారుణ సంఘటనలు భీతిగొల్పుతున్నాయి. ఈ ఆధునిక యుగంలో కేవలం దళిత కులంలో పుట్టారన్న కారణంగా సాటి మనుషులను ఇంత అమానుషంగా వేధించడం, హింసించడం, హతమార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక దళితుడిని వివాహమాడిందని ఆగ్రహించి సొంత బిడ్డను బాహాటంగా తగలబెట్టేస్తున్నారంటే ఈ దారుణాలను ఎలా జీర్ణించుకోవాలి? మానవత్వంతో స్పందించి దోషులను శిక్షించేందుకు వాయువేగంతో కదలాల్సిన పోలీసులు కుల కట్టుబాట్లను ఛేదించిన బాధితులే ముద్దాయిలన్నట్టుగా ప్రవర్తించడాన్ని ఎలా మన్నించాలి? అత్యధిక కేసుల్లో పోలీసులు నిందితుల పక్షమే వహించి బాధితులకు అన్యాయం చేస్తున్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకునేలా సహకరిస్తున్నారు. చట్టాల భయంలేని నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. కులం కల్పించిన సామాజిక హౌదాను అడ్డంపెట్టుకుని పరువు, ప్రతిష్టల పేరుతో సాటి మనుషుల ప్రాణాలు తీసేందుకైనా సిద్ధపడుతున్నారు. తమలోని మానవ విలువలను మంటగలుపుకుని తాము ప్రాణం పోసిన బిడ్డల ప్రాణాలనే హరిస్తున్నారు.
కులాధారిత నేరాలకు ఒక సామాజిక అంగీకారాన్ని కల్పిస్తున్నాయి విభజన రాజకీయాలు. మనుషుల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసి 'మీరు వేరు, మేము వేరు మీరూ మేమూ కలవం. అలా కలవక పోవడమే ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడుకునేందుకు మేమేమైనా చేస్తాం. ఎన్ని నెత్తురుటేరులైనా పారిస్తాం. ఎందరి ప్రాణాలైనా తీస్తాం' అని ప్రకటించుకుంటున్న శక్తులు పాలకులుగా మారిన తరువాత మంచీ చెడులకు అర్థాలు మారిపోతున్నాయి. విలువల అర్థాలు తలకిందులవుతున్నాయి. వ్యక్తులకు పట్టిన పీడ కాదు ఇది. వ్యవస్థకు పట్టిన చీడ. వ్యవస్థీకృతమైన ఈ నేరగుణాన్ని సమిష్టిగా మాత్రమే ఎదిరించగలం. మనుషుల మధ్య మానవ విలువలను ప్రోది చేయడం ద్వారా మాత్రమే ఈ మారణకాండను ఆపగలం. ఎవరు ఏ కులంలో పుడతారన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ, కుల దురభిమానం లేకుండా బతకడం అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మనుషులంతా సమానమే అన్న భావంతో జీవించడం గొప్ప అనుభూతి. ఆ ప్రయత్నం చేద్దాం. మానవ జీవితానికి ఎలాంటి మేలూ చేయని, పచ్చటి బతుకులను బుగ్గిపాలు చేసే కుల దురహంకార భావజాలానికి పాతరేద్దాం. కుల దురహంకార దాడులను, వాటికి అవకాశం ఇస్తున్న పాలకవర్గాలనూ ఎదిరిద్దాం. మనిషితనాన్నీ, మంచి తనాన్నీ తుదకంటా కాపాడి ముందు తరాలకు బహుమతిగా అందిద్దాం.