Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అనగనగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన...''
వేమన నుంచి జాలువారిన ఈ పద్యం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉంటుంది. పద్య సారాంశం తెలియని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! బాల్యంలో నేర్చుకున్న ఈ పద్యాన్ని నిద్రలో లేపి అడిగినా టపీమని వల్లెవేయవచ్చు. అతిసామాన్యులకు కూడా ఇట్టే అర్థమయ్యే భాష ప్రయోగించారు కవి. ఇక భావంలోకి తొంగిచూస్తే.. రాగాన్ని పాడగా పాడగా అది వినడానికి ఇంపుగా మారుతుంది. తినగా తినగా వేపాకు సైతం తీపిదనం పంచుతుంది. అలాగే సాధన చేస్తూ ఉంటేనే పనులను సులువుగా చేయవచ్చు. అంటే సాధన ద్వారా సాధించలేని పనిలేదంటూ ఇక్కడ కవి నొక్కివక్కాణించారు.
జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ, ప్రస్తుత స్థితి నుంచి ఒక మెట్టు పైకెక్కాలనీ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనీ సహజంగానే కోరికలుంటాయి. అనుకున్నవన్నీ నెరవేరితే ఆనందానికి అవధులుండవు. సంతోషానికి ఎల్లలుండవు. కానీ, వేగవంతమైన జీవన ప్రవాహంలో రోజులు నెలలుగా మారుతాయి. నెలలు సంవత్సరాలవుతాయి. మార్పు మాత్రం పెద్దగా కనిపించదు. దీనికి కారణం ఏమిటి? ఉన్నత శిఖరాలకు చేరుకోలేమా? నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేమా? అంటే కచ్చితంగా చేరగలం. అందుకు సాధన అత్యంత కీలకం. సాధనలేని లక్ష్యం ఆకాశంలోని చుక్కలను అందుకోవాలన్న ఆరాటం వంటిది.
సంగీతం నేర్చుకుంటున్నామనుకోండి. స్వరాలతో మొదలుపెట్టి క్రమంగా సాధనలో లీనమవ్వాలి. ప్రతి స్వరం కచ్చితంగా గొంతులో పలుకుతున్నదో లేదో క్షణక్షణం పరికించాలి. ఆ స్వరాలు ఒకసారి పలుకుతాయి. మరొకసారి పలకవు. రెండూ పలికితే ఆ తర్వాతి రెండో స్వరం సరిగా పలకదు. పోనీ మూడో స్వరం సరిగ్గా పలికితే ముందు సరిగ్గా పలికిన స్వరాల్లో అపస్వరాలు వినిపిస్తాయి. పాడే అయిదు నిమిషాల పాటలో కొన్నివేల స్వరాలను పలకాలి. వాటన్నింటినీ సరిగ్గా పాడేందుకు ఎన్నిసార్లు సాధన చెయ్యాలో ఊహించండి! అలా పాడగా పాడగా నిజానికి కొన్ని వందలసార్లు తప్పుల్లేకుండా పాడగలిగే స్థితి వస్తుంది. సంగీత వాద్యాల విషయం కూడా అంతే. చదువు, క్రీడలు, ఉద్యోగం వంటి అంశాల్లోనూ సాధనే ముఖ్యభూమిక పోషిస్తుంది. ఉదాహరణకు.. వందో, రెండొందలో, మూడొందలో మీటర్ల పరుగు పందెంలో నెగ్గాలనుకునేవారు అప్పటికప్పుడు పోటీలో నిలబడితే ప్రయోజనం ఉండదు. పైగా పోటీలో భంగపాటూ తప్పదు. పోటీకి ముందే పరుగెత్తడం సాధన చెయ్యాలి. నిరంతరం వ్యాయామం చేసి శరీరాన్ని విల్లులా మలుచుకోవాలి. అలసట లేని బలాన్ని సమకూర్చుకునే విధంగా కసరత్తు కొనసాగించాలి. పోటీ వంద మీటర్లే అయినా అంతకు మునుపే కొన్ని వందల కిలోమీటర్లు పరుగెత్తి సాధన చేయగలగాలి. అప్పుడే విజయంవైపు వెళ్లగలం.
ఒక మేధావి తయారుకావడానికి బయట నుంచి కలిగిన ప్రేరణ ఒక శాతం పనిచేస్తే.. అతడు చెమటోడ్చి చేసిన కఠోర పరిశ్రమ తొంబై తొమ్మిది శాతం పనిచేస్తుందని థామస్ అల్వా ఎడిషన్ అంటారు. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై:.. న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగా:' అన్న సంస్కృత శ్లోకం సారాంశం కూడా ఇదే. ఉద్యమించడం, మెళకువలతో ఒళ్లు దాచుకోకుండా ప్రయత్నించడంతోనే పనులు సాధ్యమవుతాయి. అడవికి మృగరాజే అయినా నోరు తెరుచుకుని నిద్రపోయే సింహం నోటిలోకి జింకలు వచ్చి దూరవు కదా..! ఎప్పుడూ ఏవో ప్రయోగాలతో గడుపుతూ సిద్ధాంతాలు రాసుకుంటూ ఉండే ఐజాక్ న్యూటన్ ఒకవైపు బాల్యంలో పరీక్షల కోసం సిద్ధమవుతూనే, మిగిలిన సమయాన్నంతా తన పరిశోధనలు, ప్రయోగాలతో గడిపేవారు. వేళకు భోజనం, నిద్ర అనే ధ్యాసలేకుండా నెలల పాటు శ్రమించి పరిభ్రమించే వస్తువుల చలనాలు అనే వ్యాసాన్ని రాశారు. పద్దెనిమిది నెలల పాటు అహోరాత్రులు సాగించి వైజ్ఞానిక చరిత్రలోనే తలమానికమైన 'ప్రిన్సిపియా మేథమాటికా' అనే గ్రంథాన్ని పరిచయం చేశారు. చివరి శ్వాస వరకూ సాధనలు, పరిశోధనల్లో మునిగితేలి అనుకున్నది సాధించారు. ప్రపంచం లోనే మహోన్నత శాస్త్రజ్ఞుడిగా, తత్వవేత్తగా నిలిచిపోయారు.
ఒక్కోసారి గమ్యాన్ని సాధించే క్రమంలో ప్రయత్నం ఫలించకపోవచ్చు. కానీ చేసిన సాధనా ప్రయత్నమూ మనిషి విలువ పెంచుతుందని అంటారు ఐన్స్టీన్. లక్ష్యం పెట్టుకోవడం సులువైన పని. అయినా దానిపై స్పష్టత ఉండాలి. చివరిదాకా అందుకోసం పరితపించాలి. రేపూమాపూ అంటూ వాయిదా వేసుకుంటూ పోతే కడకు చెప్పేమాట వినేవారుండరు. అందుకే ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎన్ని అవాంతరాలూ అడ్డంకులూ ఎదురైనా దానిపట్ల ప్రయత్నం మానకూడదు. సాధన మరవకూడదు. మహాభారత గాథలో విలువిద్యలో శిక్షణ ఇవ్వడానికి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తిరస్కరిస్తాడు. అయినప్పటికీ ద్రోణుడినే తన గురువుగా భావించి మట్టి ప్రతిమ ఎదుట సాధన చేసి ధనుర్విద్యలో ఏకలవ్యుడు రాటుదేలుతాడు. నిరంతర సాధనతోనే ఆ విద్య సాధ్యమైంది. అందుకని నిత్య సాధనతోనే విజయశిఖరాలు చేరువవుతాయి.