Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయాలు ఎందుకోసం? అధికారం కోసం. అధికారం ఎందుకోసం? తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకోసం. కాబట్టి పార్టీల విధానాలను వాటి వర్గ స్వభావాలు నిర్ణయిస్తాయి. వర్గ స్వభావాలలో సామీప్యత ఉన్న పార్టీలు ఎన్నటికీ ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాలేవు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఇదే నిరూపించింది. తన పెట్టుబడిదారీ అనుకూల విధానాలను వొదులుకోలేని కాంగ్రెస్, ఆ విధానాలను రక్షించుకోవడం కోసం తన విజయాన్నే బలిపెట్టింది. రాజకీయంగా తనకు ప్రధాన శత్రువైన బీజేపీతో అమీతుమీ తలపడకుండా, బీజేపీ వ్యతిరేక శక్తుల అపజయానికి చేయాల్సిందంతా చేసి అంతిమంగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ దేశంలో పెట్టుబడిదారులకు ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టుల ఉనికిని పెట్టుబడిదారులు సహించరు. కమ్యూనిస్టులకూ తమకూ మధ్య ఉన్నది సిద్ధాంత శత్రుత్వమైతే, ప్రాంతీయ పార్టీలు పెట్టుబడిదారులకూ మధ్య ఉన్నది పాలనాపరమైన అసౌకర్యం. ప్రాంతీయ పార్టీలకు తమకున్న అననుకూలతలు, అవసరాలు, వైరుధ్యాల కారణంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేవు. ప్రాంతీయ పార్టీల కలయికతో ఏర్పడిన కేంద్రప్రభుత్వాల మనుగడ సంక్షోభమే ఇందుకు సాక్ష్యం. దేశంలో సుస్థిర ప్రభుత్వం లేకుండా ఆ దేశాన్ని తాము స్థిరంగా దోచుకుతినడం అసాధ్యం కాబట్టి సిద్ధాంత పరంగా తమకు పెద్ద వ్యతిరేకం కాకున్నా కమ్యూనిస్టులతోపాటు ప్రాంతీయ పార్టీల అపజయాన్ని కోరుకున్న పెట్టుబడిదారీ శక్తులు ఆ మేరకు కాంగ్రెస్ను ప్రభావితం చేయగలిగాయి. ఆ ప్రభావం నేటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
బీజేపీ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను కాంగ్రెస్ ప్రజల ముందు పెట్టలేకపోయింది. అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులకు దేశ సంపదను మోడీ దోచి పెడుతున్నారని విమర్శలు గుప్పించినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించలేదు. ఇందుకు కారణం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రయోజనం పొందింది ఇదే పెట్టుబడిదారులు కావడం! అలాగే, మోడీ నిరంకుశ పోకడలను కాంగ్రెస్ ఎంతగా ఎండగట్టినప్పటికీ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపుకాదని ప్రజలు నమ్మారు. పాలకులలో అవినీతి, బంధుప్రీతి, అధికారుల దాష్టీకం, ఆశ్రిత పక్షపాతాల విషయంలో దొందూదొందేనని జనం భావించారు. తన పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలతో తలపడింది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్, కేరళలు ఇందుకు నిదర్శనాలు. ఉత్తరప్రదేశ్లో తన బలమెంతో కాంగ్రెస్కు తెలుసు. అక్కడ బీజేపీని నిలువరించగలిగిన శక్తి ఎస్పీ, బీఎస్పీలకే ఉంది. బీజేపీ ఓటమి అన్న ఉమ్మడి లక్ష్యంతో ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమయ్యాయి. ఎస్పీ, బీఎస్పీలతో కాంగ్రెస్ కలిసిఉంటే యూపీలో పెద్ద ఊపు వచ్చేది. ఆ మేరకు బీజేపీని నిలువరించేందుకు అవకాశం ఉండేది. పొత్తుకు అంగీకరించకుండా కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగడంతో బీజేపీకి జరగాల్సిన నష్టం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు జరిగింది. 40 సీట్లకు మించి రావన్న అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 62 స్థానాలు గెలుచుకుంది. సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు అమేథీలో ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్కు కించిత్తు పశ్చాత్తాపం లేదు. ఇందుకు కారణం దాని వర్గ దృక్ఫథం.
కేరళలో బీజేపీ ప్రధాన పోటీదారు కాదు. అక్కడ మొదటి నుంచీ కాంగ్రెస్- కమ్యూనిస్టు కూటముల మధ్యే ఎన్నికల యుద్ధం జరుగుతోంది. కమ్యూనిస్టుల కూటమి అధిక స్థానాలు సాధించినా ఆ బలం ఎలాగూ బీజేపీకి సహకరించదు కాబట్టి కాంగ్రెస్కు వచ్చిన నష్టం లేదు. అయినా కేరళపై కాంగ్రెస్ కేంద్రీకరించింది. అక్కడ బీజేపీకి బద్ధశత్రువులైన కమ్యూనిస్టులను ఓడించేందుకు సర్వ శక్తులూ వొడ్డింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ఇదే పరిస్ధితి.
బీజేపీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశంలో తనకు బీజేపీ ప్రధాన పోటీదారుగా ఉన్న 191 స్థానాలపై కేంద్రీకరించాలి. ఈ 191 స్థానాలలో 161 స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలు. ఇక్కడ కేంద్రీకరించాల్సింది. అందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా పూర్తిగా సహకరించేవి. అక్కడ బీజేపీని ఏ మేరకు ఓడించగలిగినా ఆ మేరకు కాంగ్రెస్తోపాటు, బీజేపీ వ్యతిరేక శక్తులూ శక్తివంతమయ్యేవి. బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించడంలో ఈ పరిణామం కీలకమయ్యేది. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. సరికదా, తన దృష్టినంతా బీజేపీ వ్యతిరేక పార్టీలు బలంగా ఉన్న స్థానాలపైనే కేంద్రీకరించింది. ఆ మేరకు బీజేపీకి తోడ్పడి, తమ పెట్టుబడిదారీ వర్గాన్ని సంతృప్తిపరచింది. పెట్టుబడిదారులకు పార్టీలతో పనిలేదు. ఏ పార్టీ అధికారానికి చేరువలో ఉంటే ఆ పార్టీకే సహకరిస్తాయి ఆ శక్తులు. అందుకోసం ఇతర పార్టీలపైనా వొత్తిడి తెస్తాయి. ప్రస్తుతం అధికారంలోకి రాగలిగిన అవకాశం ఉన్న పార్టీకి పరోక్షంగా సహకరించకుంటే ఇక ఎన్నటికీ మా సహకారం ఉండదని బెదిరిస్తాయి. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పెట్టుబడిదారీ అనుకూల దృక్ఫథమే దాని ఎన్నికల ఆచరణకు, బీజేపీ విజయానికీ మూలం. బీజేపీకి ప్రత్యామ్నాయ పాలన అందించడం కాంగ్రెస్కు ఎన్నటికీ అసాధ్యం. ఆ ప్రత్యామ్నాయాన్ని అందించడం ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం. ఎంతటి కష్టమైనా, ఎంత కాలమైనా. అందుకు సిద్ధమవుదాం.