Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ'' అన్నారో సినీకవి.
స్వరాజ్యం సిద్ధించి డెబ్భైరెండేండ్లు కావొస్తున్నా... ప్రభుత్వాలు మారడమే తప్ప పరిస్థితులు మారని ఈ దేశానికి అక్షరాలా అద్దం పడుతున్నాయి ఈ కవి వాక్కులు. నిన్నటి మోడీ పాలనా ఇందుకు భిన్నమేమీ కాదు. అయినా నేడు ఊహించని విజయం సాధించారు కమలనాథులు. తిరిగి ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మోడీ. ఈ సందర్భంగా 'ఇక సురాజ్య సాధనే మన ధ్యేయం కావాలి' అని తన సహచర నేతలకు సందేశమిచ్చారాయన. 'దేశంలో పేదరికాన్ని పారదోలుదాం, మైనారిటీల మనసులనూ గెలుచుకుందాం, అహంకారాన్ని వీడి అందరి విశ్వాసాన్నీ పొందుదాం' అంటూ తమ ఎంపీలకు హితోపదేశం చేశారు. ప్రజాస్వామ్యానికి భారతదేశమే అతిపెద్ద ఆశాకిరణమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి శిరస్సు వంచి నమస్కరించారు. ఎంతటి నాటకీయ పరిణామం..! ఎంత ఆశ్చర్యకర దృశ్యం..!
మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశించేటప్పుడు కూడా గడపకు నమస్కరించే అడుగు లోపలకు పెట్టిన మోడీ.. ఆ తరువాత ఐదేండ్లు ఏనాడూ పార్లమెంటరీ విలువలను ఖాతరు చేయలేదు. ఇక ఆయన పాలనాతీరు, నిన్నటి ఎన్నికల ప్రచార హౌరు చూశాక.. రానున్న ఐదేండ్ల పాలన పట్ల అనేక అనుమానాలు, భయాందోళనలు నెలకొనివున్న వేళ.. ఇప్పుడీ మోడీ మాటలు ఎలా నమ్మగలం? 2014లో కూడా దేశానికి అనేక వాగ్దానాలు చేశారు మోడీ. కానీ అవేవీ నిలబెట్టుకోలేదు. నల్లకుబేరులు తమ బొక్కసాల్లో దాచుకున్న సొమ్మునంతా కక్కించి... ప్రతి భారతీయుడి పద్దులో పదిహేను లక్షలు జమచేస్తానన్నారు. వారి బొక్కసాల్లోంచి ఒక్క రూపాయీ జనం ఖాతాల్లోకి చేరలేదు కానీ, ఇప్పుడా నల్లధనమంతా తెల్లధనంగా మారిపోయింది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తానన్నారు. కొత్త ఉద్యోగాల ఊసే లేకపోగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోయి.. గత నలభై అయిదేండ్లలో ఎన్నడూ లేనంత గరిష్టానికి పెరిగిపోయింది నిరుద్యోగ తీవ్రత. అవినీతి రహిత భారత నిర్మాణమే తన లక్ష్యమన్నారు. వేలకోట్ల అవినీతి తిమింగలాలు నేడు దేశం వెలుపలా, లోపలా దర్జా వెలగబెడుతున్నాయి. వరుస కుంభకోణాలు పరువు తీశాయి. తన విపరీత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలయిన పారిశ్రామిక, వ్యవసాయరంగాలు దివాళాతీశాయి. విద్యా, వైద్యరంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెచ్చరిల్లిన అసహనాలతో ప్రజల సామాజిక జీవితమూ సంక్షోభాన్నే అనుభవించింది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు, ఇప్పుడీ మోడీ 'సురాజ్యసాధన'ను ఎలా నమ్మగలం?
గడిచిన ఐదేండ్లూ అడుగడుగునా ప్రజాస్వామ్య ధిక్కరణలూ రాజ్యాంగ ఉల్లంఘనల మీదుగానే ప్రయాణం సాగించిన ప్రధాని... ఇప్పుడు భారత రాజ్యాంగానికి తలవంచి ప్రణమిల్లుతున్న దృశ్యం చూడటానికి బాగానే ఉందిగానీ, నమ్మడానికే కష్టంగా ఉంది! అయినా ప్రజలు ఏ నమ్మకంతో ఆయనకు ఈ విజయాన్ని కట్టబెట్టినట్టు? ఈ ప్రశ్నకు ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త అమర్త్యసేన్ విశ్లేషణ చక్కటి సమాధానం చెపుతోంది. ''ప్రజలు ప్రధాని పాలన చూసి ఓటేయలేదు'' అంటున్నారీ నోబెల్ గ్రహీత. ఎందుకంటే.. మోడీ తన ఐదేండ్ల పాలనలో సాధించిందేమిటో చెప్పి ఓటడగలేదు. పైగా అవి ఈ ఎన్నికల్లో అసలు చర్చకే రాకుండా తెలివిగా ఎజెండాను దారి మళ్లించారు. కేవలం భావోద్వేగాలను రేకెత్తించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అమర్త్యసేన్ ఈ విషయాలన్నిటినీ 'న్యూయార్క్ టైమ్స్'కు రాసిన తన వ్యాసంలో వివరంగా విశ్లేషించారు. ఎన్నికలకు ముందు సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను సాగదీసిన వైనం, వాటితో లేని యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రచారానికి వాడుకున్న తీరు దీనిని నిరూపిస్తున్నది. నిజమే కదా..! ఓ రకంగా నిజాన్ని బలిపెట్టి మరీ ఈ విజయాన్ని చేజిక్కించుకున్నారనడం అతిశయోక్తి కాదేమో..! జాతీయ అతివాదం, విద్వేష రాజకీయాలను ఆధారం చేసుకుని తీవ్రస్థాయిలో భావోద్వేగాలను రగిలించిన కమలదళం ప్రచార పర్వాన్ని కండ్లారా చూశాం. విధానాలు, పాలనాపరమైన విజయాల ప్రాతిపదికగా కాకుండా 'జాతీయ అతివాదం'తో మోడీ ఈ విజయం సాధించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భోపాల్లో సాధ్వి ప్రగ్యాసింగ్ విజయం ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుచుని ఉంటే గెలిచింది 'జాతీయ అతివాదం' కాదని ఎలా నమ్మగలం?
ప్రజల దృష్టిని ఏమార్చి గెలుపును సొంతం చేసుకున్న మోడీ.. గత 'అవినీతి రహిత భారతం' అన్న నినాదం అబద్ధమై హేళన చేస్తుండగానే నేడు 'సురాజ్య సాధన' అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఇదైనా సాకారం అవుతుందా? అహంకారాన్ని వీడుదామంటున్న మోడీ, గత పాలనలో ప్రధాన మంత్రి కార్యాలయమే సర్వాంతర్యామిగా, మోడీ ఆదేశాలే విధానాలుగా చలామణీ అయిన పద్ధతికి స్వస్తి చెపుతారా? దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగడం ఎంతమాత్రం క్షంతవ్యం కాదంటున్నారు మోడీ. అంతేనా, ఈ 21వ శతాబ్దాన్ని భారత్ శతాబ్దంగా మార్చేద్దాం అంటున్నారు. సంతోషమే.. కానీ, భారత్ అంటేనే 'భిన్నత్వంలో ఏకత్వం'. భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం. వైవిధ్య భరితమైన, సుసంపన్నమైన ఈ సహజీవన సూత్రాన్ని తోసిపుచ్చి, ఈ జీవనాడిని దెబ్బతీసి ఏ సురాజ్యాన్నీ సాధించలేమన్న సత్యాన్ని కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం గుర్తించాలి. అంతవరకూ ఇది స్వరాజ్యమవుతుందేమో కానీ సురాజ్యం మాత్రం కాజాలదు...