Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రజావ్యతిరేకతకు అద్దం పట్టాయి. ఏపీలో ప్రజల అసంతృప్తి, ఆగ్రహం నేరుగానూ, తెలంగాణలో కొంత భిన్నంగా వ్యక్తమైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఓటర్ల తీర్పు అన్ని రాజకీయపార్టీలకు ఒక హెచ్చరిక. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఈసారీ ప్రధానంగా ఎన్నికలబరిలో నిలిచాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఇటు సీఎం కేసీఆర్ తనయ కవిత పరాజయం పాలవడం ప్రత్యేకత. అక్కడ చంద్రబాబుకు తన 40ఏండ్ల రాజకీయ అనుభవం పనికిరాకపోగా, ఇక్కడ కేసీఆర్ కారు.. సారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదం ప్రజలకు పట్టకుండాపోయింది. అందుకే 16సీట్లు కాస్తా, తొమ్మిదికి పడిపోయాయి. ఏడు స్థానాల్లో ఓడిపోయింది. చేవెళ్ల, జహిరాబాద్ స్థానాల్లో విజయం సాధించినా చావుతప్పి కన్నులొట్టపోయినంత పనైంది. ఇందుకు పార్టీలో అసంతృప్తులు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం కారణమైతే, పార్టీ అధినేత ఏకపక్ష ధోరణి కూడా మరొకటని ఆ పార్టీనేతలే చెబుతున్న బహిరంగ సత్యం. డిసెంబరు నుంచీ తెలంగాణలో పరిపాలన కుదేలైంది. సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. పాలకులకు అవసరమైనవి తప్ప ప్రజలకు కావాల్సిన పనులేవీ జరగలేదు.
అసెంబ్లీ, లోక్సభ ఫలితాలకు స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. ఆ తేడానే ప్రజల్లో వ్యతిరేకత అనే సంగతి మరిచిపోరాదు. అధికార టీఆర్ఎస్ పట్ల ఇది తేటతెల్లమైంది. శాసనసభ ఎన్నిల్లో 88సీట్లల్లో గెలిచిన టీఆర్ఎస్, పార్లమెంటుకు వచ్చేసరికి 34నియోజకవర్గాల్లో వెనుకబడింది. భారీగా ఆయా స్థానాల్లో ఓట్లు తగ్గాయి. పైనుంచీ దిగువస్థాయి నేతల మధ్య సమన్వయం లోపం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న తరతమ తేడాలూ ఇందుకు కారణమయ్యాయి. అంతెందుకు మంత్రులు సొంత నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ లోక్సభ అభ్యర్థులకు భారీ మెజారిటీ తెచ్చిపెట్టలేకపోయారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలలో కూడా మెజారీటీ తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో టీఆర్ఎస్కు 89,009 ఓట్లు మెజారిటీ కాగా, ఇప్పుడు లోక్సభలో వచ్చిన ఓట్లు 5713 మెజారిటీ మాత్రమే. ప్రజాగ్రహం తీర్పు అర్థం చేసుకోవచ్చు.
ఓట్ల సంగతి అలా ఉంటే, మొత్తం టీఆర్ఎస్ నాయకత్వంపై ఇప్పటికే నిరుద్యోగులు, యువత, విద్యావంతులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఆయా సందర్భాల్లో వ్యక్తమవుతూనే ఉన్నది. ఇందుకు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరోక్షంగా నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థుల పరాజయమే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టినా, కేసీఆర్ రాజకీయంగా వేసిన తప్పటడుగులు లోక్సభ ఎన్నికల్లో మూల్యం చెల్లంచుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని అధికారికంగా ఫిరాయింపులను ప్రొత్సహించిన నేపథ్యంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 11మందిని గులాబీ గూటిలో చేర్చుకున్నారు. తద్వారా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో చేర్చుకునే మంత్రాంగం చివరిదశకు వచ్చిన తరుణంలో తాజా ఫలితాలు ముఖ్యమంత్రికీ, ఆ పార్టీకీ అశనిపాతమైంది. మరో పెద్ద కారణం కూడా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీశ్రావును పార్టీలో పక్కనబెట్టారనే ప్రచారం విస్త్రృతంగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా పొలిమేరలు దాటకపోవడమే ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఆ తర్వాత పార్టీకి, కేసీఆర్కు కుడిభుజంగా వ్యవహరించిన ఆయన్ను పూర్తిగా విస్మరించడం, క్యాబినెట్లోకి తీసుకోకపోవడం చర్చకు దారితీసింది. తత్ఫలితంగా ఓట్లు, సీట్లపై ఆ మేరకు ప్రభావం పడిందని ఆ పార్టీ సీనియర్ నేతలే సెలవిస్తున్నారు.
పార్టీలో ఏకపక్ష ధోరణికి ప్రత్యక్ష తార్కాణమే ఈ ఫలితాలు అని వ్యాఖ్యానిస్తున్నవారూ ఉన్నారు. మంత్రులకు స్వేచ్ఛ లేకపోవడం, కనీసంగా కూడా వారు తమ అధికారాలను వినియోగించి ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా మేలు చేసే అవకాశాన్ని సైతం అధినేత ఇవ్వడం లేదనే ప్రచారం ఇప్పటికే ఆ నోటా, ఈ నోటా సాగుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో హరీశ్రావును పాతాళానికి తొక్కేసారనీ, ఇక తమ పరిస్థితి ఏంటనే ఆవేదన, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల్లో నెలకొన్నట్టు ఇటు సచివాలయం, అటు తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకపడ్డ కాంగ్రెస్కు లోక్సభ ఫలితాలు ఓ స్వాంతనే. అదే సందర్భంగా అనూహ్యంగా బీజేపీ నాలుగు సీట్లు గెలవడం గమనార్హం. వామపక్ష అభ్యర్థులు మెరుగైన ఓట్ల దిశగా అడుగులేశారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే నానుడి అందరికి తెలిసిందే, ఇప్పుడు ఆ సామెత టీఆర్ఎస్కు, దానికి అధినేతకు సరిపోతుందని విశ్లేషకులు భావన. ఏకపక్ష పరిపాలన, ఇతర వ్వవహారాలు చేస్తే తాము సహించబోమని ఫలితాల ద్వారా చెప్పకనే చెప్పారు ప్రజలు. తామేది చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుందనే నమ్మకానికి ప్రజలు తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వారా చెల్లుచీటీ పాడటం గమనించాల్సిన అంశం. ఈ ఫలితాల నుంచి ఆత్మపరిశీలన చేసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే!