Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ పట్టాభిషేకం జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపూ ముగిసింది. ఇప్పుడిక రాబోయే ఐదేండ్లలో మోడీ పాలన ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. మోడీ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందా? నియంతపోకడలు పోతుందా? ఇందిరకు మించిన నియంత పోకడలను మనం నరేంద్ర మోడీలో చూడబోతున్నామా? తన గత ఐదేండ్ల పాలనకు ప్రజలు అంగీకారం తెలిపారని, కాబట్టే తమకు మళ్లీ అధికారం కట్టబెట్టారనీ నరేంద్ర మోడీ నమ్ముతున్న నేపథ్యంలో, గత పాలనలోని ప్రజావ్యతిరేక నిర్ణయాల పదును పెరగడమే తప్ప తగ్గుతుందని ఆశించలేము. విద్వేష రాజకీయాల వికృత రూపాన్నే తప్ప జాతి సామరస్యాన్ని కాంక్షించలేము. ఆర్థిక లూటీని, ఆథ్యాత్మిక దోపిడీని, మానవహక్కుల హననాన్నీ తప్ప ప్రజల ధన మాన ప్రాణాల రక్షణకు హామీ పొందలేము.
గత ఐదు సంవత్సరాల మోడీ పాలనలో ఒక్క ప్రజోపయోగ పథకాన్ని చూపమంటే చూపడం కష్టం. సరికదా, ఉన్న బతుకును ఉన్నట్టు ఉండనీయకుండా అతలాకుతలం చేసిన నిర్ణయాలే అధికం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలే ఇందుకు నిదర్శనం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల దెబ్బ ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ తాకింది. పెద్దనోట్ల రద్దు తాము చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బుపై తమకు అజమాయిషీ లేకుండా చేస్తే, పన్నుల భారాన్ని పెంచి ఉన్న ఆదరువును ఊడ్చిపెట్టేసింది జీఎస్టీ. జీఎస్టీ పుణ్యమా అని లక్షలాది మంది చిన్న వ్యాపారస్తులు చితికి పోయారు. మరో వైపు దేశంలో మునుపెన్నడూ లేనంతగా విద్వేష భావనలు ముసురుకున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో దేశంలోని దాదాపు నలభై శాతం మంది ప్రజలు నరకం అనుభవించారు. మతం పేరుతో మనుషుల విభజన, కులం పేరుతో అణచివేత నిరాటంకంగా సాగింది. ఆర్థిక దోపిడీ, ఆథ్యాత్మిక అణచివేతలతో అల్లాడిపోయారు జనం. అయినా మోడీ గెలిచిపోయారు. ఇందుకు కారణం తమ పాలనలోని ప్రతికూల అంశాలు ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారకుండా మోడీ, షా ద్వయం నిరోధించగలగడం. ఐదు సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న ప్రతికూలాంశాలు, వైఫల్యాలు ఎన్నికల నాటికి ఎన్నికల ఎజెండాకు ఎక్కకుండా పోయాయి. భౌతిక సమస్యల స్థానాన్ని భావోద్వేగాలు ఆక్రమించాయి. ఈ దేశం ప్రమాదంలో ఉందని, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడే దమ్ము ఒక్క మోడీకే ఉన్నదనీ కమలనాథులు చేసిన ప్రచారం మిన్నంటింది. ఊహాజనిత ప్రమాదాల ఉచ్చులో పడ్డ జనాలు కమలనాథులు సృష్టించిన శత్రువుపై కత్తిదూసి, కమలానికి జైకొట్టారు. భావోద్వేగాలతో ప్రజలను బోల్తా కొట్టించడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తమ అధికారానికి అవసరమైన ఓట్లను రాబట్టుకోగలిగారు. తమ అనుయాయులు సైతం ఊహించనన్ని సీట్లు సాధించ గలిగారు. అనుభవాలను ఎన్నికల గణాంకాలు జయించిన సందర్భమిది. బాధితుల కంటితడిని విజయ దరహాసం వెక్కిరించిన తరుణమిది. మళ్లీ మోడీ రావాలని కోరుకున్న వారికన్నా రాకూడదని భావించిన వారే అధికం. అయినా ఎన్నికల విజయానికి మెజారిటీ ప్రజల అభిప్రాయం అనవసరం. పోలైన ఓట్లలో అధికం ఏ గుర్తు మీద నొక్కబడ్డాయన్నదే ముఖ్యం. అలా మెజారిటీ ఓట్ల సాక్షిగా మరోసారి ప్రధాని పీఠమెక్కేశారు మోడీ.
మోడీకి అధికారంతో రాబోవు రోజుల్లో దేశం మరింత ప్రమాదంలోకి నెట్టబడే అవకాశం ఉంది. తమ ప్రజా వ్యతిరేక, శాస్త్రీయ వ్యతిరేక, స్వేచ్ఛారహిత, మూఢత్వ పాలనకు ప్రజల అంగీకారం ఉన్నదని ప్రకటించుకునే ప్రమాదం ఉంది. తమ ఐదు సంవత్సరాల పాలన చూసి ప్రజలు తిరిగి తమకు అధికారం కట్టబెట్టారని ప్రకటించి ప్రజా వ్యతిరేక చర్యలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. 'మోడీ మళ్లీ గెలిస్తే ఈ దేశంలో ఇవే చివరి ఎన్నికలు' అన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పలుకులు నిజమయ్యే వీలుంది. దేశ ద్రోహులు దేశ భక్తులుగా, దేశ భక్తులు దేశ ద్రోహులుగా చిత్రీకరించబడి, జాతిపిత హంతకులు సైతం దేశ భక్తులుగా చరిత్రకెక్కే అవకాశముంది.
నాకెవరు అడ్డు అని నిర్రనీల్గుతున్న నరేంద్ర మోడీ.. చరిత్ర చూసిన ఏ నియంతకన్నా తాను తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. పిడికెడు మంది తమ అనుకూల పెట్టుబడి దారులకు వేల కోట్లు దోచిపెడుతూ కోట్లాది ప్రజల కడుపులు కొడుతున్నారు. ఆకలి తీరేమార్గంగా ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. వారి మాయలో పడకుండా ప్రశ్నించేందుకు సిద్ధమైన వారిని పరమ కిరాతకంగా మట్టుబెడుతున్నారు. ప్రజాపక్షం వహించే మేధావులకు ఈ దేశపు జైళ్లు శాశ్వత చిరునామాలుగా మారిపోతున్నాయి. బీజేపీ సిద్ధాంతానికి బద్ధ శత్రువులైన కమ్యూనిస్టులు ఎన్నికల రంగంలో వెనుకబడటంతో, ఇక తమకు తిరుగే లేదని విర్రవీగుతున్నారు. అబద్ధం, అసత్యం, నయవంచన, నిర్బంధం, దోపిడీ, అణచివేతల సమ్మేళనంగా సాగిపోతున్నది పాలన. మహా ప్రమాదం ముంగిట మోకరిల్లి ఉన్నది దేశం. ఈ స్థితిలో ప్రశ్నించే గళాలు పెరగాలి. వాటి స్వరాలూ పెరగాలి. ప్రజానుకూల శక్తుల సమైక్య ప్రతిఘటన మాత్రమే నియంతలను నిలువరించి ప్రజా వ్యతిరేక పాలనకు పాతరేయగలదు.