Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడు తొక్కిపెట్టిన లెక్కలే ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే పాత ప్రభుత్వం నిలువరించిన నిజం నిగ్గుతేలింది. దేశంలో నిరుద్యోగ తీవ్రత నింగికి ఎగబాకుతుంటే, స్థూల జాతీయోత్పత్తి నేలకు దిగజారుతోంది. రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నరేంద్ర మోడీ సర్కారుకు ఎదురైన రెండు అతిపెద్ద సవాళ్ళివి. ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయో లేదో గణాంక వ్యవస్థలు వెల్లడించిన నివేదికలు మోడీ అభివృద్ధిలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. నిరుద్యోగిత రేటు నలభై అయిదేండ్ల గరిష్టానికి పెరిగిపోగా జీడీపీ వృద్ధిరేటు ఐదేండ్ల కనిష్టానికి తరిగిపోయింది.
నిజానికిది కొత్త విషయేమీ కాదు. 'ఎన్ఎస్ఎస్ఓ' (నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్) అంచనాను ఉటంకిస్తూ గత జనవరిలోనే 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ఈ వాస్తవాలను ప్రచురించింది. అప్పట్లో దీనిని అబద్ధం అని కొట్టిపారేసిన మోడీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో ఆ స్టాటిస్టిక్స్ అధికారికంగా బయటకు రాకుండా 'ఎన్ఎస్ఎస్ఓ' నివేదికను బలవంతంగా అడ్డుకుంది. ఇందుకు నిరసనగా నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ సభ్యులు రాజీనామాలకు చేసిన ఉదంతాలను కూడా మనం చూసి ఉన్నాం. కానీ, ఎన్నికల్లో నష్టం చేస్తుందనే భయంతో మోడీ పాత ప్రభుత్వం ఏ నివేదికనైతే ఉద్దేశ్యపూర్వకంగా తొక్కిపెట్టిందో.. అదే మోడీ కొత్త ప్రభుత్వంలోని కేంద్ర గణాంకశాఖ ఆ నివేదిక నూటికి నూరుపాళ్లు నిజమని తాజాగా ధృవీకరించింది. దీంతో కన్నంలో దొరికిన దొంగల తీరయింది కమలనాథుల పరిస్థితి. దేశంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 6.1శాతానికి చేరుకుంది. 1972-73 నుంచి 2017-18 వరకు ఈ నలభై అయిదేండ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం.
ఇక జీడీపీ తిరోగమనం మరో విషాదం. ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) నాల్గవ త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధిరేటు 5.8శాతమే నమోదైంది. ఇది ఐదేండ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కొత్త సర్కార్ కొలువుదీరిన తొలిరోజే కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించిన ఈ తాజా వివరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద షాక్! మరోవైపు దేశ మౌలికరంగంలో కూడా వృద్ధి తగ్గుముఖం పట్టింది. బొగ్గు, ఉక్కు, సిమెంట్, ముడిచమురు, సహజవాయువు, విద్యుత్, ఫెర్టిలైజర్స్, రిఫైనరీ ఉత్పత్తులతో కూడిన మౌలికరంగంలో... గతేడాది ఏప్రిల్ నాటికి 4.7శాతం వృద్ధిరేటు నమోదైంది. అది ఈ ఏప్రిల్ నాటికి 2.6శాతానికి పడిపోయింది. ఆర్థికవేత్తల మాటను పెడచెవినపెట్టి, అసంఖ్యాకులైన ప్రజల జీవితాలను పణంగాపెట్టి మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల పర్యవసానమిది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా దెబ్బతినడంతో పారిశ్రామికోత్పత్తి మందగించడమే గాక, పెట్టుబడులపైనా అది తీవ్ర ప్రభావం చూపింది. పెట్టుబడులొస్తేనే పారిశ్రామికరంగం పుంజు కుంటుంది. ఉద్యోగాల కల్పనా పెరుగుతుంది. కానీ మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఇందుకు అవరోధంగా నిలిచాయి. ఫలితంగా ఈ పెరిగిన నిరుద్యోగిత, తరిగిన జీడీపీ గడిచిన ఐదేండ్ల మోడీ పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనంగా మిగిలాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాననీ, దానిని అవినీతి, రెడ్టేప్ జాడ్యాల నుంచి కాపాడుతాననీ, ఉద్యోగావకాశాలు విరివిగా కల్పిస్తాననీ, విద్యా-వైద్యరంగాలను ప్రగతి పథంలో నడిపిస్తాననీ, అభివృద్ధిలో ప్రతి పౌరునికి న్యాయబద్ధమైన వాటా కల్పిస్తాననీ వాగ్దానం చేసి అధికారంలోకొచ్చారు మోడీ. కానీ విచిత్రంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో వాటి ప్రస్తావనే చేయలేదాయన! అందుకు కారణం వాటిని నెరవేర్చడంలో వైఫల్యమేనని ఇప్పుడీ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఈ భౌతిక వాస్తవాలను మరుగున పడేసి, భావోద్వేగాల మాటున ఢిల్లీ పీఠాన్ని గెలుచుకున్నారు మోడీ. ప్రజల జీవిత సమస్యలు పక్కకుపోయి... పుల్వామా దాడులు, బాలాకోట్ ఉదంతాలు, జైశ్రీరామ్ నినాదాలు, జాతీయ పౌర చట్టం వంటి వివాదాలే ఆయన ప్రచారాస్త్రాలయ్యాయి. కానీ ఏ నిజాలనైతే దాచిపెట్టి గద్దెనెక్కారో ఇప్పుడవే నిజాలను ఎదుర్కోక తప్పని స్థితి మోడీ పరివారానిది!
ఈ సవాళ్లను ఈ సర్కారు ఎలా ఎదుర్కొంటుంది అన్న చర్చ నడుస్తుండగానే నిటి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మునుముందు ప్రభుత్వరంగానికి చెందిన 42కు పైగా కంపెనీలను ప్రయివేటీక రించడమో లేదా మూసివేయడమో చేయనున్నట్టు వెల్లడించారాయన. దీనికి ఎదురయ్యే ప్రతిఘటనలను అణచివేయడానికా అన్నట్టు పనిలో పనిగా ప్రస్తుత కార్మికచట్టాలనూ మార్చివేయనున్నామని సెలవిచ్చారు. ప్రభుత్వరంగానికి మంగళం పాడి.. ప్రయివేటు రంగాన్ని అందలం ఎక్కించే ఈ చర్యలన్నీ ప్రజా జీవితాన్నీ, దేశ ఆర్థిక వ్యవస్థనూ మరింత సంక్షోభంలోకే నెడుతాయనడంలో సందేహం లేదు. రాబోయేది మరింత గడ్డుకాలమనడానికి ఇవన్నీ సంకేతాలు..! సంఘటిత పోరాటాలే ఇందుకు పరిష్కారాలు...