Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో దేవుడు దళితుడ్ని బలికోరుతాడన్నది మరోసారి రుజువయ్యింది. ఈ మతంలో దేవుడు కొందరికే సొంతమని ఇంకోసారి నిరూపణయింది. అవును! ఈ దేశంలో 'అంటరానివాడికి' దేవుడు అంటరానివాడని అక్షరాలా అనుభవంలోకి వచ్చింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ జిల్లా ధనేరియా అనే గ్రామంలో ఈ నెల 1న దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దళిత బాలుడిని అగ్రవర్ణస్తులు దారుణంగా హింసించారు. పశువులను కట్టేసే తాడులతో ఆ బాలుడ్ని కట్టేసి కర్రలతో చితకబాదారు. 'ఇక తానెప్పుడూ దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించనని, దయతో తనను వదిలి వేయాలనీ' ఆ యువకుడు ఎంతగా ప్రాధేయపడుతున్నా వినిపించుకోని కిరాతకులు మరింతగా కొట్టి చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు. కనీసం పోలీసు కేసు పెట్టేందుకు కూడా ఆ బాలుడు సాహసించలేకపోయాడు. రెండు రోజుల తరువాత అతని సమీపబంధువు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ బాలుడ్ని దారుణంగా హింసించిన వారిలో కొందరు కాషాయ దుస్తులు వేసుకుని ఉండడంతో దాడి చేసినవారు సంఘ్ పరివార్కు చెందిన వారుగా భావిస్తున్నారు. వారికున్న రాజకీయ అండదండలతో ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ అమానుషాన్ని కప్పిపుచ్చుకునేందుకు నేరస్తులు కొత్త పన్నాగం పన్నారు. బాధితుడు ఒక చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతనిపై కేసుపెట్టారు. తక్షణం స్పందించిన పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హౌంకు తరలించి, బాధితుడిని జైలుకు పంపడం ద్వారా తమ ప్రభుభక్తి చాటుకున్నారు.
హిందూమతంలో కుల వివక్ష కొత్తదేమీ కాదు. వేల ఏండ్లుగా ఆ వివక్ష అణగారినకులాలను, ముఖ్యంగా దళితులను కాల్చుకుతింటూనే ఉంది. అయితే సంఘ్ పరివార్ శక్తులు అధికారంలోకి వచ్చిన తరువాత అది మరింతగా పెచ్చరిల్లింది. అసలు సంఘ్ పరివార్ సిద్ధాంతంలోనే పెద్ద వైరుధ్యముంది. హిందూ మతస్తులు మతం మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు సంఘీయులు. అలా మతం మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చేందుకు 'ఘర్వాపసీ' అంటూ పెద్ద కార్యక్రమాన్నే చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఘర్వాపసీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న సంఘ్ పరివార్ శక్తులు.. అస్సలు అణగారిన కులస్తులు, ముఖ్యంగా దళితులు హిందూమతాన్ని ఎందుకు వీడుతున్నారన్న విషయం గురించి మాత్రం ఆలోచించరు. హిందూ మతంలోని వివక్షను, అవమానాన్ని, అణచివేతనూ భరించలేకే కదా బాధితులు మతం మారుతున్నది? హిందూమతంలో తమకు గౌరవముంటే, తమ ఆత్మగౌరవం దెబ్బతినకుంటే, అణచివేత లేకుంటే, కుల బేధాలు లేకుండా హిందువులందరికీ ఒకే రకమైన విలువ ఉంటే ఎవరైనా పరమతాలనెందుకు ఆశ్రయిస్తారు? ఇప్పుడు బాధితుడైన ఆ బాలుడు తనకు ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా దేవాలయ ప్రవేశానికి ఎందుకు సిద్ధపడ్డాడు? హిందూ మతంపై, హిందూ దేవుళ్ళపై తనకు విశ్వాసం లేకుంటే తన బాధలను, కోర్కెలను వారికి విన్నవించుకుని ఉపశమనం పొందాలని ఎందుకు ఉవ్విళ్ళూరుతాడు? మరి అంతటి విశ్వాసుడిని వెలివేస్తున్నదెవరు? హింసిస్తున్నదెవరు? వారిని ఏ పేరుతో పిలవాలి? తమ మత విలువలను పాటించే వారనాలా? మానవ రూపంలో ఉన్న మృగాలనాలా? కుల దురహంకారులనాలా? మత విశ్వాసులనాలా?
మతాన్ని తమ ఆధిపత్యానికి ఒక వేదికగా, సాధనంగా భావిస్తాయి సంఘ్ పరివార్ శక్తులు. కాబట్టి, వారు మత మార్పిడులను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంతే తీవ్రంగా కుల వ్యవస్థను సమర్ధిస్తారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ తమకు వారసత్వంగా అప్పగించిన ఆధిపత్యాన్ని అనుభవించాలని పరితపిస్తారు. అది దారుణమని, అన్యాయమనీ, నేరమనీ వారు భావించరు. సాటి మనుషుల ఎడల నిర్దాక్షిణ్యంగా, నేరపూరితంగా ప్రవర్తించడం తమకు తరాలుగా సంక్రమించిన హక్కని నమ్ముతారు. అందుకే ఈ హైటెక్ యుగంలోనూ ఈ దేశంలో ప్రతిరోజూ దళితులపై ఇన్ని హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలూ జరుగుతున్నాయి. ఇప్పుడు కమలనాథుల పాలనలో ఈ వ్యక్తిగత హింస వ్యవస్థీకృతమైంది. అంతకు మునుపు కొందరు అగ్రకుల దురహంకారులు మూర్ఖంగానో, ఆవేశంతోనో దళితులపై సాగించే దుర్మార్గాలు ఇప్పుడు చాలా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ వ్యవస్థీకృత నేరస్తులకు రాజ్యం అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎలాంటి జంకూబొంకూ లేకుండా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. చేసిన నేరానికి శిక్షలు లేకుండా బలాదూర్గా బయట పడగలుగుతున్నారు. ఈ వ్యవస్థీకృత నేరాలను వ్యక్తులుగా ఎదుర్కోలేము. మానవీయ విలువలున్న మనుషులంతా ఏకమై ప్రతిఘటిస్తే తప్ప ఈ దారుణాలను ఆపలేము.