Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరు ఏం తినాలో, ఎవరు ఏం కట్టుకోవాలో, ఎవరు ఏ భాషలో మాట్లాడాలో రాజ్యం చెప్పబోవడం అభ్యంతరకరం. ఇది వ్యక్తిస్వేచ్ఛకీ, వికాసానికీ ఆటంకం. 'భిన్నత్వంలో ఏకత్వం' ఈ దేశ మౌలిక స్వభావం. దీనికి విరుద్ధంగా ఏదో ఒక భాషను అందరిపై రుద్దాలనుకోడం కుతంత్రం. జాతీయవాదం పేరిట పౌరుల అభివ్యక్తి స్వాతంత్య్రంపై ప్రదర్శించే దురహంకారం. హిందీని లేదంటే సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలన్న యోచనలు సమ్మతం కాదు. హిందీ ఉత్తర భారత ప్రజల భాష కూడా కాదు. అక్కడి అనేక స్థానిక జనభాషల్ని తుడిచిపెడుతూ విస్తరించింది. నిజానికి మన దేశంలోని 196భాషలు ప్రమాదకర స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయని యునెస్కో ప్రకటించింది. వీటిలో దాదాపు వంద భారతీయ భాషలు వేగంగా అంతర్థానమవుతున్నాయని హెచ్చరించింది. ఇందులో ఎక్కువ భాగం ఈశాన్య భారతంలోనూ, అండమాన్ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. మరోవైపు అనేక ఆదివాసీ భాషలు కూడా అదృశ్యమయ్యే స్థితిని ఎదుర్కొంటున్నాయి.
2019ని దేశీయ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. అంతరించిపోయే ప్రమాదమున్న భాషల్ని కాపాడుకోటానికి సత్వరం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నది లక్ష్యం. దీనికి అనుగుణంగా దేశీయ భాషల పరిరక్షణకు, ఉపకరించే పథకాలు రచించి అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. దీనికి భిన్నంగా సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఒక భాషను భారతీయులందరి మీద రుద్దాలనుకోడం ఆమోదయోగ్యం కాదు. అందుకే త్రిభాషా సూత్రం తరచు వివాదాస్పదవమవుతున్నది. ఉత్తరాదిన ఎక్కువమంది మాట్లాడే హిందీని జాతీయభాషగా, తప్పనిసరి భాషగా చేసే ఆలోచనల్ని దక్షిణాది వారే కాదు, ఇతర ప్రాంతీయ భాషలకు చెందినవారు కూడా అంగీకరించడం లేదు.
అపారమైన భాషా వైవిధ్యం భారతదేశ ప్రత్యేకత. ఈ వైవిధ్యం మరింత బలీయం కావడం దేశానికీ, ప్రజలకీ, ప్రజాస్వామ్యానికీ గౌరవం. ఒక భాష బోధనా మాధ్యమంగా కానీ, పరిపాలనా భాషగా కానీ, మీడియా ఉపకరణంగా కానీ లేనట్టయితే అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటుందని భాషా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుకనే అనేక దేశీయభాషల అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే మూడో భాషగా అమలు చేయాలనుకున్నపుడు ఆయా ప్రాంతాల స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఒక ప్రాంతంలోని అల్పసంఖ్యాకులు మాట్లాడే భాషలో బోధన జరగాలి. రక్షణాత్మక స్థితిలో ఉన్న భాషలు నేర్చుకునే వారికి ప్రత్యేక పారితోషికాలు అందించాలి. పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు రూపొందించి దేశీయ భాషల అస్తిత్వాన్ని ఇనుమడింపజేయాలి. అంతేగాక ఆయా భాషలు నేర్చుకున్న వారికి ఉపాధి సౌకర్యం కల్పించాలి. అంతకన్నా ముఖ్యంగా స్థానిక భాషలు నేర్చుకున్న వారి గౌరవం ఇనుమడించేలా ప్రోత్సాహకాలు ఉండాలి. ఈ దిశగా ఉన్నతమైన లక్ష్యాలతో, చిత్తశుద్ధితో వ్యవహరించినపుడే దేశీయ భాషలకు మనుగడ ఉంటుంది.
సంకుచితమైన రాజకీయ లక్ష్యాలతో ఒక భాషని అందరి మీద రుద్దే ఆలోచనలు, యోచనలు, ప్రతిపాదనలు ఏవైనా ప్రజల నుంచి ప్రతిఘటనని ఎదుర్కొంటాయి. హిందీ బదులు సంస్కృతం అధికార భాషగా చేయాలన్న యోచనలు కూడా సరికాదు. ఆసక్తి ఉన్నవారు సంస్కృతం నేర్చుకుంటారు. ఈ దేశంలో కొద్దిమంది మాట్లాడే సంస్కృతానికి అనేక ప్రోత్సాహకాలు ఉన్నాయి. అయినప్పటికీ అది ప్రాచుర్యం పొందలేదు. ఆ భాషకు ఉన్న పరిమితి అది. అదే సమయాన భారతీయ భాషలపై సంస్కృతం ప్రభావం అపరిమితం. అంతమాత్రాన అది జన వ్యవహారంలో ఉన్న ఒక భాషగా ఆమోదం పొందలేదు. ఈ పరిమితుల్ని గమనిస్తే అధికార భాషగా, బోధనా మాధ్యమంగా దాని వినియోగం ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేదని గుర్తించాలి. తెలుగునాట ఇంటర్మీడియేట్లో మార్కులు పెంచుకోడానికి తప్ప సంస్కృతం వల్ల ఒనగూరిందేమీ లేదు. మార్కుల పేరిట రెండు సంవత్సరాలు తెలుగువారిని తెలుగుకు దూరం చేయడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ.
భాషకు సంబంధించిన బహుళ కోణాలని పరిశీలిస్తే బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఏవైనా భాషా వైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయన్నది నిజం. అనివార్యంగా ఆంగ్లభాష అనుసంధాన భాషగా, అధికారిక భాషగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ స్థానిక భాషల ప్రాధాన్యం విస్మరించకూడదు. ఆర్థికపరమైన సాధికారిత కోసం, ఉద్యోగాల కోసం, సమాజంలో సమున్నత గౌరవం కోసం ఆంగ్లం నేర్చుకోడం అవసరమనే దృష్టి ఏర్పడింది. తల్లిభాషల్ని కాదని ఆంగ్ల భాషని బోధనా మాధ్యమంగా అమలు చేయడం ఆయా ప్రాంతాల్లోని పాలకుల వైఫల్యానికి నిదర్శనం.
తమ తల్లిభాషలో చదివితే ఉద్యోగాలు రావని, ఆంగ్లం చదివితేనే బతుక్కి భరోసా అని భావించే స్థితికి ప్రజల్ని నెట్టివేశారు పాలకులు. కనుకనే తెలుగునాట ఆంగ్లభాషకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అందువల్లనే అంతరించిపోయే భాషల్లో తెలుగు ఒకటి అవుతుందనే భయాందోళనలు ఉన్నాయి. భాషా నిపుణుల ప్రకారం ఒక భాష బోధనా మాధ్యమంగా లేకపోతే మరణించే ప్రమాదం ఎదుర్కొంటుంది. ఈ వాస్తవాన్ని పరిగణిస్తే నాలుగు దశాబ్దాల కిందట తెలుగుకు ఉన్న గౌరవం, ఆదరణ ఇవాళ ఎందుకు లేదో బోధపడుతుంది. ఈ పూర్వరంగంలోనే దేశీయభాషల్ని కాపాడుకునే కార్యాచరణలో భాగంగా తెలుగు సమున్నతికి, తెలుగు ప్రాంతాల్లోని ఆదివాసీ భాషల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఇది భాషా వైవిధ్యానికి శుభకరం.