Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మన భవిష్యత్తు విద్యతోనే సాధ్యం'' అని నెల్సన్మండేలా చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఆధునిక సమాజంలో విద్యపాత్ర అత్యంత కీలకం. ఇంటి సంసారం నుంచి ప్రారంభిస్తే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రథమ ప్రామాణికం విద్య. అలాంటి చదువును నేటి ప్రభుత్వాలు, పాలకులు పెడచెవిన పెడుతున్నారు. తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండీ.. అన్నట్టు అత్తెసరు రొక్కం విదిల్చి, ఘనకార్యం చేసినట్టుగా జబ్బలు చరుచుకునే పరిస్థితి పరిపాలకుల్లో బాగా పాతుకుపోయింది.
రాష్ట్రంలో దాదాపు 41 వేల స్కూళ్లల్లో 23.65 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర రంగాల్లోనూ విద్యనభ్యసిస్తున్న వారు అదనం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు తిష్టవేశాయి. అసౌకర్యాలకు అడ్రస్గా మారాయి. 11 విశ్వవిద్యాలయాల పరిస్థితి ఘోరం. నిధుల్లేక నకనకలాడుతున్న దుస్థితి. విద్యార్థుల పరిస్థితి దారుణాతిదారుణం. మొత్తంగా విద్యావ్యవస్థ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా తయారైంది. మౌలిక సౌకర్యాల లేమితో మన స్కూళ్లు మరో విద్యాసంవత్సరంలోకి అడుగుపెట్టడం గమనార్హం.
మచ్చుకు మన స్కూళ్ల పరిస్థితిని చూస్తే ప్రాథమిక విద్యారంగంలోనే దాదాపు 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వం భర్తీచేయకుండా ఉందంటే చదువుపట్ల సర్కార్ వైఖరి తేటతెల్లమవుతున్నది. 539 మండల విద్యాధికారుల పోస్టులకుగాను 515 పోస్టులను కొన్ని ఏండ్లుగా సర్కారు భర్తీచేయడం లేదు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8,792 పోస్టులకు టీచర్ రిక్రూట్మెంటు టెస్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తే, ఇప్పటికీ అవి భర్తీచేయక విద్య ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతున్నదో అర్థమవుతున్నది. తాము కనే కలలను సాకారం చేసుకోవాలంటే విద్యార్థులకు నాణ్యమైన చదువు కావాలి. నేటి సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అస్పష్టమైన, అసహజమైన విద్యావిధానాలతో భావి భారతపౌరుల బంగారు భవిష్యత్తు ఛిద్రమవుతున్నది. కొత్త విద్యావిధానం పేర మత మౌఢ్యం, కాషాయీకరణా జొప్పిస్తూ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఉండగా, ఏటేటా విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లల భవిష్యత్తును టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇందుకు కొఠారి కమిషన్ సిఫారసుల అమలును తుంగలో తొక్కడమే తార్కాణం. ఏటా బడ్జెట్లో కేంద్రం 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులు కేటాయించాలని చేసిన సూచన ఎప్పుడో మరిచిపోయాయి పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతున్న ప్రభుత్వాలు. అంతేగాక ఆ కమిషన్ సిఫారసులతో కూడిన నివేదికను చెత్తబుట్టలో పడేశాయి.
2014-15లో ఏర్పడిన గులాబీ సర్కారు తొలినాళల్లో విద్యారంగానికి 10.89 శాతం నిధులు కేటాయించగా, క్రమేణా 2019-20కి వచ్చేసరికి 6.71 శాతానికి తగ్గించింది. అంటే ప్రాధాన్యత రంగాలకు నిధుల కొరత ఏమేరకు వస్తున్నదో కండ్లకు కడుతున్నది. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అవసరమేగానీ, మానవ మనుగడకు కావాల్సిన విద్యకు కాసుల కొరత సృష్టించడం ద్వారా ఓట్ల రాజకీయాలకు తెర లేపింది. పాఠశాలల ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు విద్యార్థులకు చేర్చడంలో సర్కారు విఫలమైంది. 2019-20 విద్యాసంవత్సరం క్యాలెండర్ పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్కూళ్ల పున:ప్రారంభానికి ఒకరోజు ముందు ప్రకటించి, తన క్రియాహీనత్వాన్ని చాటుకున్నది. యూనిఫారాల బట్టకు రూ.106 కోట్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదంటూ, దాదాపు 3000 బడులను పక్కగ్రామాల్లోని స్కూళ్లల్లో విలీనం చేసి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడిచింది. ఈ విషయంలో మాటలు కోటలు దాటుతున్నా, చేతలు గడపదాటడం లేదని విద్యావేత్తలు, మేధావులు నెత్తీనోరూ కొట్టుకుంటున్న మాట వాస్తవం కాదా? సదుపాయాలు పెంచకుండా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదంటూ గగ్గోలు పెట్టడం ఏ మేరకు సమంజసం. చాలినన్ని తరగతిగదులు లేక పిల్లలు చెట్లకింద చదువులు సాగిస్తున్న సంగతి నిజం కాదా ? బడిబాట పేర ప్రతిసంవత్సరం చేస్తున్న కార్యక్రమం ఓ తంతుగానే మిగులుతున్నది.
వామపక్ష ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యావిధానం మూలంగా కేరళలో విద్యార్థుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతున్నది. త్రిపురలోనూ గత ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి ఆదరణ ఉన్నది. సమగ్ర విద్యావిధానమంటూ లేకపోవడంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఎండిపోతున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజి విద్యను వ్యాపారమయం చేసిన ప్రయివేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటూ , ప్రభుత్వరంగానికి దండిగా నిధులిస్తూ ప్రోత్సహించడం టీఆర్ఎస్ సర్కారు బాధ్యత.