Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ దుర్నీతిని, యుద్ధ నేరాలను ప్రచురించాయనే కోపంతో గతవారం రెండు మీడియా సంస్థల కార్యాలయాలపై ఆస్ట్రేలియా పోలీసులు దాడిచేశారు. సిడ్నీలో వున్న ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు ఎనిమిది గంటలపాటు సోదా చేశారు. అలాగే న్యూస్ కార్ప్ రాజకీయ సంపాదకురాలైన అన్నికా స్మెథర్స్ట్ ఇంటిని కూడా గంటల తరబడి సోదా చేశారు. అమెరికాతో సాన్నిహిత్యంగల ఆస్ట్రేలియా సైనిక గూఢచార యంత్రాంగం అఫ్ఘానిస్థాన్లో ఎలా యుద్ధ నేరాలకు పాల్పడిందీ, దేశీయంగా ఆస్ట్రేలియా ఎలక్ట్రానిక్ గూఢచార ఏజన్సీ ప్రజలపై పెడుతున్న నిఘాను చట్టబద్దం చేయాలనే ప్రయత్నాలపై కథనాలను ప్రచురించటం వల్ల ఈ దాడులు జరిగాయి. జర్నలిజాన్ని నేరపూరితం చేయటంలో భాగంగానే వికీలీక్స్ స్థాపకుడు జులియన్ అస్సాంజేని నిర్బంధించారు. ఇబ్బందికర సమాచారాన్ని బహిర్గతం చేసిన జర్నలిస్టులను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ట్రంప్ పాలన బాటలో నడుస్తోంది. అమెరికా గూఢచార చట్టాన్ని ఉపయోగించి అస్సాంజేపై ట్రంప్ ప్రభుత్వం 17రకాల నేరారోపణలను చేసింది. ఈ ఆరోపణల పర్యవసానంగా అస్సాంజేకి జీవితఖైదు లేక మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని భావించే జర్నలిస్టులను, ప్రజావేగులను హింసించటం సర్వసాధారణమైంది.
ఆస్ట్రేలియాలలో జరుగుతున్నదే కాకుండా ఫ్రాన్స్లో ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రభుత్వం కూడా మీడియా పట్ల ఇదే వైఖరి ప్రదర్శిస్తోంది. డిస్ల్కోస్ అనే మీడియా సంస్థ ఇంటర్సెఫ్ట్, రేడియో ఫ్రాన్స్, మీడియాపార్ట్, ఆర్టె ఇన్ఫో, కొన్బినీల భాగస్వామ్యంతో యమెన్పై సౌదీ అరేబియా చట్ట విరుద్ధంగా చేస్తున్న యుద్ధంలో ఫ్రాన్స్ సౌదీ అరేబియాతో కుమ్మక్కయిందని బయటపెట్టగా మాక్రాన్ ప్రభుత్వం అలా చేసిన జర్నలిస్టులపై కేసులు పెడుతున్నది. అస్ట్రేలియా, బ్రిటన్, ఈక్వడార్ ప్రభుత్వాలతో కలిసి చేసిన కుట్రతో అస్సాంజేని నిర్బంధించేలా చేసిన అమెరికా చెల్సియా మాన్నింగ్ను మరోసారి నిరవధికంగా జైలులో పెట్టింది. ఒక గ్రాండ్ జ్యూరీ ముందు అస్సాంజేపై అబద్ధపు సాక్ష్యం చెప్పటానికి నిరాకరించినందువల్లనే ఆమెను జైలులో పెట్టారు. అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన యుద్ధ నేరాలు, గూఢచర్యం, ప్రభుత్వాలను మార్చే కుట్రలు, మానవ హనన కార్యకలాపాలను ప్రపంచ ప్రజల ముందుంచటమే అస్సాంజే, మాన్నింగ్లు చేసిన 'నేరం'.
అమెరికాతో అంగీకారానికి రాకుండా ఆస్ట్రేలియా ఏబీసీ, మర్దోక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులపై పోలీసుల చేత దాడులు చేయించటం అనూహ్యం. అమెరికా చేసిన అన్ని యద్ధాలలోను, యుద్ధ సన్నద్దతలోను ఆస్ట్రేలియాకు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్(ఎస్ఏఎస్), ఆస్ట్రేలియన్ సిగల్ డైరెక్టొరేట్(ఏఎస్డి) అనే గూఢచార సంస్థ పాలుపంచుకున్నాయి. అఫ్ఘానిస్థాన్లో అమెరికా సైన్యం చేసిన యుద్ధ నేరాలలో పిల్లల్ని, నిరాయుధులైన పౌరులను చంపటం కూడా ఉంది. వీటన్నింటిలోను ఎస్ఏఎస్ పాలుపంచు కుంది. అమెరికా ఆధ్వర్యంలో ప్రపంచంపై గూఢచర్యం చేసేందుకు ఉద్దేశింపబడిన నిఘా నెట్వర్క్ 'ఐదు కళ్ళు(ఫైవ్ ఐస్)'లో కూడా ఏఎస్డీ భాగమే. ఆస్ట్రేలియా పౌరులకు చెందిన సమాచారాన్ని కూడా ఏఎస్డీ అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీకి అందజేస్తున్నదని 2013లో ఎడ్వర్డ్ సోడెన్ బయటపెట్టిన డాక్యుమెంట్లలో ఉంది. అన్నికా స్మెథర్స్ట్ ద్వారా ఇదంతా బయటకు రాకపోతే గూఢచార ఆపరేషన్లను 2018లో ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టబద్ధం చేసేదే.
అమెరికా, దాని మిత్ర దేశాలు గతంలో చేసిన యుద్ధ నేరాలనే కాకుండా ఇరాన్, సిరియా, వెనెజులాపై చేయబోయే యుద్ధాలలో గతానికి మించిన స్థాయిలో చేయబోయే యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకోవటానికే పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. అమెరికా, దాని మిత్రదేశాలలో ప్రభుత్వాలను ఏ పార్టీలు నడుపుతున్నా వాటికి తమతమ సమాజాలను సైనికీకరించటం, భిన్నాభిప్రాయాలను అణచివేయటమే కార్య క్రమంగా మారింది. ఇంత జరుగుతున్నా కార్పొరేట్ మీడియా జర్నలిస్టులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న సోదాల గురించిగానీ, అస్సాంజే, మాన్నింగ్ల నిర్బంధాల గురించిగానీ నోరు విప్పదు. వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాస్తుంటే కార్పొరేట్ మీడియాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అస్సాంజేని అప్రదిష్టపాల్జేసిన మీడియా సంస్థలలో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ పత్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ మీడియా సంస్థలు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించటం లేదు.
ఈ మీడియా సంస్థలు పత్రికా స్వేచ్ఛను కాపాడజాలవని తేలిపోయింది. పాలకవర్గాల, వాటి నియంత్రణలోని రాజ్య యంత్రాంగాల ఆధ్వర్యంలో జరిగే నేరాలు, కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలియకుండా చేసేందుకే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారు. పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనం కోసం చేసే యుద్ధాలకు, అది సృష్టించే అసమానతలు, ఇతర సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడటానికి స్వేచ్ఛాయుతంగా పనిచేసే మీడియా, ఆన్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆవశ్యకత ఎంతో ఉంటుంది. కాబట్టి మీడియా స్వేచ్ఛను కాపాడటం కూడా ప్రజా ఉద్యమాలలో భాగం చేయటం నేటి అనివార్యత.