Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది'' అంటారు ప్రముఖ విద్యావేత్త కొఠారి. నిజమే కదా..! ఈ సమస్త విజ్ఞానానికీ సాధించిన ప్రగతికీ చదువే కదా మూలం..! మరి అలాంటి చదువు వర్తమానంలో ఎలాంటి భవిష్యత్తుకు రూపుదిద్దుతోంది..? ''మనం నిజంగా స్వతంత్రులుగా ఉండటానికి ఏ చదువయితే సహకరించదో దాన్ని ధిక్కరించండి. అటువంటి చదువు రాక్షసం, పాప భూయిష్టం'' అంటారు గాంధీ. మరి నేడు మనదేశంలోని చదువుల్ని, అమలవుతున్న విద్యావిధానాన్ని అనుసరించాలా? లేక ధిక్కరిం చాలా? మన విద్యావిధానంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే... అసలు విద్య అంటే ఏమిటో ప్రజలకు తెలియనివ్వక పోవడం! ఇది వినడానికి కొంత అతిశయోక్తిగానే అనిపించినా, లోతుగా తరచి చూస్తే అసత్యం మాత్రం కాదని అర్థమవుతుంది.
చదువంటే విద్యార్థుల విజ్ఞానాన్ని, శీలాన్నీ, సత్ప్రవర్తననూ, సమాజం పట్ల బాధ్యతనూ పెంపొందించడమనే నిజాన్ని వదిలిపెట్టి.. ఆస్తుల్నీ, మార్కెట్లో వస్తువుల్నీ విలువగట్టినట్టు విద్యను కూడా మనం విలువకట్టడానికి ప్రయత్నిస్తున్నాం. మన పిల్లలు బాగా సంపాదించడానికి ఏ చదువు పనికొస్తుందో ఆ చదువునే వాళ్లకి 'కొని' ఇవ్వాలనుకుంటున్నాం. చదువుల పట్ల ప్రజల్లో ఇటువంటి అభిప్రాయాలు కలిగించే విధానాలు మారనంత కాలం మనం చదువు నిజమైన విలువను తెలుసుకోలేం. ఇప్పుడు మనకు తెలిసిందల్లా చదువు మన పిల్లలకు డబ్బు సంపాదించడానికి సహకరిస్తుందనే. చదువు సరుకుగా మారిపోయింది. మనం చదువుకోవటం మానేసి చదువు'కొనటం' ప్రారంభించి చాలా కాలమే అయింది. బిడ్డ కడుపులో ఉండగానే సీటు కోసం వేట మొదలవుతుంది. కేజీ నుంచి పీజీ దాకా రకరకాల కోర్సులు, సీట్ల కోసం పోటీలు. మంచి విద్యాసంస్థలో (ఖరీదైన విద్యాసంస్థలో) చదివితేనే భవిష్యత్తు బాగుంటుందన్న ఆశలు. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని తల్లిదండ్రులు, ఆ ఆశల వెంట పరుగులుతీస్తూ విద్యార్థులు నిత్యం వత్తిళ్లతో సహజీవనం చేస్తూ జీవితాలను గెలవడానికి మనుషులుగా ఓడిపోతున్నారు. జీతాల వేటలో జీవితాల్ని కోల్పోయి చివరికి సంపాదించే యంత్రాలుగా మారుతున్నారు..! ఆ అవకాశం కూడా దక్కనివారు చౌరస్తాలో నిలుచుని దిక్కులు చూస్తున్నారు..!!
తాము సాధించామనుకుంటున్న తమ అభివృద్ధికి కారణమైన ప్రజల గురించీ తమ సమాజం గురించీ క్షణమైనా ఆలోచించ నీయటం లేదు. ఈ వ్యాపారీకరణ వారిలో కాసింతయినా సామాజిక స్పృహ, బాధ్యతా కనిపించకపోవడం ఏ సమాజానికీ శ్రేయస్కరం కాదు. అయితే ఇందుకు కారణం ఎవరు? విద్యార్థులా? తల్లిదండ్రులా..? లేక అందుకు వేదికలవుతున్న స్కూళ్లూ కాలేజీలా..? ఏ ఒక్కరినీ నిందించలేం..! మన విద్యావ్యవస్థలోని లోపాల వల్లే ఈ విష ఫలాలు కాస్తున్నాయి.
చదువు లక్ష్యం కేవలం అక్షర జ్ఞానం, ఉద్యోగ సాధన మాత్రమే కాదు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం ఏర్పరచడం, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కల్పించడం. ఏ సమాజమైనా నిరంతరం పురోగమనంలో ఉండాలంటే విద్యకు ఈ లక్షణం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే ఈ శాస్త్రీయ భావజాలం, సామాజిక చైతన్యం అనేవి విద్యాలయాల నుంచి, విద్యార్థుల నుంచి సామాన్య జనావళికి చేరుతాయి. ఆ సమాజం అభివృద్ధి పథంలో సాగుతుంది. చదువు అనేది సమాజంలోని రుగ్మతలకు చికిత్స చేసే ఔషధం కావాలి. సమాజానికి దారి చూపే దివిటీ కావాలి.
కానీ మన విద్యాసౌధ నిర్మాణం ఇందుకనుగుణంగా లేదు. ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు సాగిలపడుతూ చదువును సరుకుగా మార్చేసింది. ధనార్జనే తప్ప జనాభ్యుదయం మరిచింది. కాబట్టే పై లక్ష్యాలకు చేరువ కాలేకపోతున్నాం. ఒకప్పుడు దేశంలో ఇరవై ముప్పై యూనివర్సిటీలు ఉండే స్థితిని దాటి నేడు వందల సంఖ్యలో యూనివర్సిటీలు ఏర్పడి పనిచేస్తున్నాయి. కానీ ఇవేవీ మన సమాజాన్ని స్పృశించడం లేదు. ప్రజలతో బంధం ఏర్పరుచుకుని వారి కష్టాలను తీర్చే కృషి చేయడం లేదు. ఫలితంగా దశాబ్దాలు గడిచినా మన విద్యా వ్యవస్థ కుల వైషమ్యాలను రూపుమాపలేక పోయింది. ఆర్థిక అసమానతలను అరికట్టలేకపోయింది.
సమాజాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించి, మానవ జీవితాన్ని సుఖమయం, విజ్ఞానవంతం చేయటమే చదువుల పరమార్థం. అది నెరవేరినప్పుడే ప్రజలు వివేకవంతులవుతారు. వివేకవంతులకు వివేచన ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఏర్పడుతుంది. రుజువులకు నిలబడని దేనినీ విశ్వసించని తర్కజ్ఞానం అలవడుతుంది. వీటినే మనం శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం అంటాం. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరించాలంటే శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం కలిగిన ప్రజలు కావాలి. అందుకే శాస్త్రీయ పురోగతిని మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించుకున్నాం. కానీ దశాబ్దాలు గడుస్తున్నా ఆ లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం ఈ సమాజానికి అనర్థదాయకం. దీనిని అధిగమించడానికి మనకున్న మార్గం ఒక్కటే. ప్రజల నిజమైన అవసరాలకు అనుగుణంగా మన చదువుల్ని సంస్కరించుకోవడం. మన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడం. మన ఏలినవారు కూడా ఇప్పుడు ప్రక్షాళనే చేస్తామంటున్నారు..! కానీ ఆ ప్రక్షాళన ఏ లక్ష్యాలకు..? పురోగమనానికా? తిరోగమనానికా?