Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాసనసభ, సచివాలయం నూతన భవనాల నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతున్నది. బీజేపీతో పరోక్ష సాంగత్యం వికటించింది. అందుకే రెండేండ్ల నుంచీ ఎదురుచూసిన సికింద్రాబాద్లోని బైసన్ఫోలో రక్షణ దళాల మైదానాన్ని కేంద్రం కేటాయించలేదు. సచివాలయం ప్రాంగణంలోనే పాత భవనాలను కూల్చేసి సరికొత్తగా నిర్మించేందుకు గులాబీ సర్కారు హడావుడి చేస్తున్నది. ఇప్పటికే ప్రజలకు ప్రమేయం లేని ప్రగతిభవన్ను 16 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ. 60 కోట్లకుపైగా వెచ్చించి గడీ మాదిరి కట్టించింది. తద్వారా పరిపాలనా కార్యకలాపాలను సీఎం తన కనుసన్నల్లో నడిపించు కుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేనిదే ముఖ్యమంత్రి దర్శనభాగ్యం కలగదనేది యావత్తు తెలంగాణ ప్రజానీకం ఎరిగిన సత్యం.
వాస్తు పేరుతో ఎవరేమి చెప్పినా గుడ్డిగా నమ్ముతూ, ప్రతిపక్షాలను ఖాతరుచేయకుండా ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా సచివాలయం, అసెంబ్లీ నూతన భవనాల నిర్మాణం విషయంలోనూ విమర్శలకు తావిచ్చింది. శాసనసభను జలసౌధ ప్రాంగణంలో, ఇప్పుడున్నచోటే సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు శంకుస్థాపన ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. నూతన సెక్రటేరియట్ భవనానికి రూ. 400 కోట్లు, అసెంబ్లీకి రూ. 100 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇప్పటి సచివాలయ భవనం ఉనికి వచ్చే 60ఏండ్ల వరకూ ఉంటుందని, ఆ మేరకు పటిష్టంగా నిర్మాణం సాగిందని, దాన్ని కూల్చాల్సిన అవసరం లేదనీ అందులోనే విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే పనిగట్టుకుని పలు కారణాలు చెబుతూ టీఆర్ఎస్ అధినేత భవనాల నిర్మాణానికే మొగ్గుచూపుతున్నారు. రెండు చోట్లా గురువారం ముగ్గుపోసేందుకు సచివాలయంలో భారీగా ఏర్పాట్లు చేసేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి తీరుతెన్నులు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
అసలే ధనికరాష్ట్రంలోని ప్రజలపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ లెక్కల ప్రకారం రూ. 1.80లక్షల కోట్ల అప్పు పడింది. 2014, జూన్ రెండు నాటికి ఈ అప్పులు 69,517కోట్లు మాత్రమే ఉండేవి. 2019 మార్చి నాటికి ఈ ఐదేండ్లల్లో 159శాతం అప్పులు పెరిగాయి. ఒక్కో పౌరుడి నెత్తిన సగటున రూ.55 వేల వరకు అప్పు పడింది. కొత్త భవనాల నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే, పాత భవనాల కూల్చివేతకు అధికంగా ఖర్చుకావడం గమనార్హం. కాలానుగుణంగా రెండు భవనాలను కట్టడానికి రూ.500కోట్ల నుంచి 700కోట్ల మేర వ్యయమమ్యే అవకాశం ఉండగా, పాత భవనాలను పడగొట్టడానికి అంతకు రెట్టింపు ఖర్చవుతుండటం సర్కారు ఖజానాకు మరింత చేటు తెచ్చేదే. ఇదిలావుండగా ధనిక రాష్ట్రంలో గత ఏడాదిగా పరిపాలన కుంటుపడింది. స్వార్థ రాజకీయాలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు క్షేత్రస్థాయిలో పాలన అందలేదు. ఇంకా మున్సిపల్ ఎన్నికలు మిగిలే ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కనిపిస్తున్నది. ఆయా ప్రాజెక్టు పనులకుగాను అన్నట్టు దాదాపు రూ.25వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల మేర బకాయి సొమ్ము చెల్లించాల్సినవి బిల్లుల రూపేణా సర్కారు మెడపై ఖడ్గంలా వేలాడుతూనే ఉన్నది. సామాజిక పింఛన్లు నెల నుంచి రెండు నెలల ఆలస్యంగా లబ్ధిదారులకు చేరుతున్నాయి. నిధులు విడుదల కాక ఉపాధి హామీ బిల్లులు ఎప్పుడూ పెండింగ్లోనే ఉంటున్నాయి. దాదాపు రూ.1.74లక్షల కోట్ల బడ్జెట్లో ఆయా పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపులే తప్ప, వాటిని ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లు అమలుకావడం లేదు. వీటి నిదులన్నీ ఇతర ప్రాజెక్టులు, పనులకు దారిమళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆర్థిక శాఖ అధికారులే సెలవిస్తున్న అంశం. ఈ పరిస్థితుల్లో అనవసరంగా సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించడం ద్వారా ఉన్న కాస్త నిధులను వృథా చేయడం ఖజానాకు తూట్లు పొడవడమేనని రాజకీయ, సామాజిక రంగాల విశ్లేషకుల భావన. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా పథకాలను పక్కాగా అమలుచేయాల్సిన అవసరం ఉందని సలహాలూ సూచనలూ వారి నుంచి వస్తున్నాయి. ఆధునిక భవనాల కోసం మంచినీళ్లప్రాయంలా నిధుల్ని ఖర్చుచేయరాదంటున్నారు. ఇదంతా ఒక పార్శ్వం. మరొకటి ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చే ప్రయత్నం గులాబీ ప్రభుత్వం చేయడం దారుణం. నిరుపేదలకు మద్యం అలవాటుగా మార్చి తమ బొక్కసం నింపుకోవడానికి సైతం ఈ ప్రభుత్వం పూనుకోవడం సహించరానిది. అవసరం లేకున్నా డబ్బులు ఖర్చుపెట్టడం అంటే బాధ్యతా రాహిత్యమే. ప్రజలను కష్టపెట్టడమే. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడమే. వారు పన్నుల రూపేణా కడుతున్న విలువైన ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని గులాబీ ప్రభుత్వం గ్రహించాల్సి ఉంది.