Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలు శరణార్థులపట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సముద్రంలో చిక్కుకున్న శరణార్థులను రక్షించేందుకు ఉద్దేశింపబడిన సీవాచ్3 అనే పేరుగల నౌకకు కెప్టెన్గా వున్న కరోలా రకెట్ని ఇటలీ ప్రభుత్వం అరెస్టు చేసినందుకు వేలాదిమంది ప్రజలు తమ నిరసన తెలియజేశారు. జూన్ 12న మధ్యదరా సముద్రంలో చిక్కుకు పోయిన గర్భవతులు సహా 52మంది ఆఫ్రికా శరణార్థులను రక్షించి వారిని ఇటలీ భూభాగంలో వున్న లంపెదూసాకి చేర్చటమే ఈ మహిళా కెప్టెన్ చేసిన నేరం. రెండు వారాలపాటు సీవాచ్ నౌక తాను రక్షించిన శరణార్థులకు ఆశ్రయం ఇవ్వటానికి ఫ్రాన్స్, జర్మనీ, స్పైయిన్ సహా ఏ యూరోపియన్ యూనియన్ దేశమూ అంగీకరించని స్థితిలో వారిని లంపెదూసాలో కరోలా వదలింది. ఆ తరువాత ఒక ఇటలీ న్యాయస్థానం ఆమెను విడుదల చేసింది.
యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు శరణార్థులకోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయితే ఫ్రాన్స్, జర్మనీల నేతృత్వంలో ఐరోపా ఖండం చుట్టూ ముళ్లకంచెతో ఒక కోటగోడ నిర్మించారు. మధ్యదరా సముద్రంలో చిక్కుకున్న శరణార్థులను రక్షించే చర్యలను ఆపి ఐరోపా దక్షిణ సముద్రాన్ని ఒక విస్తృత జలసమాధిగా మార్చారు. 2015లో 'ఆపరేషన్ ట్రైటన్'ను యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో భాగంగా లిబియా మిలిటెంట్లకు శిక్షణనిచ్చి పారిపోతున్న శరణార్థులను పట్టుకుని కాన్సెన్ట్రేషన్ క్యాంపులలో బంధించి నానా హింసలు పెట్టేవారు. అంతేకాకుండా అలా పట్టుకున్న శరణార్థులను బానిసలుగా మార్చేవారు. ఆ తరువాత యూరోపియన్ యూనియన్ రెస్క్యూ ఆపరేషన్లు నిలిపేయగా స్వచ్చంధ సంస్థల నౌకల హక్కులను రద్దు చేశారు.
ఐరోపాను చేరుకునే ప్రయత్నంలో గత మూడేండ్లలో కనీసం 14,000మంది శరణార్థులు మధ్యదరా సముద్రంలో మునిగిపోయారు. 2018 జనవరి నుంచి 2019 జూన్ వరకు 70నౌకా ప్రమాదాలలో కనీసం 1020మంది శరణార్థులు చనిపోయారని కామిండో ఫ్రంటేరాస్ అనే స్పానిష్ పౌరహక్కుల సంస్థ గతవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అమెరికాలోను, అమెరికా-మెక్సికో సరిహద్దు ప్రాంతంలోను ఒక నిర్బంధ క్యాంపుల నెట్వర్క్ను అధ్యక్షుడు ట్రంప్ సృష్టించాడు. ఈ నిర్బంధ క్యాంపులలో పరిస్థితులు అత్యంత హృదయవిదారకంగా ఉన్నాయని లూసియో సెవియర్ అనే డాక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించిన తరువాత చెప్పాడు. ఇటీవలెనే డెమోక్రటిక్ ప్రజాప్రతినిధి అలెగ్జాండ్రియా అకాషియో కార్టెజ్ టెక్సాస్ రాష్ట్రంలోని నిర్బంధ క్యాంపులను దర్శించినప్పుడు మహిళలకు కనీసం మంచినీటిని అందించక పోగా టాయిలెట్లలోని నీటిని ఉపయోగించండని చెబుతున్నారని అక్కడి క్యాంపులలో నిర్బంధంలో వున్న మహిళలు చెప్పారు. ట్రంప్ ఫాసిస్టు వలస విధానాలకు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఐరోపా, అమెరికాలను దాటి శరణార్థులపై ప్రపంచ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని లిబరల్, నేషనలిస్టు ప్రభుత్వం అవలంబిస్తున్న శరణార్థి వ్యతిరేక విధానాలను జూన్ 27న ట్రంప్ మెచ్చుకున్నాడు. శరణార్థులు ఆస్ట్రేలియా చేరకుండా సైన్యాన్ని వినియోగించి అడ్డుకుంటున్న విధానం నుంచి చాలా నేర్చుకోవలసి ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. శరణార్థులపై సార్వజనీనంగా జరుగుతున్న దాడులకు ట్రంప్వంటి ఫాసిస్టు రాజకీయ నాయకుల వ్యక్తిత్వం మాత్రమే కారణం కాదు. పెట్టుబడిదారీ జాతి రాజ్యవ్యవస్థ పతనానికి ప్రతిబింబంగా ఇది ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం, దాని ఐరోపా మిత్రదేశాలు గత పాతికేండ్లుగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలలో చేస్తున్న యుద్ధాలలో జరుగుతున్న నరమేధం నుంచి తప్పించుకొనటానికి కోట్లాదిమంది ప్రజలు శరణార్థులుగా మారి పారిపోతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత సంఖ్యలో శరణార్థులు ఎన్నడూ లేరు. 2009లో ప్రపంచంలో బలవంతంగా స్థానభ్రంశం చెందిన శరణార్థులు 4.33కోట్లమంది ఉంటే 2018లో ఆ సంఖ్య 7.08కోట్లయింది. 2018లో నిముషానికి 25మంది బలవంతంగా తమ ఆవాసాలను వదలి వెళ్ళవలసి వస్తోంది. మానవాళిలో దాదాపు 1శాతం అంటే 108మందిలో ఒకరు శరణార్థులుగా మారారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పెట్టుబడిదారీ ప్రభుత్వాలు 1930వ దశకంలో ఫాసిస్టు ప్రభుత్వాలవలే తమ తమ దేశాలలోని రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి మితిమీరిన జాతీయవాదాన్ని, విదేశీయులపట్ల ద్వేష భావాన్నీ రెచ్చగొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శరణార్థులకు వ్యతిరేకంగా విధానాలను రూపొందించిన మితవాద ప్రభుత్వాలు పాలకవర్గాలకు ప్రీతిపాత్రమయ్యాయి. శరణార్థులకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న విధానాలను మొత్తం కార్మికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. కాబట్టి శరణార్థులకు మద్దతుగా కార్మిక వర్గాన్ని సమీకరించాలి. అది ఒక ప్రగతిశీల కార్యక్రమం ఆధారంగా జరగాలి. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పన్నంచేసే సామాజిక సంక్షోభాలకు శరణార్థులను బలి ఇవ్వటాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి. శరణార్థులకు కూడా కార్మికులకుండే అన్ని హక్కులు ఉండాలనేది ప్రాథమిక డిమాండ్గా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది.