Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినది బడ్జెట్ అనేకంటే విధానపత్రం అనటం సమంజసం. మోడీ ప్రభుత్వం ఎవరికోసం పనిచేయబోతున్నదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. 'సంస్కరణ'లే లక్ష్యంగా స్పష్టం చేసారు. ప్రపంచంలోనే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. రానున్న ఐదేండ్లలో దీనిని ఐదు ట్రిలియన్ డాలర్ల (రూ.350లక్షల కోట్లు) వ్యవస్థగా రూపుదిద్దుతామన్నారు. భారతదేశ శ్రామికుల ఆస్తులన్నీ కలిపితే ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరితే మంచిదే. కానీ జరుగుతున్నది అది కాదు, కొల్లగొట్టిన సొమ్ముతో పెంచుకుం టున్న కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెరగటం ద్వారా ఐదు ట్రిలియన్లు కాదు, యాభై ట్రిలియన్లయితే మాత్రం ప్రజలకు ఒరిగేదేమిటి?
శ్రామికులే సంపద సృష్టికర్తలన్న విషయం అందరికీ తెల్సిందే! కానీ కార్పొరేట్ సంస్థలే జాతి సంపద సృష్టికర్తలన్నారు ఆర్థిక మంత్రి. వారి దృష్టిలో కార్మికులూ రైతులూ కేవలం ఓట్ల సృష్టికర్తలేమో! రానున్న కాలంలో పరిశ్రమలనూ, పారిశ్రామికవేత్తలనూ బలోపేతం చేస్తామన్నారు. కార్మికులూ రైతులూ ఇప్పుడు హక్కులు కాదట అడగవల్సింది... బాధ్యత గుర్తెరిగి పనిచేయాలట! స్వాతంత్య్రానంతరం ఇప్పటిదాకా హక్కులడగటమే చేసారట! ఇక నుంచి పని చేయాలట! మరి ఈ ఏడు దశాబ్దాలుగా దేశం సాధించిన అభివృద్ధికీ, సృష్టించిన సంపదకూ మూలం శ్రామికుల స్వేదం కాదన్నమాట. కార్పొరేట్ల ధన దాహంతోనే ఈ సంపద సృష్టి జరిగిందన్నమాట! వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిస్తామనీ, ప్రయివేటు పెట్టుబడులు ప్రోత్సహిస్తామనీ చెప్పారు. రైతులు ఇక నుంచి పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తారన్నారు. పెట్టుబడి లేకుండా వ్యవసాయం ఎట్లా సాధ్యం? ప్రభుత్వం పెట్టుబడి సమకూర్చదు, రైతు పెట్టుబడి పెట్టనవసరం లేదు. అంటే.. కార్పొరేట్ సంస్థలే ఇక నుంచి వ్యవసాయంలోనూ పెట్టుబడులు పెడతాయన్న మాట. రైతులకు తమ భూముల్లోనే తాము కూలీలుగా పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ బడ్జెట్ చెప్పకనే చెప్పింది.
విద్యుత్ రంగంలో క్రాస్ సబ్సిడీలకు తిలోదకాలివ్వాలన్నారు. పారిశ్రామిక సంస్థలూ, పెద్ద మొత్తంలో విద్యుత్తు ఉపయోగించే వ్యాపార సంస్థలూ క్యాప్టివ్ జెనరేషన్ (తమ అవసరాల మేరకు తామే ఉత్పత్తి చేసుకోవాలి) వైపు ప్రయాణించాలన్నారు. ఇక ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థలుత్పత్తి చేసే విద్యుత్తును ఉపయోగించేది సాధారణ ప్రజలే కదా! నష్టాలు రాకుండా ఉండాలంటే ఇక భారమంతా ప్రజలమీదే పడటం ఖాయం. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్లు బడ్జెట్ నుంచి పెట్టుబడి సమకూర్చుతామని ప్రతిపాదించారు. అసలు బ్యాంకులకు బడ్జెట్ నుంచి కేటాయించవల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నదే మౌలిక ప్రశ్న. రూ.9.4లక్షల కోట్లు బ్యాంకుల నుంచి బడా సంస్థలు అప్పులు తీసుకుని మొండి బకాయిలైనాయి. రిజర్వు బ్యాంకు చెప్పిన విషయమిది. కార్పొరేట్ సంస్థలు కొల్లగొట్టి బ్యాంకులను డొల్లచేసాయి. అందువల్ల పెట్టుబడి సమకూర్చేందుకు బడ్జెట్లో కేటాయించారు. బడా సంస్థల మెడలు వంచి అప్పులు వసూలు చేయకుండా, ప్రజల డబ్బును పెట్టుబడిగా ఎందుకు సమకూర్చాలి? మళ్ళీ ఇది బడా సంస్థలకే అప్పులిస్తారు. 70శాతం రైతులకు ఎంత డబ్బు అప్పుగా ఇస్తున్నారో... అంతకు సమానమైన మొత్తం కేవలం 30మంది బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. దానితో వారేమైనా జాతి సంపద పెంచి, వడ్డీతో సహా అప్పు చెల్లిస్తున్నారా అంటే.. అదీలేదు. సొంత ఆస్తి కూడబెట్టుకుని బ్యాంకులకు మొండిచేయి చూపుతున్నారు.
ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొత్త ప్రయత్నం ఏమీ లేదు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్టార్ట్అప్', 'స్టాండప్'లనే జపించారు. ఇవి అమలులో ఉన్న కాలంలోనే నాలుగున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పెరిగింది. ఇప్పుడు నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను లాభాలబాట పట్టించే బదులు మూసివేయాలన్న ప్రతిపాదన పెట్టారు. లాభాలు గడిస్తున్న సంస్థల్లో కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తా మన్నారు. రిజర్వేషన్లు అమలు జరిగేది కేవలం ప్రభుత్వశాఖలూ, ప్రభుత్వరంగ సంస్థల్లోనే. అవి మూసివేయటమో, ప్రయివేటీకరించటమో చేస్తే ఇక సామాజిక న్యాయం కోసం ఎక్కడ వెతకాలి? కీలక ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు శక్తుల చేతుల్లో పెట్టటమంటే ఆర్థిక వ్యవస్థ ఎవరికి ప్రయోజనాలు చేకూర్చుతుందో స్పష్టం. మహిళ ఆర్థిక మంత్రి అయినందుకైనా మహిళలకు న్యాయం జరుగుతుందని చాలామంది ఎదురు చూసారు. గత 20ఏండ్లలో పురుషులలో కన్నా మహిళల్లోనే నిరుద్యోగం 16.3శాతం ఎక్కువగా పెరిగిందని అజీంప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. శ్రామిక మహిళలకు పన్నుల రాయితీ ఇస్తే శ్రామికుల్లో మహిళల సంఖ్య పెరిగేది. మహిళలు ఉపయోగించే సరుకుల మీద పన్నులు తగ్గిస్తే లేదా రద్దుచేస్తే వారికి మేలు జరగటమే కాదు, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేది. 'ఒక్క రెక్కతో పక్షి ఎగరగలదా?' అన్న వివేకానందుడి సూక్తి చెప్పి మాటలగారడీ ప్రదర్శించారే తప్ప ప్రయోజనం చేకూర్చలేదు. ప్రపంచమార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో కారుచౌకగా దొరికినప్పుడు కూడా ధర పెంచటం మోడీ పాలన ప్రత్యేకత. ఇప్పుడు బడ్జెట్లో ప్రతి లీటర్ పెట్రోలు / డీజిల్ మీద ఒక రూపాయి సర్చార్జీ విధిం చారు. అంటే సరుకుల ధరలు మరింత పెరగనున్నాయి. రానున్న కాలంలో పెద్దలకు సంపద పోగుపడటం, పేదలకు భారాలు మీదపడటం ఖాయం.