Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ఔన్నత్యాన్ని చాటే పండుగల్లో బోనాలు ఎంతో ప్రత్యేకం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల జాతర. తొలకరి పలకరింపులతో పాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కళ వచ్చేస్తుంది. నగరాలన్నీ పల్లె కళను సంతరించుకుంటాయి. పచ్చని తోరణాలు ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. ఎటుచూసినా సాంప్రదాయమే ఉట్టిపడుతుంది. పల్లె పట్టణాలన్నీ బోనమెత్తుతాయి. కట్టూబొట్టూ మారిపోతుంది. ఇంటిల్లిపాదిలో ఉత్సాహం ఉప్పొంగుతుంది.
మిరుగు ప్రారంభం అయ్యిందంటే గ్రామాల్లో ఒక రకమైన సందడి వచ్చేస్తుంది. ప్రకృతిని ముద్దాడినట్టు పల్లె వాతావరణం కొత్తరూపు దాలుస్తుంది. పచ్చదనం పరిమళిస్తుంది. వ్యవసాయ పనులు.. సామూహిక వన భోజనాలు, ఆరుద్ర వంటి కార్యక్రమాలతో కోలాహలం నెలకొంటుంది. ఉసిళ్లు, గొంగడి పురుగులు, అప్పడాల గుర్రాలు, అరుద్ర పురుగులు కూడా ఈ ఆషాఢంలో మాత్రమే కనువిందు చేస్తాయి. అప్పుడే బోనాల జాతర ప్రారంభమై శ్రావణమాసం వరకు కొనసాగుతుంది. వేపాకు అలంకరణలు, జానపద పాటలు, పోతురాజుల ఆటలు, పిల్లల కేరింతల మధ్య బోనాల పండుగ శోభాయమానంగా జరుగుతుంది. 'అమ్మా బైలెల్లినాదో.. తల్లి బైలెల్లినాదో..' అంటూ వినబడే రాగాలు గల్లీల్లో గజ్జెకట్టి ఆడుతుంటాయి. పల్లెల్లోనూ కులవృత్తుల సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహిస్తుంటారు. సబ్బండవర్ణాలు బోనాల్లో కలిసిపోయి కులాలకతీతమైన ఐక్యతను చాటుతాయి. వానలు సమృద్ధిగా కురవాలనీ, పంటలు బాగా పండాలనీ, కుటుంబాలు సుఖసంతోషాలతో విలసిల్లాలనీ కోరుకుంటారు. ఇలా ఆషాఢమాసంలో గ్రామదేవతలను ఆరాదించే సంప్రదాయం అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా కనబడుతుంది. తెలంగాణ ప్రాంతంలో అటువంటి విశిష్టమైన వేడుక బోనాల పండుగ. దీనిని 'ఆషాఢ జాతర' అని కూడా అంటారు.
బోనం అంటే భోజనం. అన్నం, పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలో తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు ఆలయానికి వెళ్తారు. ఈ బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. ఆహార నైవేద్యంగా సమర్పించే ఈ తంతును ఊరడి అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలుస్తారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. ఇది ప్రకృతికి మనిషి చేసే వేడుక. గల్లీగల్లీలో, బస్తీబస్తీలో గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. 'ఇంటిల్లిపాదిని సల్లంగా సూడమ్మా..' అంటూ వేడుకుంటారు. సరిగ్గా వర్షరుతువు ప్రారంభం కాగానే అంటువ్యాధులు, మలేరియా, విషజ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటివి ప్రబలుతుంటాయి. వాటన్నింటి క్రిమినాశనిగా బోనాల్లో కట్టే వేపాకు తోరణాలు, పసుపు నీళ్లు దోహదపడతాయన్నది కొందరి నమ్మకం.
'బోనం' కుటుంబ బాంధవ్యాలతో పెనవేసుకుపోయిన బంధం. స్త్రీ శక్తికి ప్రతిరూపం. సంప్రదాయానికి చిహ్నం. అందుకే బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. తెలంగాణలోని అనేక అమ్మవారి గుళ్లల్లో మహిళా పూజారులే కనిపించడం ఒక ప్రత్యేకత. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో జరిపే బోనాలు ఎనలేని ప్రాచుర్యం పొందాయి. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలకు ఘనమైన చరిత్ర ఉంది. లష్కర్ బోనాలుగా పిలిచే ఈ వేడుక దాదాపు వందేండ్ల కిందట మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన అప్పయ్య అనే సైనికుడు సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్టించడంతో మొదలైందని చరిత్రకారుల అభిప్రాయం. తొలి ఆదివారం బోనాలు మొదలై పదిహేను రోజుల పాటు నగర వీధుల్లో ఊరేగిస్తారు. చారిత్రకంగా బోనాల పండుగ కాకతీయుల కాలంలోనే ఉండేదనీ, అప్పటి నుంచీ ఆ ఆనవాయితీ కొనసాగిందనీ ప్రతీతి. ఇక గోల్కొండ నవాబు తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు మహాంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. నాడు ముస్లిం ప్రభువుల హయాం నుంచే బోనాల సంబురాలు ఘనంగా నిర్వహిస్తూ క్రమేణా భాగ్యనగరం అంతటా విస్తరించాయి. జానపద కళలు, డప్పుల లయబద్ధమైన చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. అందుకే ఈ బోనాలు సమైక్యతకు ప్రతీకలు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబాలు. మత సామరస్యానికి నిదర్శనం...!