Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికేం కావాలి కాసింత దయా ప్రేమా.. అంటాడు ప్రముఖ రచయిత బుచ్చిబాబు. అంతకన్నా ముందు మనుషులుగా బతకడానికి కూడు, గుడ్డ, గూడు తప్పనిసరి. ఇవి కనీసావసరాలు. వీటిని సాధించుకోడంలోనే తొంభై శాతం మంది బతుకులు తెల్లారిపోతున్నాయి. కనుకనే సాటి మనుషుల్ని దయతో, ప్రేమతో, ఆర్తితో పలకరించే సౌజన్యం ఉండాలని కళాకారులూ రచయితలూ ఆశిస్తారు. అయితే కరుణ, ప్రేమలు కూడా ఆర్థికాంశాలతో ముడిపడి వున్నాయి. అందుకే ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాల్ని శాసిస్తాయని మార్క్స్ చెప్పారు. ఈ సూత్రం ఇవాళ్టి అత్యాధునిక జీవితానికీ వర్తిస్తుంది. మన జీవితం, మన ఆశలు, ఆశయాలు, ప్రాధాన్యాలన్నీ ఆర్థికచట్రాల పరిధిలోనే ఉంటాయి. మన ఆలోచనలనీ, అభిరుచులనీ ఆర్థికాంశాలే శాసిస్తాయి. కనుకనే మనకు తెలిసీ తెలియకనే మార్కెట్ ప్రభావిత వలయాల్లో చిక్కుపడి తప్పిపోతుంటాం.
మనకేం కావాలో మనం నిర్ణయించుకునే లోపే మార్కెట్ శక్తుల పెత్తనం మనల్ని నియంత్రిస్తుంటుంది. ఈ క్రమాన మన ప్రాధాన్యాల్ని మరచి మార్కెట్శక్తుల చెరలాటకు బందీలవుతాం. మన మెదళ్ళపై మార్కెట్ చలనసూత్రాలు పెత్తనం చెలాయిస్తాయి. అటు 11మంది ఇటు 11మంది ఆడే క్రికెట్లోని గెలుపు ఓటములపై కోట్లాదిమంది ఆలోచించడం, మాట్లాడటం, గంటల తరబడి అదే ధ్యాసలో ఉండటం మార్కెట్ శక్తుల కుటిల వ్యూహాల ఫలితం తప్ప మరొకటి కాదు. వరల్డ్కప్ సెమీస్ భారత్ ఆడటం, ఓడటంపైనే వేలాదిగంటల చర్చలు జరుగుతున్నాయి. టన్నులకొద్దీ న్యూస్ప్రింట్ ఖర్చవుతున్నది. సోషల్మీడియాలో కోట్లమంది ఇదే విషయమై మాట్లాడుతున్నారు. నిజానికి క్రికెట్ ఆడిన కొద్దిమందికీ, దాన్నించి లాభాలు ఆశించే బేహారులకు తప్ప ఇతరులకు ఏ మాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ గత నెలరోజులుగా క్రికెట్ని తింటూ, తాగుతూ, కలగంటూ కాలాన్ని వెచ్చిస్తున్నారు జనాలు.
మన ప్రాధాన్యాలు ఏమిటో మనకు తెలియకపోవడమంటే ఇదే. మీడియాలో వర్షాభావం, కరువు, కాషాయమూకల దాడుల గురించి కన్నా క్రికెట్కే ఎక్కువ ప్రాధాన్యం లభించడం గమనార్హం. వందలాది చానళ్ళలో బడ్జెట్ గురించి కన్నా క్రికెట్ గురించిన చర్చలే ఎక్కువ. పెట్టుబడి కూటముల మైండ్గేమ్లో సామాన్యుల మెదళ్ళు కుదేలయ్యాయి. ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఆలోచన కన్నా కోహ్లీ కప్పు తెస్తాడా లేదా అనే ఆలోచనే యువతని ఎక్కువ రంది పెట్టింది.
క్రికెట్ ఒక్కటే కాదు, రాజకీయాల్లోని మకిలితనం మీద చర్చోపచర్చలు జరుగుతుంటాయి. రాజకీయ చర్చలు మంచివే. ఈ చర్చలు రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనల్ని ప్రోది చేయాలి. కానీ రాజకీయాల్లో ఏ విలువలూ లేకపోవడమే ఒక విలువగా భావించే ధోరణికి ప్రాధాన్యం లభించడం గమనార్హం. ఒక సినిమా వస్తే ఆ సినిమా చుట్టూరానే సోషల్మీడియాలో చర్చలు సాగుతుంటాయి. ప్రేమ పేరుతో మనస్విని గొంతుకోసిన ఉదంతం మీద కన్నా కబీర్సింగ్ విజయం గురించి ఘనంగా చెబుతుంటారు.
ఆలోచనల్ని సైతం నియంత్రించే మార్కెట్ వ్యూహప్రతివ్యూహాల్లో మనుషులు తమ ప్రాధాన్యాల్ని మరచిపోతున్నారు. ఎవరినయితే వ్యతిరేకించాలో వారితోనే జతకడు తున్నారు. అప్పటివరకు ఎవరినయితే ద్వేషించారో వారితోనే చేతులు కలుపుతున్నారు. ఒక తీవ్రత నుంచి మరో తీవ్రతలోకి వెళుతున్నారు. డబ్బు, అధికారం కోసం ఏ సూత్రాలనైనా త్రోసిరాజనడం సరయిందేనన్న భావనకు బలం చేకూరడం జీవనరీతి అయింది.
పేద, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ధనిక వర్గాల జీవనశైలిని గమనిస్తే పేదలు మరింత పేదవాళ్ళు కావడమే కనిపిస్తున్నది. పాలకులు దయదలచి ఒసగే సంక్షేమఫలాల కోసం అర్రులు చాచే స్థితిలో జనాలు ఉండటం పట్ల ఎవరికీ బాధ లేదు. మధ్యతరగతి మరింత ఉన్నతస్థితికి వెళ్ళడానికి తాపత్రయపడుతున్నది. తమ పిల్లలకు, పిల్లల పిల్లలకు భద్రజీవితాన్ని అందించడమే మధ్యతరగతికి ముఖ్యమైంది. అణగారిపోతున్న వారి గురించి ఆలోచించే హృదయం మధ్యతరగతికి లేదు. హృదయరహిత స్థితికి లోనుచేసి డబ్బు కోసం, పై అంతస్థుల కోసం వెంపర్లాడే వర్గంగా మధ్యతరగతిని కుదించడంలో మార్కెట్శక్తులు పైచేయి సాధించాయి.
అందుకే సాటి మనుషుల పట్ల కూసింత దయా ప్రేమా చూపే స్వభావం కొరవడుతున్నాయి. తమ బతుకులో ఎక్కాల్సిన మెట్ల గురించి ఆలోచిస్తున్నారే తప్ప కింది మెట్ల దగ్గరే ఆగిపోయిన వారి గురించి పట్టించుకునే యోచన లేదు. ఈ నిర్లిప్తత, నిస్తేజం మూలంగానే ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడుతున్నా, ఫాసిజపు ఛాయలు పడగ విప్పుతున్నా కదలిక కనిపించడం లేదు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధి కోసం అల్లాడుతున్నా పట్టనట్టే ఉన్నారు. లక్షలాది మంది గిరిజనుల్ని అడవుల్నించి తరిమిగొట్టే పాలకుల దుర్మార్గపు విధానాలపై నోరు విప్పడం లేదు.
పొరుగువారిని ప్రేమించాలన్న భారతీయ సూక్తి కూడా సారం కోల్పోయింది. గేటేడ్ కమ్యూనిటీల్లోనో, విలాసవంతమైన విల్లాల్లోనూ భద్రజీవనం కోసం వెంపర్లాడే లక్షణమే కనిపిస్తున్నది. మనుషుల్ని ప్రేమించే స్వభావం మసకబారింది. అందుకే ఇక్కడ దయకు తావు లేదు. మమకారానికి చోటు లేదు. ఎవరి బతుకులో వారు బందీలయ్యారు. మరొక మనిషికి అండగా నిలబడాలన్న ధ్యాస లేదు. ఈ నేపథ్యంలోనే సంఘటిత పోరాటాలన్న భావం కనిపించడం లేదు. అయితే 'నా బతుకే నాకు ముఖ్యం' అనుకునే వారికి సైతం సెగ తగిలే పరిస్థితులు వ్యాపిస్తున్నాయి. సెగ తగిలితే తప్ప చలించని జాతి తన ప్రాధాన్యాల్ని మార్చుకోక తప్పని స్థితి నెలకొంటున్నది. ఇదే ఆగామి కాలపు వాస్తవం.