Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పంజాబు సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలదితరంగ'' అంటూ మన ఘనమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే జాతీయగీతం కీర్తికి చేటు కాలం దాపురిస్తోందా..!?
''ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కొరకు'' అన్న మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదం ముంచుకొస్తుందా..!? దేశంలో పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కర్నాటకలోని రాజకీయ సంక్షోభం కొనసాగు తుండగానే, గోవాలో 15మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 10మంది బీజేపీలోకి ఫిరాయిం చారు..! రేపో మాపో ఈ పరంపర మధ్యప్రదేశ్, రాజస్థాన్లకూ పాకే సూచనలూ స్పష్టంగానే కనిపిస్తున్నాయి..! అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలూ ఇందుకు మినహాయింపు కాదేమో..!
కర్నాటక పరిణామాల పట్ల పార్లమెంట్లో కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ స్పందిస్తూ.. ''ఈ సంక్షోభంతో మాకెలాంటి సంబంధం లేదు. అంతా కాంగ్రెస్, జేడీఎస్ల స్వయంకృతాపరాథం'' అని సెలవిచ్చారు. నిజమే.. తప్పనిసరి పరిస్థితుల్లో జేడీస్కు ముఖ్యమంత్రి పీఠమప్పగించారు తప్ప, అది మొదటి నుంచీ కాంగ్రెస్కు మింగుడు పడటం లేదనేది వాస్తవం. ఈ సంకీర్ణం మూలంగా సిద్దరామయ్య సహా మంత్రు లవుదామనుకుని కాలేకపోయిన కాంగ్రెస్ నేతలనేకులు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది కూడా వాస్తవమే కావొచ్చు. కానీ బీజేపీ నేతలు ఈ సంక్షోభంతో తమకేమీ సంబంధం లేదనడం మాత్రం అబద్ధం. బీజేపీకి ఏ సంబంధం లేకుండానే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రకు తరలించబడ్డారా? బీజేపీకి ఏ సంబంధం లేకుండానే బీజేపీకే చెందిన యాజమాన్యంలోని హౌటల్లో బస చేశారా? బీజేపీకి ఏ సంబంధం లేకుండానే కాంగ్రెస్ నేతలు హౌటల్లో ఉన్న తమ అసంతృప్తి ఎమ్మెల్యేలను కనీసం కలవడానికి కూడా వీలులేని ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? ఏ సంబంధం లేకుండానే బీజేపీ నేతలు మాత్రం నిరాటంకంగా వారిని కలుసుకుని తంత్రం.. మంత్రాంగాలు నెరుపుతున్నారా? మీడియా సాక్షిగా ఇవన్నీ చెబుతున్నదేమిటంటే.. ఈ సంక్షోభంలో కాంగ్రెస్, జేడీఎస్ స్వయంకృతా పరాథమెంతుందో, కమలనాథుల కరసేవ అంతకు మించి ఉన్నదనీ..! కాబట్టి ఇది ''ఆపరేషన్ లోటస్'' అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉండగానే గోవాలో 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 10మంది బీజేపీలోకి ఫిరాయించారు. 300కు పైగా సీట్లతో కేంద్రంలో అధికారానికొచ్చిన ఓ అతిపెద్ద పార్టీకి, ఈ అతి చిన్న రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేకపోయినా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి అగత్యమెందుకు..!? పైగా కాంగ్రెస్ తమలో విలీనమైందని దానికో ముసుగు! అంతకుముందు తమకు ఒక శాతం ఓట్లు కూడా రాని ఏపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను తమలో కలిపేసుకుని దానిని కూడా విలీనమని తమ అధికారబలంతో ధృవీకరించుకున్నారు. ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవని ఏపీలో త్వరలో ఏకంగా తమ శాసనసభా పక్షమే ఏర్పడబోతోందంటున్నారు. అంతేనా? ఒకేఒక శాసనసభ సభ్యుడున్న తెలంగాణలో కూడా త్వరలో తమ కమలం కొలువు దీరనుందట..! ఎన్నికలతో సంబంధం లేకుండా, ప్రజాతీర్పుతో పనే లేకుండా ఇదెలా సాధ్యం..! అంటే ఇక్కడ కూడా పెద్దఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించనున్నారా..? నేడు కర్నాటకలో జరుగుతున్నదే రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా అమలు చేయడానికి కమలనాథులు చేస్తున్న కసరత్తుల పరమార్థమేమిటీ? రాజకీయం ఫక్తు వ్యాపారమై, అధికారం అంగడి సరుకయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అమ్ముడు బొమ్మలయిపోయారు. విలువలు వదిలేసిన రాజకీయ పార్టీలన్నీ ప్రజాబలం మీద గాక అర్ధబలం, అంగబలంతో అధికారాన్ని గెలుచుకోవాలని చూస్తున్నాయి. ఇందులో బీజేపీది అగ్రస్థానం. కేంద్రంలో అధికారానికి తోడు ఎలక్టోరల్బాండ్స్ రూపంలో కార్పొరేట్ నిధులన్నిటినీ ఏకపక్షంగా తమ ఖజానాలో పోగేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అభ్యుదయ, వామపక్ష శక్తులు బలహీనపడిన వేళ... అందివచ్చిన అవకాశంగా అడ్డగోలుగా తన అధికారవ్యాప్తికి అంగలు చాస్తోంది.
బీజేపీకి మొదటి నుంచీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం లేదు. అందుకని కోట్లాదిమంది భారతీయుల విశ్వాసం మీద దెబ్బకొడుతోంది. ప్రజాస్వామ్య రాజకీయాల పట్ల ప్రజలను విసిగి వేసారే దశకు తెచ్చి, అంతిమంగా తాము కోరుకునే అధ్యక్షతరహా నియంతృత్వానికి దారులు తీయాలని యోచిస్తున్నట్టున్నది. ఇందుకు వాజ్పేయి హయాంలో రాజ్యాంగ సవరణకు వేసిన కమిషనే ఓ ఉదాహరణ. ఆ కమిషన్ ప్రతిపాదనల్లో ప్రధానమైనది అధ్యక్ష తరహా పాలన కావడం ఇక్కడ గమనార్హం! ఇక మోడీ హయాంలో జీఎస్టీ మొదలు జమిలి ఎన్నికల ప్రతిపాదన వరకూ అన్నింటా ఇదే వ్యక్తమవుతుండటం తాజా ఉదాహరణ. దేశంలో ప్రజాస్వామ్య హక్కుల్నీ, భిన్నత్వంలో ఏకత్వమనే వైవిధ్యాన్నీ బీజేపీ సహించలేకపోతున్నది. ఫలితంగా ఈ రోజున భారత ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది. ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేసి ప్రతిచోటా అధికార పీఠంపై తాము మాత్రమే ఉండాలని కోరుకుంటోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు పాతరేసి, ప్రజాస్వామ్యానికి గోతులు తీసి తాము నిర్మించదలచుకున్న ఒకే దేశం-ఒకే పార్టీ వ్యవస్థే ఈ దేశాన్ని సువిశాలంగానూ, ఐక్యంగా ఉంచుతుందని చెపుతున్న కమలనాథుల మాటల వెనుక మర్మాన్ని గ్రహించగలగాలి. అలా కాని పక్షంలో ఈ దేశంలో ప్రతిచోటా విచ్ఛిన్నకర ప్రమాద దృశ్యాలే కనిపిస్తాయి.