Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశంలో ఉన్న చందమామ కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చంద్రుణ్ణి చూపి బుజ్జగిస్తారు. ఇది రామాయణంలోని కల్పన. అదే చంద్రుడి మీద నివాసం కోసం చంద్రయాన్-2 ద్వారా పరిశోధనలు సాగిస్తున్నది నేటి భారతం. ఆకాశంలోకి బాణాలతో నిచ్చెన వేసి చంద్రుడిని అందుకోడానికి ప్రయత్నిస్తాడు భారతంలోని అర్జునుడు. ఇదొక సృజనాత్మక స్వప్నం. 'ఆకాశంలో ఒంటరి ఒంటెలాగా ఉంది జాబిల్లి' అన్నాడు శ్రీశ్రీ. ఆ జాబిల్లి స్వరూప స్వభావాల్ని తెలుసుకోడానికి మన శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఫలవంత మైన దిశలో సాగుతున్నాయి.
కథలూ కల్పనల కన్నా హేతువు ప్రధానం. కథ రమణీయంగా ఉంటే బాగుందంటాం. అది కథే కాని నిజం కాదనే స్పృహలోనూ ఉంటాం. కానీ కథలు కూడా నిజమని నమ్మమంటుంది కాషాయ రాజకీయ కూటమి. ఇక్కడే వైజ్ఞానిక భారతానికి, మూఢత్వం ఎజెండాగా అధికారం చెలాయించే పాలకవర్గానికి మధ్యన వైరుధ్యం తలెత్తింది. కల్పన కూడా వాస్తవం అని నమ్మించడానికి దశాబ్దాలుగా చేస్తున్న కుటిలత్వానిది పైచేయి కావడం వర్తమాన రాజకీయ వాస్తవం. రాముడు, అయోధ్య రామజన్మభూమి వంటి అంశాల చుట్టూరా తిరుగాడే సామాజిక, రాజకీయ చట్రాలు శాస్త్రీయ ఆలోచనా ధోరణికి పెనుసవాల్గా పరిణమించాయి. అందుకే 'జైశ్రీరామ్' అనే నినాదం దేశభక్తికి కొలమానంగా చెప్పే మూకస్వామ్యాన్ని ప్రశ్నించడం బుద్ధిజీవులకు అనివార్యమైంది. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక భజనపరుల బృందాలతో మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని చర్చకు పెడుతున్నాయి. ఇక్కడే నమ్మకాలకీ, నిజాలకీ మధ్యన వైరుధ్యం గమనార్హం.
ఈ దేశంలో శతాబ్దాలుగా రాముణ్ణి పూజిస్తున్నారు. రామాయణాన్ని అనేకులు మరలమరల రాస్తున్నారు. వందలాది రామాయణగాథల్ని తిరగ రాసినవారున్నారు. రామాయణంలోని ప్రక్షిప్తాలనీ, నిర్హేతుక ధోరణులనీ చర్చకు పెట్టిన రచనలున్నాయి. అనేక భాషల్లో రామాయాణ గాథలు సినిమాలుగా వచ్చాయి, వస్తున్నాయి. సత్యకామజాబాలి సంధించిన ప్రశ్నలు రాముణ్ణి బోనులో నిలబెట్టాయి. అయినప్పటికీ రాముణ్ణి నమ్మి పూజించేవారిని ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకు పూజిస్తున్నారని అభ్యంతరం చెప్పలేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవనే సహనంతో ఉన్నారు. రామాయణం కల్పన మాత్రమే అని తెలిసినప్పటికీ నిజంగా ఒకనాడు రాముడు ఉన్నాడని భ్రమించేంతగా రామాయణగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారంతో కూడా లౌకికవాదులు, హేతువాదులు, భౌతికవాదులు పేచీ పడలేదు.
క్రీ.పూ. 184-147 వరకు మగధను పాలించిన పుష్యమిత్రుని కాలంలో రామాయణం రచన జరిగిందని, ఆ రాజు పాలనకు రాముడి పాలనకు ఉన్న సారూప్యాలను చారిత్రకాధారాలతో నిరూపించారు. అయితే రమణీయమైన రచనగా రామాయణానికి ప్రాశస్త్యం ఉంది. అందువల్లనే జనబాహుళ్యంలో రామాయణగాథ ప్రాచుర్యం పొందింది. ఒక తరం నుంచి మరోతరానికి చెబుతున్న భారతీయ ఇతిహాసంగా రామాయణానికి ప్రాధాన్యం ఉంది. కానీ రాముణ్ణి కేంద్రంగా చేసుకొని చెలరేగే అమానవీయ రాజకీయ ధోరణులు ప్రశ్నార్థకం. 'ఏకత్వంలో భిన్నత్వం' అనే భారతీయ సామాజిక చింతనకు ఆటంకం. విభిన్న మతాల, విభిన్న సంస్కృతుల, విభిన్న భాషల, ప్రాంతాల పట్ల సహనంతో వ్యవహరించే జీవన సంస్కృతి ఈ నేల మీద ఉంది. దీనిని చిన్నాభిన్నం చేసే దుర్మార్గానికి తెరదీసిన వైనం పట్ల ఆలోచనాపరులు మౌనంగా ఉండలేరు. అందుకే భిన్న సామాజిక వర్గాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రయాన్ 2 ద్వారా భారతదేశం వైజ్ఞానిక ప్రగతిని సాధిస్తుందని గర్వపడాలా? జైశ్రీరామ్ అనకపోతే చంపేస్తారని భీతిల్లే పరిస్థితుల పట్ల చింతించాలా? అకారణంగా మనుషుల్ని అంతం చేసే మూకదాడుల బీభత్సం ఈ దేశాన్ని ఎటు తీసుకువెళుతుంది? ఆవుకు ఉన్న విలువ మనిషికి లేకపోవడం ఏ ప్రజాస్వామ్య ఫలశ్రుతి? ఏడు దశాబ్దాల స్వేచ్ఛాభారతం సాధించిన పరిణతికీ, ప్రగతికీ ఇది చిహ్నం? ఆలోచిస్తే, వివేచిస్తే అన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నల్ని భరించలేని అసహనం ఎల్లెడలా కనిపించే దృశ్యం. అయినప్పటికీ ప్రశ్నలు సంధించాల్సిందే.
మతవిశ్వాసాలు వ్యక్తిగతం. మతాధిపత్యం లేని పాలన భారత ప్రజాసామ్యానికి యశోభూషణంగా భావించారు ఒకనాటి నేతలు. ఇందుకు భిన్నంగా మత ప్రాతిపదికన సకల వ్యవస్థల్లో విభజన తీసుకువచ్చే దుర్నీతి భారతీయ తాత్విక చింతనకు విరుద్ధం. కనిపించని శక్తుల మీద నమ్మకం కలిగిన వారే గాక చార్వాకులు, లోకాయుతులు, మానవశక్తి మీద విశ్వాసం వుంచిన భౌతికవాదులు మన సమాజంలో అంతర్భాగం. భౌతికవాదాన్ని విశ్వసించకపోతే ఈ దేశం ఇంకా చీకట్లోనే మగ్గిపోయేది. సముద్రాల్ని దాటకూడదన్న మూఢనమ్మకాల్లోనే కునారిల్లి పోయేది. రాహుకేతువుల క్రీడలో బలయ్యే చంద్రుడి మీద పాదం మోపాలన్న ఆలోచన చేయకపోయేది.
శాస్త్రీయ చింతన, వైజ్ఞానిక సారాన్ని అంతర్భాగం చేసుకున్నందునే ప్రపంచంలో తనదైన స్థానం భారతదేశానికి ఉన్నది. ఇపుడు ఆ స్థానాన్ని చెరిపివేసే కుహనా దేశభక్తుల మూకస్వామ్యం అత్యంత ప్రమాదకరం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పని అనివార్యత వల్లనే మంచివ్యక్తులు మౌనం వీడుతున్నారు. సహనం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన విలసిల్లే దేశ క్షేమం కోసం మాట్లాడుతున్నారు. ఈ బుద్ధిజీవుల, ఆలోచనాపరులతో కలసి గొంతు విప్పడం అసలుసిసలు దేశభక్తుల కర్తవ్యం.