Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నంతా అయ్యింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హౌమ్ మంత్రి అమిత్షా పార్లమెంట్లో ప్రకటన చేసారు. కాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. దశాబ్దాల కాశ్మీరీల ఆకాంక్షలను ఫణంగా పెట్టి కేంద్రం కాశ్మీర్ను రెండు ముక్కలు చేస్తున్నది. అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్, అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ విడిపోయి కేంద్రం గుప్పిట్లోకి చేరాయి. ఏమీ లేదంటూనే గత వారం రోజులుగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, నేడు తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగ మనడంలో ఏ సందేహాలకూ తావులేదు. అలాగే కాశ్మీర్పై పాకిస్థాన్ దురాక్రమణనూ, దాని ఉగ్రవాద చర్యలనూ, విధానాలనూ ఖండించాల్సిందే, ఎండగట్టాల్సిం దేనన్నది కూడా నిర్వివాదాంశమే. అయితే ఆక్రమించుకోవడానికో లేదా స్వాధీనం చేసుకోవడానికో కాశ్మీర్ కేవలం ఓ భూభాగం మాత్రమే కాదు. ఓ జాతి ప్రజల అస్తిత్వం. అక్కడి ప్రకృతి దృశ్యాల సమాహారంలాగే ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలతో కూడిన ఓ జీవన విధానం. ఆ అస్తిత్వాన్నీ, జీవన విధానాన్నీ, కాపాడే స్వయం ప్రతిపత్తీ వాగ్దానం చేసి భారత్ కాశ్మీర్ను తనలో విలీనం చేసుకుంది. ఆ వాగ్దానానికి రాజ్యాంగబద్ధమైన రూపమే ఆర్టికల్ 370. దానిని రద్దు చేయటమంటే ఆ ప్రజల ఆకాంక్షల్ని కాలరాయడమే. రాష్ట్రాన్ని రెండుగా విభజించడమే గాక, వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం కేవలం తమ రాజకీయ ఆధిపత్యానికి ప్రజల జీవితాలను బలి తీసుకోవడమే. ఇది ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై ప్రభుత్వమే చేస్తున్న దాడి. భారత సమాఖ్య స్ఫూర్తికి అతిపెద్ద విఘాతం. రాజ్యాంగ విరుద్ధం.
నిజంగా కేంద్రం చెపుతున్నట్టు ఈ నిర్ణయం కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలకూ, కాశ్మీర్ అభివృద్ధికే అయితే సంతోషించాల్సిందే. కానీ తాము తీసుకుంది ప్రజానుకూల నిర్ణయమైనప్పుడు లక్షలాది రక్షణ బలగాలతో కాశ్మీర్ను దిగ్బంధనం చేయాల్సిన అవసరమేమొచ్చింది? మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ఎందుకు అర్థరాత్రి గృహనిర్బంధం చేయాల్సి వచ్చింది. వామపక్షనేత యూసఫ్ తరిగామి, కాంగ్రెస్నేత మాజిద్వంటి కాశ్మీర్ నేతలనేకులను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? అమర్నాథ్ యాత్రను రద్దుచేసి, యాత్రీకులను ఖాళీ చేయించి, విద్యాసంస్థలను మూసేసి, 144వ సెక్షన్ విధించి, ప్రజలను బంకర్లలో తలదాచుకొమ్మని సూచనలిచ్చి ఓ భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టించవలసి వచ్చింది? కాశ్మీర్ లోయను భయబ్రాంతులకు గురిచేస్తూ వారం రోజులుగా సాగుతున్న ఈ వరుస పరిణామాల పరంపర దేనికి సూచిక
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామాలూ చోటుచేసుకోవడం గమనార్హం! పార్లమెంటు ఉభయ సభల్లోనూ అనేక అనుమానాలూ, ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఏం చేయబోతున్నారో కనీసం పార్లమెంటుకయినా చెప్పండీ.. అని మొరపెట్టుకున్నా పట్టించుకోని ప్రభుత్వం ఉన్నట్టుండి ఏకపక్షంగా ఆర్టికల్ 370ని రద్దుచేస్తున్నామని ప్రకటించడం ప్రజాస్వామ్య లక్షణం అనిపించుకోదు. ఒకవైపు ఈ ప్రకటనపై సభలో చర్చ జరుగుతుండగానే మరోవైపు క్షణాలమీద రాష్ట్రపతి గెజిట్ విడుదల కావడం కూడా విస్మయానికి గురిచేస్తోంది! ప్రజలు ఎలాంటి ఆందోళనకూ గురికావద్దు, ఊహాగాలను, పుకార్లను నమ్మవద్దు, కేవలం భద్రతా కారణాల రీత్యానే అదనపు బలగాలను మొహరిస్తున్నామని నిన్నటిదాకా చెప్పి.. అకస్మాత్తుగా ఆ భయాందోళనలనూ, ఊహాగానాలనే నిజం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా కాశ్మీరుపై కాషాయ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల అమలుకు చేసిన ముందస్తు పన్నాగమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఇది ప్రజలను నిర్బంధించి రుద్దిన నిర్ణయం. పార్లమెంటునూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తీసుకున్న నిర్ణయం. భారత రాజ్యాంగాన్నీ అవమానించిన వైనం. ఇప్పటికే అభద్రతలో కొట్టుమిట్టాడుతున్న కాశ్మీరీలకు భరోసానిచ్చే నిర్ణయాల ద్వారా, వారి ఆశలూ ఆకాంక్షలూ కాపాడుతామన్న విశ్వాసాన్ని కల్పించడం ద్వారా కాశ్మీర్ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఎవరికి ఉపయోగం? దశాబ్దాలుగా నలుగుతున్న సున్నితమైన సమస్యకు కమలనాథులు కనుగొన్న ఇంత ప్రమాదకర పరిష్కారం ఎవరి మనసులను గెలుచుకోవడానికి? సైనిక బలగాల కవాతుల మధ్య ఇంత అనిశ్చితి సృష్టించి చేసిన ఈ నిర్ణయం ఏ సమైక్యతను నిర్మించడానికి? బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ నిర్ణయంతో కాశ్మీరు సమస్య పరిష్కారమైనట్టు, కాశ్మీరు పూర్తిస్థాయిలో భారత్లో విలీనమైనట్టు జరుగుతున్న ప్రచారం ప్రమాదకరం. నిజానికిప్పుడు సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమైంది. పాలకపార్టీకి కావాల్సింది కూడా అదే! ఈ చర్యతో దేశంలో సంఫ్ుపరివార్ అజెండాను ముందుకు తీసుకుపోవడమే కాదు, ఈ పేరున నిత్యం ప్రజల భావోద్వేగాలు చల్లారకుండా మండిస్తూ పోవచ్చు. అదే సందర్భంలో తమ పాలనా వైఫల్యాల నుంచీ ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం నుంచి దేశం దృష్టిని మళ్లించనూ వచ్చు. ఈ చర్యలకు అసలు కారణం ఇదే!