Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్ను రావణకాష్టం చేయడానికి బీజేపీ సర్కారుకు ఓటేసిన రెండు తెలుగు రాష్ట్రాల పాలక పార్టీలూ ప్రభుత్వాలూ తాజాగా విద్యా ప్రయివేటీకరణకు తెరలేపాయి. ప్రస్తుతం పేదలకు ఉన్న అత్తెసరు అవకాశాలను అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ సర్కారు అందకుండా చేస్తున్నాయి. ఇప్పటికే విద్యా ఆరోగ్య రంగంలో ప్రయివేటీకరణ నేపథ్యంలో సామాన్య ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్న సంగతి తెలుసు. నిరుపేద విద్యార్థులకు చదువుకునే పరిస్థితులు దుర్లభం అవుతుండగా, మరోవైపు ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించ కుండా ప్రయివేటుకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ తరుణంలో సమాజంలో 90శాతంగా ఉన్న సామాన్య పిల్లలకు చదువు గగన కుసుమమే అవుతున్నది. అందని మానిపండుగా మారింది.
ఇప్పటిదాకా పాఠశాలలు, కాలేజీలకే పరిమితమై ప్రయివేటీకరణ సాగగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పాలకపార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాల విధానాల నేపథ్యంలో ఏకంగా ప్రయివేటు విశ్వవిద్యాలయాలే కొలువు దీరనున్నాయి. దీంతో నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి గల అవకాశాలూ పరిస్థితులూ కృశించిపోతున్నాయి. అలాగే చదువును ఖరీదు చేయగలిగిన ఉన్నత వర్గాలకే విద్య అందనుంది. విద్యావ్యవస్థను గాడిన పడేస్తానని, దారిలో పెడతానంటూ గాంభీర్యం మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, తొలుత బడ్జెట్లో విద్యారంగానికి దాదాపు 10శాతం నిధులు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులు గత ఏడాదిలో ఆరుశాతానికే పరిమితం కావడం గమనార్హం. దీనిని ప్రశ్నిస్తే, ప్రభుత్వ ప్రాధాన్యతలు మారాయంటూ మళ్లీ దాటవేత మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. రేషనలైజేషన్ ద్వారా పిల్లలు లేరనే సాకుతో రాష్ట్రంలో దాదాపు 4వేలకుపైగా స్కూళ్లను మూసేసారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రభుత్వరంగంలో 404 ఉంటే, ప్రయివేటులో 1700 ! ఇకపోతే 14 ఇంజినీరింగ్ కాలేజీలు ప్రభుత్వానివి కాగా, 180 ప్రయివేటుకు చెందినవి ఉన్నాయి!! ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో 15 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి.
తాజాగా టీఆర్ఎస్ సర్కారు అసెంబ్లీలో బిల్లుపెట్టి మరీ ప్రయివేటు యూనివర్సిటీలకు గ్రీన్సిగల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిలయన్స్, టెక్మహీంద్రా, టాటా, ఒవైసీ సంస్థలు ప్రయివేటులో విశ్వవిద్యాలయాలను స్థాపించి లాభాలను దండుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. తద్వారా విద్యావ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసేందుకు సర్కారే స్వయంగా పావులు కదుపుతుండటం, కార్పొరేట్ వర్గాలకు సహకరిస్తుండటం ఎంతమాత్రం సహించరానిది. ఇదిలా వుండగా నెమ్మదిగా ప్రభుత్వం విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నది. అంతెందుకు 2017-18, 2018-2019 ఆర్థిక సంవత్సరాలకు గాను ఫీజు రీయింబర్స్మెంటు నిధులు రూ.3459 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకుండా తొక్కిపెట్టింది. తద్వారా రాష్ట్రంలోని ఆయా వృత్తి విద్యాకోర్సులతో పాటు ఇతర చదువుల్లో ఉన్న 5 నుంచి ఆరు లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పడేసింది. అంతేగాక ఇంతకుముందే కోర్సులు పూర్తయినా, ఫీజులు చెల్లించకపోవడంతో వారి సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఆయా విద్యాసంస్థలు పేద విద్యార్థులను సతాయిస్తున్నాయి. ఉద్యోగావకాశాలను సైతం కోల్పోవడానికి కారణమవుతున్నాయి. అలాగే గత ఐదేండ్లుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో దాదాపు 25వేల పోస్టులను భర్తీచేయకుండా పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ప్రయివేటు యూనివర్సిటీల ద్వారా చదువును బహిరంగ వేలానికి అనుమతించింది. రాజ్యాంగ హక్కు అయిన రిజర్వేషన్లకు చెల్లుచీటీ పాడింది. 25శాతం స్థానికులకు సీట్లు ఇస్తామంటూనే, ఉన్నతవర్గాలకు మాత్రమే చదువుకునేలా చట్టబద్ధ అన్యాయానికి వొడిగడుతున్నది. తద్వారా టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని మూటగట్టి విసిరికొట్టింది. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వామపక్షాలు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ఎన్జీవోలు, తల్లిదండ్రుల సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు గొంతు చించుకుని విద్యా ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నా, అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా లేకపోవడం దారుణం. ఇప్పటిదాకా ఉపాధి, పరిశ్రమలు, సెజ్ల పేర ప్రభుత్వ, రైతుల విలువైన భూములకు ఎసరుపెట్టిన విషయం అందరికీ ఎరుకే. తాజాగా ప్రయివేటు విశ్వవిద్యాలయాల పేర మరోసారి భూసంతర్పణకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమవుతున్నది. మానవవనరుల అభివృద్ధికి ఎంతో కీలకమైన విద్యారంగానికి నిధులు భారీగా కేటాయించాలని, అనేక కమిషన్లు చెప్పినా పాలకపార్టీలు పెడచెవిన పెడుతున్నాయి. సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కడ చదవాలో అర్థంకాని పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరం.