Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ క్రమ శిక్షణకు మారుపేరు మేమేనంటూ విర్రవీగే కమలనాథుల వికృత రూపమేమిటో ఇప్పుడు కర్నాటక పురవీధులలో దర్శనమిస్తోంది. గత ప్రభుత్వ భాగస్వాములైన జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల నుంచి 17మంది శాసనసభ్యులను రాజీనామా చేయించి జూలై 27న నీతిబాహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి ఆ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నాయి. జూలై 27న అసమ్మతి దెబ్బకు భయపడి కేవలం ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అప్పటినుంచి ఆయన ఆజ్ఞకోసం ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేసినా మంగళవారం మాత్రమే. అదీ కేవలం 17మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగారు. మంత్రివర్గ ఏర్పాటు ఇంత ఆలస్యమయ్యేందుకు కారణం కర్నాటక బీజేపీలో భగభగ రగులుతున్న అసమ్మతి. కాంగ్రెస్ అధిష్టాన సంస్కృతిని తలదన్నేలా సాగిన సుదీర్ఘ కసరత్తులో అధిష్టానం ఎన్నిప్రయత్నాలు చేసినా అసమ్మతిని మాత్రం చల్లార్చలేక పోయింది. మంగళవారం మంత్రివర్గాన్ని ప్రకటించిన వెంటనే సీనియర్ నేత, గడచిన సంకీర్ణాన్ని కూల్చడంలో కీలకపాత్ర వహించిన మాజీ మంత్రి రమేష్ జర్కిహౌళి రోడ్డెక్కారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు బావుటా ఎగరేసి, తక్షణం మంత్రివర్గంలో చోటు కల్పించకుంటే పార్టీని వీడడం ఖాయమని ప్రకటించారు. రమేష్ రోడ్డెక్కి 24గంటలయినా గడవకముందే ఆయన సొంతజిల్లా బెళగావికే చెందిన మరో సీనియర్ నేత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఉమేష్ కత్తి కత్తిదూసారు. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన కత్తిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు మంత్రి పదవీ చేజారింది. మరోవైపు గత ఎన్నికలలో ఓటమిపాలైన అదే జిల్లాకు చెందిన లక్ష్మణ సవదికి మంత్రిపదవి కట్టబెట్టడం అగ్నిలో ఆజ్యం పోసింది. మరోవైపు మంత్రులను ప్రకటించినప్పటికీ వారికి శాఖలు కేటాయించడం యడియూరప్పకు అసాధ్యంగా మారి ఇప్పుడు శాఖలులేని మంత్రులతో కర్నాటక ప్రభుత్వ పాలన సాగుతోంది. ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన 17మంది శాసనసభ్యులు తమ పరిస్థితి ఏమిటంటూ యడియూరప్ప వెంటపడుతున్నారు. అంతా గందరగోళం.. గిజిబిజి.. కుట్రలు, కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు కమ్ముకున్న రాజకీయ రొచ్చుకుంట. ఈ రొచ్చుకుంటలో నిస్సిగ్గుగా కమల విన్యాసం!
ఎలాగైనా దక్షిణాదిలో జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయ పీతాంబరులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఏ నీచానికయినా దిగజారుతున్నారు. తాము విధించుకున్న కట్టుబాట్లను స్వహస్తాలతో గంగలో కలుపుతున్నారు. యడియూరప్ప విషయంలో కూడా ఇదే జరిగింది. 75ఏండ్లు నిండినవారికి రాజకీయ విరమణ తప్పనిసరి అని ప్రకటించిన బీజేపీ యడియూరప్ప విషయంలో ఆ నియమాన్ని తుంగలో తొక్కింది. ఇందుకు కారణం యడియూరప్ప సొంత కులస్తులైన లింగాయత్లు కర్నాటకలో 17శాతం జనాభా కలిగి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గట్టిపట్టు కలిగి ఉండటమే. లింగాయత్లకు తిరుగులేని నేతగా వర్థిల్లుతున్న యడియూరప్ప వొదులుకోవడం ఎంతటి ఆత్మహత్యా సదృశ్యమో బీజేపీ అధిష్టానానికి తెలుసు. అందుకే, 2008-2011 మధ్య పాలన వెలగబెట్టిన కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణలపాలైన యడియూరప్పను గద్దెదించే సాహసం చేయలేదు. చివరకు లోకాయుక్త యెడ్డీను అభిశంసన చేసిన నేపథ్యంలో ఆయన అనుంగు అనుచరుడు సదానంద గౌడకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి దొడ్డిదారిన అధికారం చెలాయించే ఏర్పాటు చేశారే తప్ప పార్టీపరంగా చర్య తీసుకునేందుకు సాహసించలేక పోయారు.
నిజానికి, అచ్చం కాంగ్రెస్ అధిష్టానంలాగే బీజేపీ ఆయా రాష్ట్రాలలో తమ కీలుబొమ్మలతో కథ నడిపిస్తుందే తప్ప స్థానిక నాయకత్వం బలం పుంజుకునేందుకు అంగీకరించదు. బీజేపీ పాలనలోని మిగిలిన రాష్ట్రాలలో ఇప్పుడు అదే జరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో సైతం బీజేపీ అధిష్టానం సొంత శక్తిసామర్థ్యాలతో బలం పుంజుకోకుండా, తమ చెప్పుచేతల్లో ఉండే నాయకులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. కానీ యడియూరప్ప విషయంలో మాత్రం లెక్క తప్పింది. అయినప్పటికీ యెడ్డీకి పూర్తి స్వేచ్ఛనిస్తే ఏమవుతుందోనన్న సంకోచంతో ముఖ్యమంత్రి పదవిని నవ్వులపాలుజేస్తూ, ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కి ప్రతి నిర్ణయానికీ అధిష్టానంపై ఆధారపడక తప్పని స్థితి కల్పిస్తోంది.
మొత్తానికి కర్నాటక పరిణామాలు ఒక్క సత్యాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. బీజేపీలో నీతీ, నిజాయితీ, క్రమశిక్షణ, కట్టుబాటు.. వాళ్ళు సగర్వంగా ఇన్నాళ్ళూ చాటిచెప్పుకుంటూ వస్తోన్న సమస్త విలువలూ చితికెక్కాయన్నదే ఆ సత్యం!