Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో నిధుల ఖర్చుకు సంబంధించిన వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసేశారు. 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సైతం వాస్తవికంగా రూపొందించాలని సూచించారు. అన్ని విషయాల్లోనూ ప్రణాళిక అవసరమని సెలవిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లోగా మంత్రులు, కార్యదర్శులకు మరింత విడమర్చి చెబుతానని కూడా ఉన్నత స్థాయి సమీక్షలో పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని ఆ దిశలో సమాయత్తం చేయడం అవసరమే. కానీ ప్రజలను ఆదుకునేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం సర్కారు చేస్తున్నది ఏమిటి? ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఇతరులకు ఉపదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వాధినేతగా క్రమశిక్షణను ఆచరణలో తానుమాత్రం పెట్టేందుకు సిద్ధంగాలేరు. వాస్తవానికి రాష్ట్రంలో కరువు ఇప్పటికే విలయ తాండవం చేస్తున్నది. నిరుపేదలు పనుల కోసం నగరాలకు వలసబాట పట్టారు. సర్కారు ఇస్తున్న ఆసరా పింఛన్లు కాస్తా రెండు నెల్లకోసారి గానీ ఇంటి తలుపులు తట్టడం లేదు. గ్రామాల్లో వృద్ధులు, చిన్నారుల పరిస్థితి ఘోరంగా ఉంది. రాష్ట్రంలో 250కిపైగా మండలాలు శాశ్వత కరువుకు చిరునామాగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) తేల్చింది. సర్కారు ఖజానా నిండుకుందనే సంగతిని ఆర్థిక సమీక్షల ద్వారా సీఎం చెప్పకనే చెప్పేశారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాల్లో ఉందని, క్రమశిక్షణ అవసరమని ఘంటాపథంగా అంటున్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కరువు దెబ్బకు ఆకలికి నకనకలాడుతున్న సామాన్య పేదలపై తాజా ఆర్థికమాంద్యం పడగ విప్పనుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ గురించి హితవు పలుకుతున్న సీఎం, పేద ప్రజల బాగోగులపై ఒక్క మాటైనా మాట్లాడకపోవడం విచిత్రంగా ఉంది. కేంద్రం నుంచి ఒక్క ఏడాది మినహా ఇతర అన్ని సందర్భాల్లోనూ కరువు నిధులను రాబట్టుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రమంతా 1972 తర్వాత అతిపెద్ద కరువు వచ్చినా స్పందనలేదు. పైపెచ్చు ధనిక రాష్ట్రమంటూ తరుచుగా భుజాలు తడుముకుంటూ ఇప్పుడు ఏకంగా ఆర్థిక మాంద్యం ముచ్చట ముందుకు తెచ్చి క్రమశిక్షణ పాటించాలంటూ నీతిసూక్తులు వల్లించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గల్లా పెట్టె ఖాళీగా ఉండటంతో ప్రతిష్టాత్మక పథకాలకు సైతం నిధులు సర్దలేని దుస్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడటం తెలిసిందే. కింద పడ్డా తనదే పైచేయి అనిపించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? అనే భావం కలుగుతున్నది. ఖజానాలో కాసుల గలగలలు తగ్గిపోయాయి. కాబట్టి క్రమశిక్షణ పేరుతో కట్టడి చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి. అయితే, వాస్తవ పరిస్థితి ఇప్పుడు చేయిదాటి పోయిందని ఆర్థికరంగ నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు బ్యాంకులు ఏడాది కాలంగా రుణాలు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. రైతుబంధు, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. 2019లో సర్కారు రూ.6,319 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో కలుపుకుని మొత్తంగా గత ఐదేండ్లలో రాష్ట్రం నెత్తిమీద రూ.2.5 లక్షల కోట్ల అప్పుల మూటను టీఆర్ఎస సర్కారు ఎత్తింది. సగటున నెలకు రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మేర వడ్డీ చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. ఇంతటి దారుణస్థితికి కారణం ఎవరు? మొదటి నుంచి దుబారా తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదా? అఖిలపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష పాలన చేస్తూ విలువైన ప్రజాధనాన్ని అవసరం లేని పనులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రంలో ప్రస్తుతం ఆధునీకరణ పేర జరుగుతున్న తంతు రాష్ట్రాన్ని, ప్రజలనూ అధ్ణపాతాళానికి నెట్టేందుకే ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలను నిధుల కొరత వేధిస్తున్నది. అభివృద్ధి కార్యక్రమాలదీ దాదాపు అదే దీనస్థితి. బడ్జెట్ను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఎక్కువ చేసి చూపించుకోవడం, ఆ తర్వాత ఆయా పథకాల పద్దులను నిధుల లేమి వెక్కిరించడం మన ధనిక రాష్ట్రంలో సర్వసాధారణమైంది. అప్రధాన పనులకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల డొక్కలను సర్కారు ఎండబెడుతున్నది. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలుచేయడంలో, తనవంతు మ్యాచింగ్ను ఇవ్వడంలో వెనుకపడిందనే చెప్పాలి. ప్రజలకు అనువైన చోట, మంచి భవనాలు గల సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టాల్సిన అవసరమేంటి ? దీని పేర రూ.600 కోట్లు ఖర్చు బెట్టడమేమిటి? అసెంబ్లీ పేర మరో రూ.200 కోట్లు, గుడులూ, గోపురాల ఖాతాలో యాదాద్రికి ఇప్పటిదాకా రూ.600కోట్ల వ్యయం చేశారు. ఇంకా రూ.1000 నుంచి రూ.1200 కోట్లను ఖర్చుపెట్టాలని ఇప్పటికే సర్కారు తన ప్రణాళికను రచించింది. వీటిని బట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో లేవని స్పష్టమవుతున్నది. అసలే కరువు,కాటకాలు, ఆపైన ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో నిరుపేదల పరిస్థితి ఎలా ఉంటుందో కనీస ఆలోచన కూడా చేయకపోవడం ఆందోళనకరం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.