Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతవారం ఫ్రాన్స్లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన దేశాల నాయకులు హాజరవుతుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత పరుష పదజాలంతో చైనాపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించాడు. చైనా అధ్యక్షుడిని తమ 'శత్రువు' అని పేర్కొంటూ చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై విధిస్తున్న సుంకాన్ని విపరీతంగా పెంచాడు. అంతేకాకుండా అమెరికా కంపెనీలు చైనాతో వ్యాపారం చేయవద్దనీ, ఆ దేశం నుంచి అమెరికా కంపెనీలు నిష్క్రమించాలని 'ఆదేశిస్తున్నా' అని ప్రకటించాడు.
ట్రంప్ అక్కడితో ఆగలేదు. అమెరికా ఎగుమతులకు చైనా, ఇతర దేశాల ఎగుమతులతో పోటీపడే సామర్థ్యం పెంచేందుకు డాలర్ విలువను తగ్గించాలని సూచించినా చేయవలసినంత చేయటం లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధినేత జే పోవెల్ను ట్రంప్ తీవ్రంగా విమర్శించాడు. ఒక దేశాధ్యక్షుడు ఒక అత్యున్నతాధికారిపై ఇలా విమర్శ చేయటం చాలా ఆశ్చర్యం. కరెన్సీ యుద్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రిజర్వ్ కరెన్సీగావున్న అమెరికా డాలర్ను ఒక అయుధంగా మార్చాలనే ధ్యేయం ట్రంప్లో కనపడుతుంది. దీనితో ప్రపంచ ఆర్థిక, రాజకీయ పునాదులు కదులుతాయనటంలో సందేహంలేదు.
అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించటమే కాకుండా సైనికంగా కూడా రెచ్చగొడుతోంది. తైవాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమ్ముతోంది. కొన్ని రకాల అణ్వస్త్రాల ఉత్పత్తిని పరిమితంచేసే ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. కేవలం నెలల వ్యవధిలోనే చైనాకు సమీపంలో మధ్య శ్రేణి క్షిపణులను మోహరించటం జరుగుతుందని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ అన్నాడు.
చైనా నుంచి అమెరికా కంపెనీలను నిష్క్రమించమన్న ట్రంప్ 'ఆదేశం' ప్రపంచంలో ఒక విస్పోటనంగా సంభవించిన అమెరికా ఆర్థిక జాతీయవాదం, రక్షిత విధానం, సైనిక సన్నద్దతలలో ఒక మైలురాయి అవుతుంది. ఈ ప్రక్రియ ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ప్రత్యక్షంగా వ్యక్తమౌతోంది.
1980-90దశాబ్దాలలో సంస్కరణలను చైనా విజయవంతంగా అమలు చేసిన తరువాత అమెరికాకు చెందిన పెట్టుబడిదారీ వర్గం ఒకవైపు తమ కార్పొరేట్ కంపెనీలను చైనాకు తరలిస్తామని బెదిరిస్తూ అమెరికాలో కార్మికుల వేతనాలను పెరగకుండా తొక్కిపెట్టి, మరోవైపు చైనాలో చౌకగా భారీ స్థాయిలో లభించే శ్రమశక్తిని వాడుకుని విపరీతంగా లాభాలను గడించింది. అయితే అచిరకాలంలోనే చైనా పరిశ్రమలు సెమికండక్టర్ డిజైన్, ఉత్పత్తి, సెల్ఫోన్లు, ఉన్నత శ్రేణి మెషిన్ టూల్స్, వైద్య రంగ పరికరాలు, తదతర హైటెక్, హై వ్యాల్యు వస్తువులను ఉత్పత్తి చేస్తూ అమెరికా కంపెనీలతో పోటీ పడటం ప్రారంభించాయి. దీనితో అంతర్జాతీయ కార్మికుల శ్రమను దోచుకుని కూడబెట్టిన అమెరికా కార్పొరేట్ కంపెనీల లాభాలకు గండిపడే ప్రమాదం ఏర్పడింది.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో కొనసాగుతున్న పెను సంక్షోభం నేపథ్యంలో ఇదంతా జరుగుతోంది. ప్రపంచంపై తాను కోల్పోతున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే వ్యూహంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడి అదిరింపులు, బెదిరింపులు ఉన్నాయి. అమెరికాకున్న అపరిమిత సైనికశక్తి దన్నుగావుందన్న దురహంకారం అమెరికా పాలకవర్గంలో ఉంది. అదే ట్రంప్ బెదిరింపుల్లో ప్రతిబింబిస్తోంది. ఈ సందర్బంగానే జాతీయ భద్రతను వాణిజ్యం, ఆర్థిక విషయాలనుంచి విడదీయలేమని, చైనా సామర్థ్యం అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సామర్థ్యం అనీ, దాన్ని ఆ దేశం నిర్మించిన వాణిజ్య సంబంధాల ప్రత్యక్ష పర్యవసానం ఫలితంగా చూడాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో అన్నాడు. వేరే మాటల్లో చెప్పాలంటే చైనా ఆర్థికాభివృద్ధిని ఒక సైనికశక్తిగా అమెరికా చూస్తోంది. ఈ సైనిక శక్తి నుంచి పొంచివున్న ప్రమాదాన్ని వాణిజ్య యుద్ధంతోగానీ, ప్రత్యక్ష యుద్ధంతోగానీ ఎదుర్కోవాలని అమెరికా భావిస్తోంది.
ఈ సందర్బంగానే అమెరికా కంపెనీలు చైనాను వీడాలని ట్రంప్ 'ఆదేశించటానికి' ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణ పరిస్థితులలో అమెరికా అధ్యక్షులకు అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఉండదు. కానీ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షులకు ఆర్థిక వ్యవస్థను సమీకరించటానికి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. ట్రంప్ ఇప్పటికే అటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయాడు. జోక్ గానే అయినప్పటికీ 2020 సంవత్సర అధ్యక్ష ఎన్నికలు ఉండకపోవచ్చని ఆయన ఒకసారి అనటం జరిగింది. పర్యవసానంగా డౌ జోన్స్ పారిశ్రామిక సూచీ 600పాయింట్లకంటే ఎక్కువగా పతనం అయింది.
ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ను నిందించటంవల్ల అమెరికా పాలక వర్గాలలో కూడా కలవరం మొదలయింది. అయితే ట్రంప్ పద్ధతులను అంగీకరించకున్నా చైనా విషయంలో అమెరికా పాలక వర్గాలలో ఏకీభావమే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికిగల ప్రయోజనాలే దీనికి కారణం. ట్రంప్ విధానాలను రాజకీయంగా వ్యతిరేకించే ప్రతిపక్షం లేకపోవటం అత్యంత విషాదకరమైన విషయం. అయితే ప్రగతిశీల శక్తుల ఆశ అంతా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో చెలరేగుతున్న ప్రజాపోరాటాలపైన ఉంది. ఈ పోరాటాలే సామ్రాజ్యవాద ప్రేరిత యుద్ధ కాంక్షను నిలువరించ గలుగుతాయి. అంతిమంగా ఈ పోరాటాల ఫలితంపైనే మానవాళి భవిత నిర్దారితమౌతుంది.