Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తరువులు అతిరసభార గురుతగాంచు...
జగతిని ఉపకర్తలకు ఇది సహజగుణము'' అంటూ వృక్ష సముదాయాల ఘనతను గొప్పగా శ్లాఘించాడు భర్తృహరి. సమస్త జీవకోటికీ ప్రాణాధారం అరణ్యం. అడవులు మానవాళి మనుగడకు సోపానాలే కాదు, అనేక జీవరాసులకూ అద్భుత జీవ వైవిధ్యానికీ ఆవాసాలు. పర్యావరణ సమతుల్యానికి పట్టుగొమ్మలు. నదీనదాలకు వర్షాధారాలు. ఈ భూగోళానికి జీవధాతువైన ఆ అరణ్యం నేడు ఆపదలో ఉంది. ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేస్తున్న వికృతాల మూలంగా అరణ్యం అదృశ్యమై పోతోంది. ఫలితంగా అనంత జీవజాలంతో పాటు మానవ మనుగడకూ ప్రమాదం ఏర్పడింది. కొందరు స్వార్థ మానవుల లాభాపేక్షకు అడవులతోపాటే భూమి, ఆకాశం, గాలి, నీరు, సమస్త ప్రకృతీ విధ్వంసానికి గురవుతోంది. ఇది ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడిస్తోన్న సత్యం.
ఇటీవల అమెజాన్ అడవుల్లో భగ్గుమన్న కార్చిచ్చు, ఆస్ట్రేలియా అడవుల్లో చేలరేగిన మంటలతో అరణ్యాలు దహించుకుపోతున్న వార్తలు హృదయాలను కలచివేస్తున్నాయి. పుడమికి ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్ వర్షారణ్యం అగ్నికి ఆహుతవుతుంటే ప్రపంచమంతా ఆవేదన చెందుతుండగా.. ఇప్పుడు మన నల్లమల గుండెలను కూడా యురేనియం తవ్వకాలతో ఛిద్రం చేసే ప్రయత్నాలు ఆశనిపాతాలై కమ్ముకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ విపరీతాలకు, విధ్వంసాలకు కారణం ఎవరు? ఒక్క మన భారతదేశమే 10 కోట్ల మంది ఆదివాసీలకు ఆవాసం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల గిరిజన తెగలకూ, కోట్లాది ఆదివాసీ సమూహాలకూ, అంతకు మించిన అనంత జీవ జాతులకూ స్వర్గతుల్యమైన అరణ్యాలను అంతమొందిస్తున్నదెవరు? వేల టన్నుల వ్యర్థాలతో నదులను కలుషితం చేస్తున్నదెవరు? అడవిని నమ్ముకుని, అడవిని కాచుకుని, తాము బతుకుతూ,అడవిని బతికిస్తూ ప్రపంచానికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తున్న సమస్త జీవజాతినీ అడవుల నుంచి తరిమేస్తున్నదెవరు? అడవుల్లో లభించే ఇంధనం, ఖనిజం కోసం వాటి ద్వారా వచ్చే అంతులేని లాభాల కోసం అర్రులు చాస్తున్న పారిశ్రామిక వేత్తలూ కార్పొరేట్ కంపెనీలూ కాదా? కొందరి లాభాపేక్ష కోసం అందరి జీవితాలను బలి పెడుతున్న ప్రభుత్వాలు కాదా..?
ఆఖరి చెట్టును కూడా నరికివేశాక, తుట్టతుది నదిని కూడా కలుషితం చేశాక అప్పుడు తెలుసుకుని మాత్రం ఏం ప్రయోజనం.. డబ్బును తిని బతకలేమని! భూగోళం వేడెక్కడానికీ, పర్యావరణం దెబ్బతినడానికీ, నేడు మానవ మనుగడే ప్రమాదంలో పడి ప్రశ్నార్థకం కావడానికీ కారణమేమిటి? కేవలం కొద్ది మంది పెట్టుబడిదారుల లాభాల కోసం సమస్త ప్రకృతినీ తాకట్టు పెడుతున్న ప్రభుత్వాల విధానలు కాదా? వనరులపై ఆధిపత్యం కోసం ఎంతటి విధ్వంసానికైనా తెగబడుతున్న స్వార్థం ముందు సమస్త మానవ ప్రయోజనాలు బలికావడం కంటే విషాదమేముంటుంది!
కండ్లముందరి విధ్వంసాన్ని చూస్తుంటే ఓ కవి ఆత్మఘోష గుర్తుకొస్తోంది.. ''ఎప్పటిలాగే ఆ రోజూ తెల్లారింది. కండ్లు తెరచి చూసే సరికి ప్రకృతి ఎక్కడికో వెళ్లిపోయింది. కనుచూపు మేర ఒక్క చెట్టూ కనబడటం లేదు! అడవులు మాయమయ్యాయి. పశుపక్షాదులు లేవు. కుంటల్లో, చెరువుల్లో, నదుల్లో చివరికి సముద్రాల్లోనూ చుక్కనీరు లేదు! ఎటు చూసినా యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. క్షణక్షణానికీ ప్రాణవాయువు తగ్గిపోతోంది. మనుషులు ఒక్కరొక్కరుగా చనిపోతున్నారు. సూర్యుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. కోట్లాది రూపాయల విలువైన భవంతులు, కార్లు, నగలు, డబ్బు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం, మొబైల్ ఫోన్లతో పరిసరాల మొత్తాన్నీ పరిచేసిన ప్లాస్టిక్ వెక్కిరిస్తున్నది. ఈ స్వార్థపరులకూ ఊపిరందకపోవడంతో అప్పుడు గుర్తొచ్చింది... ఎవడిష్టానికి వాడు కలుషితం చేసి పారేసిన గాలి. దాహంతో గొంతెండిపోతుంటే అప్పుడు కావాలనిపించింది గుక్కెడు నీళ్లు. అప్పుడు కండ్ల ముందు కనిపిస్తోన్న విలువైన వస్తువులన్నీ ఉన్నట్టుండి పనికిరానివిగా మారిపోయాయి. చూస్తుండగానే మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే... రాలిపోవడానికి సిద్ధంగావున్నవారందరి ఆశా ఒక్కటే. ఊపిరి నిలబెట్టుకోవడానికి కాస్త గాలి కావాలి.. గుక్కెడు నీళ్లు కావాలి. అంతే..! కానీ ఈ ఆశ తీరాలంటే ప్రకృతి మళ్లీ తిరిగి రావాలి. పచ్చని చెట్లు కావాలి. స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి. కానీ ఎలా..?'' ఇదీ ఆ కవి ప్రశ్న. కానీ సమాధానం మిగిలుందా..!? మనిషికి ప్రకృతితో అనుబంధం తెగిపోయినప్పు డు.. మిగిలేది వినాశనమే అని చెప్పడానికి ఇదో ఉదాహరణ.
అడవులను తవ్వడమంటే ఈ సమస్త విశ్వాన్నీ విధ్వంసం చేయడమే. సమస్త మానవాళినీ విస్థాపితులను చేయడమే. ''అణుయుద్ధంలో అంతా సర్వనాశనమైనా బీజరూపంలో భూగర్భంలో దాగి అదును చూసుకుని తిరిగి మొలకెత్తే చేవ.. సృష్టి మొత్తంలో ఒక్క మొక్కకే ఉంది'' అంటారు నోబెల్ గ్రహీత జగదీశ్ చంద్రబోస్. అందుకే అడవిని రక్షించుకోవడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం. ఈ భూమి, ఆకాశం, అరణ్యం, సముద్రం మనకు పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు. అవి సహజ వనరులు. వాటిని మనం ఏ రూపంలో అందుకున్నామో, అదే రూపంలో భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనది. మన పిల్లలు కాసింత గాలి కోసం, గుక్కెడు నీటి కోసం అలమటించకుండా ఉండాలంటే అడవిని కాపాడుకోవాలి. అందుకు పెట్టుబడి చేసే దోపిడీనే కాదు, దానికి వత్తాసు పలికే ఏలికలనూ ఎదిరించక తప్పదు.