Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరాన్పై యుద్ధ ప్రకటనతో సమానమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా పున్ణవిధించి సంవత్సరం దాటింది. 2015లో ఇరాన్కు, ప్రపంచంలోని ప్రధాన రాజ్యాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై సంతకం చేసిన తరువాత గతంలో ఇరాన్పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలగి ఇరాన్లో ప్రభుత్వాన్ని కూలదోయాలనే వ్యూహాన్ని అమలుచేయాలని చూస్తోంది.
ఈ వ్యూహాన్ని అనుసరించి ఇరాన్లో సైనికంగా జోక్యం చేసుకోవటానికి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తోంది. ఈ కార్యాచరణకు 'గరిష్ట వత్తిడి' అనే పేరు పెట్టారు. ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వీర్యంచేసి ఆ దేశ ఆదాయానికి గండికొట్టాలనేది అమెరికా పన్నాగం. ఒక అంచనా ప్రకారం ఇరాన్ ముడి చమురు ఎగుమతులు 80శాతం దెబ్బతిన్నాయి. అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థికంగా మరణ యాతన అనుభవిస్తున్నదని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఊహాతీతమైన స్థాయిలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల ఫలితంగా ఎనిమిదిన్నర కోట్ల ఇరాన్ ప్రజలు అన్యాయంగా శిక్షింపబడుతున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీయటమే కాకుండా అమెరికా ఆంక్షల కారణంగా అమెరికా ఆధిపత్యంలోని ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థ నుంచి కూడా ఇరాన్ వెలివేయబడింది. దానితో సాంకేతికంగా అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపబడిన ఆహారం, ఔషధాలను దిగుమతి చేసుకోగల ఇరాన్ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయటం జరుగుతోంది.
తత్ఫలితంగా పసిపిల్లల ప్రాణాలను రక్షించటానికి కావలసిన మందులు కూడా అందుబాటులో లేకపోవటంవల్ల అనేకమంది మరణిస్తున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. ఆర్థిక ఆంక్షల వల్ల విస్తృతమైన ఇరాన్ ఔషధ పరిశ్రమకు చెందిన సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. దానితో అందుబాటులో ఉండే ఔషధాలు మరింతగా తగ్గిపోయి మరణాల సంఖ్య బాగా పెరిగింది. అంతేకాక ఆర్థిక ఆంక్షల కారణంగా ఆహారం, ఆవాసం, ఇతర మౌలిక అవసరాల వ్యయం విపరీతంగా పెరగటంతో ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారు.
అయినప్పటికీ ఆర్థిక ఆంక్షలవల్ల ఇరాన్ ప్రభుత్వం అస్థిరతకు గురయినట్టు కనిపించటం లేదు. ఒకవైపు ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుండగా మరోవైపు ఇరాన్ పాలక పెట్టుబడిదారీ వర్గాలు లాభాలను గడిస్తూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్ను క్రమంగా సైనికంగా ముట్టడిస్తోంది. గత నెల చివరిలో చమురు, వాణిజ్య నౌకల రక్షణ కోసం సంయుక్త సముద్ర జలాల భద్రత పేరుతో పర్షియన్ గల్ఫ్లోని హౌర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలలో బ్రిటన్, ఆస్ట్రేలియా, బహరీన్ వంటి దేశాలు మాత్రమే పాల్గొన్నాయి.
ఇరాన్ భూభాగంపై ఎగురుతున్న గూఢచార డ్రోన్ను ఇరాన్ కూల్చినందుకు ప్రతిగా కేవలం 10నిముషాలలోనే ఇరాన్లోని లక్ష్యాలపై దాడిచేయగలమని ట్రంప్ ప్రకటించిన 10రోజులకే అమెరికా నౌకా విన్యాసాల నిర్వహణకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ట్రంప్ ఇరాన్పై దాడి చేయకపోవటానికిగల కారణం ఆయన చెబుతున్నట్టుగా ఇరాన్ ప్రజలకు ప్రాణహాని జరుగుతుందని కాదు. ఇరాన్పై దాడిచేస్తే అందుకు ప్రతిగా ఇరాన్ చేసే ఎదురుదాడిలో అనేకమంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముండటమే. అంతే కాదు, అమెరికా యుద్ధ నౌకలు పర్షియన్ గల్ఫ్లో ముంచివేయబడే అవకాశం కూడా ఉంటుందని అమెరికా సైనికాధికారులు హెచ్చరించటం వల్లనే ఇరాన్పై తాను చేయదలచిన దాడిని ట్రంప్ విరమించాడు. అప్పటినుంచి అమెరికా ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. గత బుధవారంనాడు ఇరాన్ చమురు ఎగుమతులను స్తంభింపజేయటానికి మరింత విస్తృతమైన ఆంక్షలను అమెరికా విధించింది. దేశంలోను, యావత్ ప్రపంచంలోను అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నందునే ఇరాన్పట్ల అమెరికా విధానం ఇంతగా లెక్కలేకుండా ఉంది. ఒకవైపు చర్చలంటూ, మరోవైపు పూర్తిస్థాయి యుద్ధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడే ఊగిసలాడుతున్నాడు. గత నెలలో జరిగిన జీ7 సదస్సులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒక రాజీ ప్రతిపాదన చేశాడు. అయితే అదో 'ఫ్రెంచ్ పథకం' అని అమెరికా దాన్ని ఆమోదించలేదు. దీనితో ఐరోపాకు చెందిన ప్రధాన దేశాలకు, అమెరికాకు ఇరాన్పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంపై విబేధాలున్నట్టు తేలింది.
క్షీణిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి గత మూడు దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న నిరంతర యుద్ధాలతో అమెరికన్లు బాగా విసిగిపోయారు. అలాగే ప్రభుత్వం, కార్పొరేట్ మీడియాలు నిత్యం చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇరాన్ ప్రజలపై అమెరికా సాగిస్తున్న క్రూర ఆర్థిక ఆంక్ష లను ఎత్తివేయాలన్నా, వివిధ దేశాలలో అమెరికా సాగిస్తున్న సైనిక దమన కాండ నిరోధించాలన్నా అమెరికాలోను, అంతర్జాతీయంగాను ప్రజలను శాంతి ఉద్యమంలో సమీకరించాలి. అందుకు ఇదే సరియైన సమయం.