Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 3న ఇరాన్ జనరల్ సులేమానీని హత్య చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన తీరు గురించి ఆదివారంనాడు న్యూయార్క్ టైమ్స్ ఒక సవివరమైన కథనాన్ని ప్రచురించింది. సులేమానీని హత్య చేయటమనేది క్షణికావేశంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదనీ, అది కార్యనిర్వాహక, గూఢచారవర్గాల మద్దతుతో 18నెలల క్రితమే పథకరచన జరిగిందనీ ఆ కథనం చెబుతోంది. ఈ కథనం ప్రకారం ఈ హత్యకు ముందుగా ప్రణాళిక రచించినవారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, సీఐఏ డైరెక్టర్ జినా హాస్పెల్ ఉన్నారు.
ఒక నేరగ్రస్త రాజ్య దృశ్యాన్ని టైమ్స్ కథనం సాక్షాత్కరింప జేసింది. గత రెండు దశాబ్దాలలో 'వార్ ఆన్ టెర్రర్' పేరుతో అమెరికా విదేశాంగ విధానం నేరపూరితంగా మారిందనే వాస్తవానికి ఇదొక సాక్ష్యం. ఇలా సాధారణీకరింపబడిన చట్టవ్యతిరేకత మీడియాకు కూడా పాకింది. టైమ్స్ కథనం అమెరికా వీరత్వ ప్రదర్శనగా సాగింది. తాను వివరిస్తున్న కథనంలోని చర్యలు నేరపూరితమైనవనే స్పృహ టైమ్స్కు ఏమాత్రం లేకుండాపోయింది. ఇరాన్కు చెందిన సులేమానీని ఇరాక్లో హత్యచేసిన తీరుపై టైమ్స్ అందించిన కథనంలో 'చట్టబద్ధత' అనే మాటే కనపడదు.
సులేమానీతో అమెరికాకు 'తక్షణ ప్రమాదం' ఉండటంవల్లనే హత్య చేశామని ట్రంప్ చెప్పినదానిలో వాస్తవం లేదని టైమ్స్ వ్యాసం వివరించింది. అనేక అమెరికా వైఫల్యాలకు సులేమానీయే కారణమని అమెరికా భావిస్తోంది. 2019 చివరికల్లా సులేమానీ నేతృత్వంలో ఇరాన్ అనేక విజయాలను సాధించింది. అనేక ఏండ్లుగా నలుదిశలా అంతర్యుద్ధం సాగుతున్నా ఇరాన్ మిత్రుడైన సిరియా అధ్యక్షుడు అస్సద్ తన రాజధాని డమాస్కస్లో అధికారంలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇజ్రాయిల్ సరిహద్దులో ఖుద్స్ బలగాలు శాశ్వతంగా తిష్టవేయగలిగాయి. సులేమానీ సహకారంతో రూపొందిన అనేక మిలీషియాలు ఇరాక్ ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంలో జనరల్ సులేమానీని, రివల్యూషనరీ గార్డ్సుకు చెందిన ఇతర నాయకులను ఎలా హత్య చేయాలనే విషయంపై చర్చలు జరిగాయి. ఈ పథకాన్ని అమలు చేయటానికి సెప్టెంబర్లో అమెరికా సెంట్రల్ కమాండ్, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్లను చేర్చుకున్నారు. హత్యకు గురవటానికి కొన్ని రోజులముందు సులేమానీ హెజ్బుల్లా నాయకుడు హస్సన్ నస్రల్లాను లెబనాన్లో కలిశాడు. అమెరికా మీడియా దృష్టి సులేమానీపై పడిందనీ, అది అతని హత్యకు భూమిక ఏర్పరచటంగా ఉంటుందని నస్రల్లా హెచ్చరించినట్టు టైమ్స్ కథనంలో ఉంది. సులేమానీని తుదముట్టించకపోతే పరిస్థితులు మరింతగా దిగజారతాయని సిఐఏ డైరెక్టర్ జినా హాస్పెల్ పదేపదే హెచ్చరించింది. ఈమె బుష్ పాలనా కాలంలో ఖైదీలను హింసించిన కేంద్రాలకు అధినేత్రి.
టైమ్స్ కథనంలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అదేమంటే రాబోయే అభిశంసన ప్రక్రియలో తనకు మద్దతునిస్తున్న రిపబ్లికన్ యుద్ధపిపాసుల్ని సంతృప్తిపరచాల్సి ఉంటుందని ట్రంప్ తన అధికారులతో అన్నాడట. ఇదే నిజమైతే సులేమానీ హత్యానేరంలో అమెరికా అంతర్గత రాజకీయ అంచనాల పాత్ర కూడా ఉంది. ఒక వ్యక్తిని హత్య చేయటాన్ని అమెరికా రాజ్యాంగం గానీ, చట్టాలు గానీ ఆమోదించవు. అలాగే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా హత్యలను ఆమోదించవు. 1975 సెనేటర్ ఫ్రాంక్ చర్చ్ అధ్యక్షతనగల సెనేట్ కమిటీ అనేకమంది విదేశీ నాయకులను హత్యచేయాలనే సీఐఏ పథకాన్ని ఎండగట్టింది. దానితో అప్పటి అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ రాజకీయ హత్యలకు ఉద్యోగులు దూరంగా ఉండాలని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేయవలసి వచ్చింది. సులేమానీ ఒక సార్వభౌమ రాజ్యమైన ఇరాన్కు చెందిన ఉన్నతాధికారి. ఆయన అధికారికంగా ఇరాక్ ప్రధానిని కలవటానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. ఇదొక యుద్ధనేరమే కాకుండా యుద్ధ ప్రకటన కూడా.
సులేమానీ హత్య యుద్ధ నేరమని తెలిసినా, ఇది అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకమైనదైనప్పటికీ ఇందుకు ట్రంప్ను అభిశంసించాలని లేక విచారించాలని ఏ ఒక్క రిపబ్లికన్గానీ, డెమోక్రాట్గానీ కోరలేదు. నిరంతరాయంగా లక్షలాది ప్రజల ప్రాణాలను బలితీసుకునే ఘోరమైన యుద్ధాలు చేస్తున్నా అమెరికా సామ్రాజ్యవాద ప్రాబల్యం క్షీణత ఆగటంలేదు. ఆర్థిక అస్థిరత, సామాజిక అసమానతల తీవ్రత, వర్గ పోరాటాల వృద్ధివంటి విషయాలు అమెరికాను మరింతగా కుంగదీస్తు న్నాయి. నేరాలకు పాల్పడటం ద్వారా మాత్రమే పాలకవర్గాలు తమ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చు కోగలిగే పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడి అమెరికా ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తోంది.
అమెరికాలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు డెమోక్రాటిక్ లేక రిపబ్లికన్ పార్టీలు సిద్ధంగా లేవని ఖాస్సెమ్ సులైమనీ హత్య మరోసారి నిరూపించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుకోవాలన్నా, యుద్ధోన్మాదం, నియంతృత్వంవైపు పాలకవర్గాల పయనాన్ని నిలువరించాలన్నా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలి.